• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జాతీయ ఉద్యోగ పరీక్షకు సిద్ధమేనా?

‣ వచ్చే సెప్టెంబరులో జరిగే అవకాశం

‣ ఇక మీద‌ట పలు కొలువులకు ఒకే ప్రాథ‌మిక ప‌రీక్ష‌!

‣ మొద‌ట మూడు సంస్థ‌ల‌కు సెట్ ప‌రిమితం

‣ ఏడాదికి రెండుసార్లు, స్కోర్ కాల‌ప‌రిమితి మూడేళ్లు 

కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ -బి తోపాటు గ్రూప్-సి (నాన్-టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి జాతీయస్థాయిలో ఒకటే ప్రాథమిక పరీక్ష నిర్వహించాలని గతంలో ప్రతిపాదించారు. ఆ మేరకు సాధారణ అర్హత పరీక్ష - కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) వచ్చే సెప్టెంబరులో జరిగే అవకాశం ఉందని ప్రధానమంత్రి కార్యాలయ ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ఇటీవల వెల్లడించారు. దేశం మొత్తం మీద వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి జరిగే ఈ పరీక్షకు పోటీ ఎక్కువ ఉంటుంది. అందులోనూ తొలిదశ దాటితేనే మిగతా నియామక ప్రక్రియలో కొనసాగే వీలుంటుంది. అందుకే అభ్యర్థులు ‘సెట్’పై తగిన అవగాహన పెంపొందించుకొని, ప్రిపరేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించాలి. పోటీలో నిలబడేందుకు చదవడం ప్రారంభించాలి.

ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలక్షన్ (ఐబీపీఎస్)ల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలన్నింటికీ ఒకటే ప్రాథకమిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు సాధించిన స్కోరు ఆధారంగా తర్వాతి దశ నియామక ప్రక్రియను ఆయా సంస్థలు తమ పద్ధతుల్లో కొనసాగిస్తాయి. 

ఇప్పటి వరకు ప‌లు సంస్థ‌ల్లో ఖాళీల భ‌ర్తీకి నిర్వ‌హిస్తున్న ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల స్థానంలో కామ‌న్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఈ స్కోర్ ఆధారంగా ఎంపికైన అభ్య‌ర్థులకు ఆయా సంస్థ‌లు తర్వాతి దశ పరీక్షలు జరిపి నియామకాలు పూర్తి చేస్తాయి. విద్యార్థి జీవితంలోని అన్ని అంశాలను కవర్ చేసే విధంగా ఈ పరీక్షను రూపొందించాలని భావిస్తున్నారు. ప‌రీక్ష‌ను ఏడాదికి రెండుసార్లు జరుపుతారు. అభ్యర్థులు సాధించిన స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. మొద‌ట స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌నె‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) సంస్థ‌ల‌కు ఈ సంయుక్త పరీక్షను ప‌రిమితం చేయ‌నున్నారు. ఇక మీద‌ట ఈ మూడు సంస్థ‌లు నిర్వహించే వివిధ రకాల పరీక్షలకు వేర్వేరుగా హాజరు కావాల్సిన అవసరం ఉండదు. సెట్ ఒక్కదానితోనే అభ్యర్థుల వడపోత జరుగుతుంది. ప్రతి పరీక్షకు వేర్వేరు సిలబస్‌లను ప్రిపేర్ కావడం, ఒత్తిడి, వ్యయాలను తగ్గించడమే ఈ సెట్ నిర్వహణ ప్రధాన లక్ష్యం. 
 

ఎవరు నిర్వహిస్తారు?

సెట్ నిర్వ‌హ‌ణ‌తో నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర మంత్రివ‌ర్గం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇది ప్రతి సంవత్సరం సెట్ నిర్వహించడానికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఇక మీద‌ట ‌నాన్-గెజిటెడ్ పోస్టుల నియామకాల కోసం వివిధ ఏజెన్సీలు ప్రిలిమ్స్ స్థాయి పరీక్షలు నిర్వహించవు. గ్రూప్ బి, సి పోస్టులన్నింటికీ కలిపి  ఒకే సాధారణ అర్హత పరీక్ష ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య‌ను బట్టి ఒక ‌జిల్లాలో కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. దేశంలోని మారు మూల ప్రాంతాల్లో ఉన్న లక్షలాది మంది అభ్యర్థులకు ఈ పరీక్ష వరంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల వారు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండ‌దు. పరీక్ష ఫీజులు, ప్రయాణ ఛార్జీలు, వ‌స‌తి, ఇతర పలు రకాల ఖర్చులు మిగులుతాయి. పూర్తి విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. 

అర్హతలు?

