‣ 8 నుంచి 12 సంవత్సరాల పిల్లలే లక్ష్యం
ఇటలీకి చెందిన రచయిత అల్ఫ్రెడో కొవెలి భారతీయ బాలల కోసం రచించిన “వాహనమాస్టర్క్లాస్” పుస్తకం దేశీయమార్కెట్లోకి విడుదలైంది. ముఖ్యంగా ఎనిమిది నుంచి 12 సంవత్సరాల లోపు వారే లక్ష్యంగా రాసిన ఈ పుస్తకాన్ని స్కాలస్టిక్ ఇండియా ప్రచురించింది. భారతీయ పురాణాలు, సంస్కృతి ఇతర దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. భారతీయులు దేవతలను కొలిచే విధానాన్ని విదేశీయులు ప్రశంసిస్తుంటారు. మన సంస్కృతి, పురాణాలను చూసి ఇష్టపడుతుంటారు. భారతదేశ సంస్కృతిలోని గొప్పదనం మన దేశ రచయితలనే కాకుండా ఇతర దేశాల వారినీ అన్వేషించడానికి ప్రేరేపిస్తుంది. ఆల్ఫ్రెడోకు మనదేశ సంస్కృతి, పురాణాలపై ఎంతో ఆసక్తి ఉంది. దీంతో ఆయన పిల్లల కోసం వినాయకుడిపై ఒక కథ రాయడానికి స్ఫూర్తి పొందారు. వినాయకుడు తన కొత్త వాహనం కోసం విశ్వం మొత్తం వెతికినకథను ఈ పుస్తకం వివరిస్తుంది.
కొవెలి తన పుస్తకం గురించి మాట్లాడుతూ.. “నా మొదటి పుస్తకాన్ని భారతదేశంలో విడుదల చేయడానికి సంతోషిస్తున్నాను. ఇక్కడి సంస్కృతి, హిందూ మతం పట్ల నాకు ఎంతో ఆసక్తి ఉంది. అదే నాకు ఈ పుస్తకం రాయడానికి స్ఫూర్తినిచ్చింది. ఇంగ్లిష్లో ఇది నా మొదటి పుస్తకం. పిల్లల కోసం రాయడం కూడా ఇదే తొలిసారి. ఈ పుస్తకం నాలుగు ఎలుకల పురాణ సాహసం గురించి వివరిస్తుంది. అవి తర్వాత వినాయకుడి వాహనంగా ఎలా మారాయనే విషయాలు ఇందులో ఉంటాయి” అని తెలిపారు.
పురాణాలపై బాలలకు కొత్త పుస్తకం
Posted Date : 09-12-2020 .