భారత పార్లమెంట్ వ్యవహారాలను నేరుగా అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు ఓ చక్కని అవకాశం! రాజ్యసభలో ఫెలోషిప్, ఇంటర్న్షిప్లను చేసే వీలును రాజ్యసభ కల్పిస్తోంది. సంబంధిత ప్రకటన ఇటీవలే విడుదలైంది. గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
రాజ్యసభ రిసెర్చ్ అండ్ స్టడీ స్కీమ్ (ఆర్ఎస్ఆర్ఎస్) ద్వారా విద్యార్థులకు ఇంటర్న్షిప్, ఫెలోషిప్ అవకాశాలను రాజ్యసభ కల్పిస్తోంది. వీటిని 2009 నుంచి ఏటా అందిస్తున్నారు. ఈ ఏడాదికిగానూ తాజాగా ప్రకటన విడుదలైంది. రాజ్యసభ ఫెలోషిప్, రాజ్యసభ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఇంటర్న్షిప్ పేరిట వీటిని అందిస్తున్నారు.
రాజ్యసభ ఫెలోషిప్
పార్లమెంటరీ వ్యవస్థల నిర్వహణ, అవి ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలు మొదలైన వివిధ అంశాలపై దీనిలో దృష్టిపెడతారు. మొత్తం 4 ఫెలోషిప్లు అందుబాటులో ఉన్నాయి. కాలవ్యవధి 18 నెలలు. గడువు ఇంకా ఆరునెలలు పొడిగించే అవకాశమూ ఉంది.
అందుకునే మొత్తం: రీసెర్చ్ గ్రాంటు కింద మొత్తం రూ.8లక్షలు చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని దశలవారీగా చెల్లిస్తారు. ఎంపికైనపుడు 20%, డ్రాఫ్ట్ రిపోర్టు సమర్పించాక 30%, తుది డ్రాఫ్ట్ రిపోర్ట్ సమర్పించాక 30%, తుది మొత్తాన్ని రిపోర్ట్ రాజస్యభ చైర్మన్ ఆమోదం పొందాక చెల్లిస్తారు. కాంటింజెన్సీ గ్రాంట్ కింద రూ. 50,000 కూడా చెల్లిస్తారు.
ఎవరు అర్హులు?
‣ సంబంధిత విద్యార్హత ఉన్నవారు/ సోషల్ సైన్స్, లా ఇతర సంబంధిత అంశాల్లో కనీసం మాస్టర్స్ డిగ్రీ చేసినవారు అర్హులు. ఎంఫిల్, పీహెచ్డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్ర శాసన సభలకు చెందిన మాజీ సభ్యులకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
‣ వయసు 25 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులను రాజ్యసభ చైర్మన్ పరిధిలోని రిసెర్చ్ అడ్వైజరీ కమిటీ (ఆర్ఏసీ) పరిశీలించి, అర్హులను ఎంపిక చేస్తుంది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్ http://rajyasabha.nic.in లోని అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని పూర్తిచేసి, rksahoo.rs@sansad.nic.in కు ఈమెయిల్ పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మార్చి 31, 2020
రాజ్యసభ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఇంటర్న్షిప్స్
భారతీయ పార్లమెంట్లోని ముఖ్యంగా రాజ్యసభలోని వివిధ విభాగాల పనితీరును తెలుసుకునే వీలు కలుగుతుంది. సెక్రటేరియట్లోని ప్రముఖ విభాగాలు- శాసన విభాగం, టేబుల్ ఆఫీస్, బిల్ ఆఫీస్, కమిటీ సెక్షన్ మొదలైన వాటిల్లో అవకాశం కల్పిస్తారు. సంబంధిత విభాగాల అధిపతుల ఆధ్వర్యంలో వీరు పనిచేస్తారు. ఇంటర్న్షిప్ల సంఖ్య 10. వీటిలో అయిదింటిని గ్రాడ్యుయేట్లకూ, మరో అయిదింటిని పోస్ట్ గ్రాడ్యుయేట్లకూ కేటాయించారు. ఇంటర్న్షిప్ వ్యవధి రెండు నెలలు.
ఇంటర్న్స్కు వారు నిర్వర్తించాల్సిన విధులను మొదట్లోనే తెలియజేస్తారు. వారు తమ పనితోపాటు, పని అనుభవాన్ని సంబంధిత సూపర్వైజర్/ మెంటర్కు రిపోర్ట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. విజయవంతంగా పూర్తిచేసినవారికి సర్టిఫికెట్నూ అందజేస్తారు.
అందుకునే మొత్తం: నెలకు రూ.10,000 చొప్పున స్టైపెండ్ అందజేస్తారు.
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ, పీజీ చదువుతున్నవారు అర్హులు. వేసవి సెలవుల్లో భాగంగా ఈ ఇంటర్న్షిప్ను చేసే వీలు కల్పించారు.
దరఖాస్తులను రాజ్యసభ సెక్రటరీ జనరల్ సూచనల మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది.
ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్ http://rajyasabha.nic.in లోని అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని పూర్తిచేసి, http://rajyasabha.nic.in కు ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మార్చి 31, 2020