‣ నీలిట్ ప్రకటన విడుదల
ప్రభుత్వ సంస్థల్లో ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నించేవారికి హరిద్వార్లోని నీలిట్ అవకాశం కల్పిస్తోంది. ఆధునిక సాంకేతికతల్లో వేసవి ఇంటర్న్షిప్లను అందిస్తోంది. సంబంధిత ప్రకటన తాజాగా విడుదలైంది. టెక్నికల్ అంశాల్లో గ్రాడ్యుయేషన్, పీజీ చేసినవారు అర్హులు.
సాంకేతిక అంశాల ప్రాధాన్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రతి రంగంలోనూ నూతన టెక్నాలజీలు (సాంకేతికతలు) చొచ్చుకొస్తున్నాయి. దీంతో ఎన్నో ప్రత్యేక ఉద్యోగాలూ ఏర్పడుతున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వాటిని అందిపుచ్చుకోవడం ఒక్కటే మార్గం. కానీ వాటిలో ఏది తగినదో తెలుసుకుని, అనుభవపూర్వకమైన పరిజ్ఞానం సంపాదించడం కొంత కష్టం. ఇలాంటివారికి ఇంటర్న్షిప్, షార్ట్టర్మ్ కోర్సులు మంచి మార్గం.
తాజాగా హరిద్వార్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్) సరికొత్త సాంకేతికాంశాల్లో ఆన్లైన్ ఇంటర్న్షిప్లకు ప్రకటన విడుదల చేసింది. మే- జూన్ సెషన్ నిమిత్తం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే స్వయం ప్రతిపత్తిగల సంస్థ. ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీల్లో మానవ వనరులను అభివృద్ధి చేయడం సంస్థ ఉద్దేశం.
వేటిల్లో?
‣ మెషిన్ లర్నింగ్
‣ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ అపాచి, మైఎస్క్యూఎల్, పీహెచ్పీ
‣ క్లౌడ్ కంప్యూటింగ్
‣ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
‣ మ్యాట్ల్యాబ్ ప్రోగ్రామింగ్
‣ ప్రోగ్రామింగ్ ఇన్ పైతాన్
‣ బిగ్ డేటా అనలిటిక్స్
‣ జావా ప్రోగ్రామింగ్
‣ డీప్ లర్నింగ్ యూజింగ్ పైథాన్
‣ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్
‣ వీఎల్ఎస్ఐ డిజైన్ యూజింగ్ వెరిలాగ్
‣ ఆటోక్యాడ్
కోర్సుల కాలవ్యవధి నాలుగు నుంచి ఆరు వారాలు. ప్రతి ప్రోగ్రామ్లో 30 చొప్పున సీట్లున్నాయి. ఆరు వారాల కోర్సును.. 4 వారాల ఆన్లైన్ శిక్షణ, రెండువారాల ప్రాజెక్ట్ డెవలప్మెంట్గా విభజించారు. విద్యార్థులు, కెరియర్ను మార్చుకోవాలనుకునేవారు, వీటిపై పనిచేస్తున్న ప్రొఫెషనల్స్ ఎవరైనా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సాంకేతిక అంశాల్లో విద్యను అభ్యసించి ఉండటం తప్పనిసరి. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బీఈ/ బీటెక్/ ఎంసీఏ, ఎంటెక్/ ఎంఎస్సీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పరిశ్రమలో గుర్తింపు పొందిన, అనుభవం ఉన్న నిపుణులు బోధిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి సర్టిఫికెట్నూ అందజేస్తారు. కాకపోతే ఇందుకుగానూ రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఎలా?
* ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* సీట్లు పరిమితంగా ఉండటంతో ముందు దరఖాస్తు చేసుకున్నవారికే ప్రాధాన్యం ఉంటుంది.
* ఎంచుకున్న కోర్సును బట్టి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా రూ.1200 నుంచి రూ.1600 వరకు ఫీజుగా తీసుకుంటున్నారు.
* https://nielit.gov.in/harid warontent/online-courses లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ మే 9, 2021.