‣ 137 ఇంజినీర్, ఆఫీసర్ల పోస్టులు
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని, నవరత్న సంస్థల్లో ఒకటైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఘజియాబాద్ యూనిట్లో సేవల నిమిత్తం 137 ఇంజినీర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు ఏడాది నుంచి గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు విధుల్లో కొనసాగే అవకాశం ఉంది.
ట్రెయినీ ఇంజినీర్/ఆఫీసర్, ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులను తాజా ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటిలో ట్రెయినీ ఇంజినీర్-1/ ట్రెయినీ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైనవారు ఏడాది పాటు విధుల్లో కొనసాగుతారు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థి సమర్థత ప్రాతిపదికన సేవలు పొడిగిస్తారు. వీరు గరిష్ఠంగా మూడేళ్లు పాటు ఉద్యోగంలో కొనసాగుతారు. వీరికి మొదటి ఏడాది రూ.25 వేలు, రెండో సంవత్సరం రూ.28 వేలు, మూడో ఏట రూ.31 వేలు చెల్లిస్తారు. ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టుల్లో చేరినవారు రెండేళ్ల ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వర్తించాలి. అప్పటి అవసరాలు, ఉద్యోగి సమర్థత ప్రాతిపదికన ఈ వ్యవధిని మరో రెండేళ్లు పొడిగిస్తారు. వీరికి తొలి సంవత్సరం రూ. 35 వేలు, రెండో ఏడాది రూ.40 వేలు, మూడో సంవత్సరం రూ.45 వేలు, చివరిదైన నాలుగో ఏట రూ.50 వేలు ప్రతి నెలా చెల్లిస్తారు. ఈ పోస్టులు ఘజియాబాద్ కేంద్రంలో ఉన్నాయి. వీరు సంస్థ అవసరాల నిమిత్తం దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడాలి.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను మార్కుల మెరిట్, పని అనుభవం ప్రకారం వడపోస్తారు. అకడమిక్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఉంటుంది. 10 శాతం అనుభవానికి, 15 శాతం ఇంటర్వ్యూకు కేటాయించారు. కనీస అనుభవం ఉన్నవారికి 2.5 మార్కులు ఇస్తారు. ప్రతి ఆరు నెలల అదనపు అనుభవానికీ 1.25 మార్కులు చొప్పున కలుపుతారు. అకడమిక్ మార్కులు, అనుభవం ప్రకారం మెరిట్ లిస్టు తయారుచేస్తారు. వీరికి ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 26
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులకు రూ. 500. ట్రెయినీ ఇంజినీర్/ఆఫీసర్ పోస్టులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
వెబ్సైట్: https://bel-india.in