జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్: నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఒక్కసారిగా కదలిక మొదలైంది. సర్కారు కొలువులను ఎలాగైనా కొట్టాలన్న సంకల్పంతో లక్షల మంది సన్నద్ధత దిశగా సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో కోచింగ్ తీసుకుంటూనే మరోవైపు సంయుక్తం(కంబైన్డ్)గా సన్నద్ధమవ్వాలా..? ఒక్కరే ఉంటూ చదువుకోవాలా? అన్న సందేహం ఎక్కువ మందికి కలుగుతోంది. ముఖ్యంగా శిక్షణ కేంద్రాలు అధికంగా ఉండే అశోక్నగర్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో అద్దె ఇళ్లు, హాస్టళ్లలో అభ్యర్థులు బృందాలుగా ఉంటుంటారు. ఒక్కరమే ఉండి చదువుకుంటే బాగుంటుందేమోనన్న సందేహమూ వారిని తొలుస్తూ ఉంటుంది.
కంబైన్డ్ స్టడీతో లాభాలివీ..
* సన్నద్ధమవడానికి ఒక ప్రేరణ(మోటివేషన్) ఉంటుంది. పక్కవారు చదువుతుంటే మనమూ చదవాలన్న తపన పెరుగుతుంది.
* కొన్ని అంశాలపై చర్చించుకోవచ్చు. దీంతో బాగా గుర్తుండిపోతాయి.
* అద్దె, భోజనం, పుస్తకాల ఖర్చులు తగ్గుతాయి.
నష్టాలివీ..
* అనవసర చర్చలు, వాదనలతో సమయం వృథా అయ్యే అవకాశం.
* నిద్ర, చదువుకు ఒక్కొక్కరూ ఒక్కో కాలపట్టిక పెట్టుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి.
ఎక్కువ మంది వద్దు
కంబైన్డ్ స్టడీ చేయడం ప్రయోజనమే. కాకపోతే ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉండొద్దు. అన్ని రకాల సబ్జెక్టులు, అంశాలు అందరూ అర్థం చేసుకోలేరు. చర్చించుకోవడంతో త్వరగా ఆకళింపు చేసుకోవచ్చు. ఏదైనా అంశంపై తక్కువ సమయంలో సమాచార సేకరణ చేసి మిగిలిన వారితో పంచుకోవచ్చు. - నూతనకంటి వెంకట్, పోటీ పరీక్షల నిపుణుడు
ఒకే మనస్తత్వం గలవారైతే మంచిది
ఒకరు బాగా సన్నద్ధమయ్యేవారు, మరొకరు తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక వచ్చి చదువుకునేవారు, ఇంకొకరు తనకే మొత్తం తెలుసు అనే మనస్తత్వం ఉండేవారు.. ఇలాంటి బృందం ఒక దగ్గర చేరితే చదువు గాడి తప్పుతుంది. అభిప్రాయభేదాలు, గొడవలు తలెత్తుతాయి. అందుకే దాదాపు ఒకే మనస్తత్వం, ఒకే స్థాయి తెలివితేటలు ఉండేవారు ఒకచోట ఉంటూ సన్నద్ధమైతే ప్రయోజనం ఉంటుంది. - గోపాలకృష్ణ, సంచాలకుడు, బ్రెయిన్ ట్రీ శిక్షణ సంస్థ
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.