ప్రస్తుతం ఆయా నియామక సంస్థలు వివిధ పరీక్షల కోసం పేర్కొన్న కనీస అర్హతలు తప్పకుండా ఉంటాయి. అంటే గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్, పదో తరగతి మొదలైన అర్హతల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వయసు పరిమితి తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడుతుంది. 
 

పరీక్ష విధానం ఏమిటి?

సెట్ సిలబస్, పరీక్ష స్వరూపానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. పోస్టుల కనీస అర్హతల ఆధారంగా పరీక్ష స్థాయి ఉంటుంది. ఆయా పరీక్షల సిలబస్‌లోని కామన్ అంశాలను ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ మొదలైనవి ఉండవచ్చని భావిస్తున్నారు.
 

ప్రిపరేషన్ ఎలా?

జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాల ప్రిపరేషన్‌ను అభ్యర్థులు ప్రారంభించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ పాత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నల సరళిని అంచనా వేయవచ్చు. ప్రశ్నలు అడిగే విధానంలో ప్రారంభ దశలోనే సమూల మార్పులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రకటించినట్లు సెప్టెంబరులో పరీక్ష జరిగేట్లయితే అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఇప్పటికే ఆయా పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఆ మూడు సంస్థల పరీక్షల్లోని కామన్ అంశాలను గుర్తించి అధ్యయనం సాగించాలి. కొత్తగా పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మొదట ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టాలి. నోటిఫికేషన్ నాటికి వాటిపై పూర్తిగా పట్టు సాధించాలి. నిపుణులు, సీనియర్ల సాయంతో తర్వాతి దశ అధ్యయనం సాగించాలి. దేశ వ్యాప్తంగా కోట్లమంది హాజరయ్యే ఈ పరీక్షలో పోటీకి దీటుగా నిలబడాలంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి.

భ‌విష్య‌త్తులో ఈ స్కోరే ప్రామాణికం

సెప్టెంబర్, 2021 నుంచి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) నిర్వహించాలని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) నిర్వహించనున్న ఈ ప‌రీక్ష ద్వారా దేశవ్యాప్తంగా కనీసం 2.5 కోట్ల మంది నిరుద్యోగులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలే కాకుండా, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ సంస్థ‌లు కూడా సెట్ స్కోర్‌తో ప్ర‌తిభ‌, ఆస‌క్తి ఉన్న వారిని గుర్తించి ఉద్యోగాల భ‌ర్తీ చేపట్ట‌డానికి అవ‌కాశం ఉంటుంది. అస‌లు సెట్ ‌ప్రధాన లక్ష్యం సమయం, వ్యయం ఆదా, నియామక ప్రక్రియను వేగ‌వంతం చేయ‌డమే. చాలా సంస్థ‌లు సెట్ క‌టాఫ్ మార్కుల ఆధారంగానే అభ్య‌ర్థుల అర్హ‌త‌ను నిర్ణ‌యించే అవకాశం ఉంది. కొన్ని సంస్థలు రెండో స్థాయి పరీక్ష లేకుండా నేరుగా సెట్‌స్కోరు, శారీరక, వైద్య పరీక్షలు జ‌రిపి అభ్యర్థులను నియమించుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. సెట్ స్కోర్‌ను ఉపయోగించి ఎస్ఎస్‌సీ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ కాకుండా ఉద్యోగాల భ‌ర్తీ చేప‌ట్ట‌నున్న ఇతర సంస్థలు:

స్టేట్ రిక్రూటింగ్ ఏజెన్సీలు

వివిధ కేంద్రపాలిత ప్రాంతాల ఏజెన్సీలు

ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, ప్ర‌భుత్వాల‌తో కొన్ని ఒప్పందాలు చేసుకున్న ప్రైవేటు కంపెనీలు

మధ్యప్రదేశ్‌లో  మొద‌ట‌గా..

రాష్ట్ర ఉద్యోగాల భ‌ర్తీకి సెట్‌స్కోర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని మొద‌ట‌గా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను నియ‌మించుకోవ‌డానికి త‌మ రాష్ట్ర నియామ‌క సంస్థ‌లు సెట్-2021 స్కోర్‌ను ప్రామాణికం చేసుకుంటాయని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ వెల్ల‌డించారు. సెట్ వ‌ల్ల స‌మ‌యం, డ‌బ్బు ఆదా మాత్ర‌మే కాకుండా ప్ర‌తిభావంతులైన అభ్య‌ర్థుల‌ను ఎన్నుకోవ‌డానికి ఏజెన్సీల‌కు అవ‌కాశం ల‌భిస్తుంద‌న్నారు. 

Posted Date : 18-03-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