డిగ్రీ, పీజీ లేదా ఇంజినీరింగ్ పూర్తిచేసినవారు మాత్రమే సాధారణంగా ఐటీ రంగంలో ఉద్యోగాలను సాధించగలరు అనుకుంటాం. కానీ హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్) టెక్నాలజీస్ - ‘టెక్బీ ప్రోగ్రామ్’ కింద ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా ఇంటర్ పాసైన విద్యార్థులకు 12 నెలల శిక్షణను అందిస్తోంది.
టెక్ బీకి ఎవరు అర్హులంటే: విద్యార్థులు ఇంటర్మీడియట్లో మ్యాథమేటిక్స్/ బిజినెస్ మ్యాథమేటిక్స్ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మ్యాథమేటిక్స్/ బిజినెస్ మ్యాథమేటిక్స్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 2020, 2021లో ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రుల మీద భారం పడకుండా అవసరమైన ఆర్థిక సహకారాన్ని హెచ్సీఎల్ అందిస్తుంది. నోయిడా, లఖ్నవూ, నాగ్పుర్, చెన్నై, హైదరాబాద్, మదురై, విజయవాడల్లో ఈ శిక్షణ అందుబాటులో ఉంటుంది.
పనిచేస్తూనే చదువుకోవచ్చు: ఇంటర్న్షిప్ సమయంలో నెలకు రూ.10,000 స్టైపెండ్ లభిస్తుంది. శిక్షణ పూర్తయిన అభ్యర్థులను హెచ్సీఎల్లోనే పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకుంటారు. ఉద్యోగులుగా పనిచేస్తూ ఏడాదికి రూ.1.70-2.20 లక్షల వరకు వేతనాన్ని పొందవచ్చు. మరో చక్కని అవకాశం ఏమిటంటే... హెచ్సీఎల్లో పనిచేస్తూనే బిట్స్, పిలానీ లేదా శాస్త్ర యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ స్థాయి, విద్యార్థి చూపే ప్రతిభ ఆధారంగా పాక్షిక/ పూర్తిస్థాయి ఫీజును హెచ్సీఎల్ చెల్లిస్తుంది.
ఈ ప్రోగ్రామ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హతలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష తేది, హాల్టికెట్ వివరాలను వ్యక్తిగతంగా తెలియజేస్తారు. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వెబ్సైట్: https://www.hcltechbee.com/