సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్(సీఐపీ), హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ- హెచ్)లు ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో సంయుక్తంగా ఎంటెక్లో ఆప్తాల్మిక్ ఇంజినీరింగ్ అనే కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టాయి.

ఐ(కంటి) సంబంధిత టెక్నాలజీలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు నిపుణులైన ఆప్తాల్మిక్ ఇంజినీర్లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కోర్సును ప్రవేశపెట్టారు. ఆరోగ్య రంగంలో ఆప్తాల్మిక్ కేర్, ఇంజినీరింగ్లో ఆప్టిక్స్, బయోమెకానిక్స్, కంట్రోల్స్ ఇంజినీరింగ్, ఆప్తాల్మాలజీలు కలగలిసి.. మెడికల్, ఇంజినీరింగ్ రంగాల మధ్య వారధిలా ఈ కోర్సు ఉండబోతోంది. ఆప్తాల్మిక్ను కెరియర్గా ఎంచుకోనున్న ఆప్తాల్మాలజిస్టులకు, ఆప్టోమెట్రిస్టులకు, మెడికల్ కాలేజీ విద్యార్థులకు, ఇంజినీర్లకు చక్కటి అవకాశంగా మారనుంది. ఆగస్టు నెల నుంచి అందుబాటులోకి రానున్న ఈ కోర్సు పూర్తి వివరాలివి...
కోర్సు: ఎంటెక్- ఆప్తాల్మిక్ ఇంజినీరింగ్; కాలవ్యవధి: రెండేళ్లు, ఈ ప్రోగ్రామ్లో మొత్తం 4 సెమిస్టర్లుంటాయి. రెండు సెమిస్టర్లు కోర్సుకు సంబంధించినవైతే, మిగతా రెండు రిసెర్చ్ ప్రాజెక్టు కోసం కేటాయించారు. రెండేళ్ల కోర్సుకు మొత్తం 52 క్రెడిట్స్ ఉంటాయి. మొదటి ఏడాదిలో రెండు సెమిస్టర్లకుగానూ, ఒక్కో సెమిస్టర్కు 14 క్రెడిట్స్ ఉంటాయి.
‣ రెండో ఏడాదిలో రెండు సెమిస్టర్లు, ఒక్కోదానికి 12 చొప్పున క్రెడిట్స్ ఉంటాయి. ఈ రెండు సెమిస్టర్లు పూర్తయ్యేకాలంలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇండస్ట్రీ వ్యవస్థాపకులతో మాట్లాడగలిగే నైపుణ్యాల్ని నేర్పిస్తారు.
అర్హత: బీటెక్లో ఏదైనా స్పెషలైజేషన్ పూర్తిచేసి ఉండాలి లేదా ఎంబీబీఎస్ లేదా ఆప్తాల్మాలజీలో ఎండీ/ఎంఎస్ లేదా ఆప్టోమెట్రీలో బీఎస్/ ఎంఎస్ లేదా ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్లో ఎమ్మెస్సీ పూర్తిచేసినవారు అర్హులు.
ఏం నేర్చుకుంటారు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆప్టికల్/ డిజైన్/ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ల ప్రాథమికాంశాల్ని ఆప్తాల్మాలజీ, దాని టెక్నాలజీలో భాగంగా నేర్చుకుంటారు. అధునాతన టెక్నాలజీలైన.. సెన్సార్/ కంట్రోల్ సిస్టమ్/ ఏఐ- ఎంఎల్/ ఆప్టోఎలక్ట్రానిక్స్ల్లో ఏవైనా 3 లేదా 4 టెక్నాలజీలపై పూర్తి శిక్షణ అందిస్తారు. ప్రత్యేకంగా సాంకేతికత ఉపయోగించి క్లినికల్ రిసెర్చ్, ధ్రువీకరణ పద్ధతులు నేర్పిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారు విజన్ సైన్స్ లేదా ఇంజినీరింగ్/ టెక్నాలజీ రిసెర్చ్లో పీహెచ్డీకి అర్హులవుతారు. అంతేకాక ఎల్వీపీఈఐ లాంటి ప్రముఖ సంస్థలో ఉపాధి పొందే అవకాశముంది. ఇండస్ట్రియల్ గ్రేడ్ కెమెరా తయారీ సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీల్లోనూ ఉద్యోగావకాశాలు వీరిని వరించనున్నాయి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ/పురుష అభ్యర్థులకు- రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళా అభ్యర్థులకు- రూ.250/-.
దరఖాస్తులకు చివరితేదీ: జులై 7
ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్: https://iith.ac.in/mtechadmissions/
వెబ్సైట్: ope.admissions@iith.ac.in