‣ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రవేశ ప్రకటన
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో చదువుకునే అవకాశం వచ్చింది. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రొగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం) కోర్సులో ప్రవేశానికి ఐఐఎం రోహ్తక్ ప్రకటన విడుదలచేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. విజయవంతంగా పూర్తి చేసుకుంటే బీబీఏ, ఎంబీఏ డిగ్రీలను ప్రదానం చేస్తారు.
ఐఐఎం రోహ్తక్ 2019-2020 విద్యా సంవత్సరం నుంచి అయిదేళ్ల ఐపీఎం కోర్సు అందిస్తోంది. తాజా ప్రకటన మూడో బ్యాచ్కు చెందినది. మేనేజ్మెంట్ విద్యపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇందులో చేరడానికి ప్రాధాన్యమివ్వవచ్చు. అయిదేళ్ల కోర్సులో ఏడాదికి మూడు చొప్పున మొత్తం 15 టర్మ్లు ఉంటాయి. ఒక్కో టర్మ్ వ్యవధి 3 నెలలు. కోర్సులో రెండు భాగాలుంటాయి. మొదటి భాగంలో ఫౌండేషన్ కోర్సులపై దృష్టి సారిస్తారు. రెండో భాగంలో మేనేజ్మెంట్ విద్యలో మెలకువలు అందిస్తారు. కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఐఐఎం రోహ్తక్ ఎంబీఏతోపాటు బీబీఏ డిగ్రీ ప్రదానం చేస్తుంది.
అయిదేళ్లకూ కోర్సు ఫీజు రూ.30.51 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటి మూడేళ్లు సీజీపీఏ కనీసం 5 ఉంటేనే చివరి రెండేళ్ల కోర్సు చదవడానికి అవకాశం ఉంటుంది. మూడేళ్ల కోర్సు అనంతరం వైదొలిగినవారికి బీబీఎ డిగ్రీ అందిస్తారు.
ఆప్టిట్యూడ్ టెస్టు
ఇందులో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగాన్నీ 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే అడుగుతారు. సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.
పర్సనల్ ఇంటర్వ్యూ
ఆప్టిట్యూడ్ టెస్టులో అర్హత సాధించినవారికి ఆన్లైన్లో పర్సనల్ ఇంటర్వ్యూలను జులై నాలుగో వారంలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అకడమిక్స్, జనరల్ అవేర్నెస్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పరిశీలిస్తారు.
తుది నియామకాలు
ఇందులో ఆప్టిట్యూడ్ టెస్టు స్కోర్కు 45 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూ 15 శాతం, అకడమిక్స్ అంటే పదోతరగతి, ఇంటర్లో చూపిన ప్రతిభకు 40 శాతం వెయిటేజీ ఉంటాయి. ఫలితాలు ఆగస్టు రెండో వారంలో వెలువడతాయి. సెప్టెంబరు మొదటి వారం నుంచి అకడమిక్ సెషన్ మొదలవుతుంది.
ముఖ్యమైన అంశాలు
అర్హత: పదోతరగతి, ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం తప్పనిసరి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జులై 31, 2021 నాటికి 20 ఏళ్లలోపు ఉండాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: మే 4
దరఖాస్తు ఫీజు: రూ.3890
రాత పరీక్ష తేదీ: జూన్ 12. మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు
వెబ్సైట్: https://www.iimrohtak.ac.in/