‣ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల
‣ అర్హత; ఇంటర్, డిగ్రీ
దేశంలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల జాబితాలో తెలంగాణకు చెందిన ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, జేఎన్టీయూ యూనివర్సిటీలున్నాయి. వీటితోపాటు మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నత విద్యకు పెట్టింది పేరు. ప్రస్తుతం విద్యార్థులు వీటిలో చేరే అవకాశం వచ్చింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఏడు విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు తాజాగా కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజెట్)-2021 ప్రకటన వెలువడింది. ఈ పరీక్షను హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) నిర్వహిస్తుంది.
సీపీజెట్ రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష. దీని ద్వారా ఆయా యూనివర్సిటీల్లో 2021-2022 విద్యాసంవత్సరానికి గాను పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్లఇంటిగ్రేటెడ్ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీలు ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీజే, మాస్టర్ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర కోర్సులను అందిస్తున్నాయి. అలాగే ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ విభాగాల్లో పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములూ అందుబాటులో ఉన్నాయి.
అర్హత ఏమిటి?
ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇంటర్/ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక
సీపీజెట్లో వచ్చిన స్కోరు ఆధారంగా విశ్వవిద్యాలయాలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.
దరఖాస్తు విధానం
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఒక సబ్జెక్టుకు ఫీజు ఇతరులు రూ.800, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. దరఖాస్తులకు ఆగస్టు 25, 2021 తుది గడువు. ఆలస్య రుసుం రూ.500 తో ఆగస్టు 30 వరకు, ఆలస్య రుసుం రూ.2000తో సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజర్వేషన్లు ఇలా..
ప్రవేశ పరీక్షద్వారా భర్తీ చేయనున్న సీట్లలో 85శాతం స్థానిక అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తారు. మరో 15శాతం సీట్లలో స్థానిక, స్థానికేతరులకు అవకాశం కల్పిస్తారు. మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. 29 శాతం సీట్లను ఓబీసీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. అలాగే 33.33శాతం సీట్లను మహిళలకు ఇస్తారు.
పరీక్ష కేంద్రాలు
‣ హైదరాబాద్ వెస్ట్: కూకట్పల్లి, పటాన్చెరు సమీప ప్రాంతాలు.
‣ హైదరాబాద్ నార్త్: మేడ్చల్, గండిమైసమ్మ, ఓల్డ్ అల్వాల్ సమీప ప్రాంతాలు.
‣ హైదరాబాద్ నార్త్: మల్లాపూర్, ఘట్కేసర్ సమీప ప్రాంతాలు.
‣ హైదరాబాద్ సౌత్: ఎల్బీ నగర్, హయత్నగర్, కర్మన్ఘాట్ సమీప ప్రాంతాలు.
‣ ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్, నిజామాబాద్.
పరీక్షలో ఏముంటుంది?
ప్రవేశ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఉంటుంది. సమయం గంటన్నర ఇస్తారు. 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులుంటాయి. అభ్యర్థుల అర్హత, ఎంచుకునే కోర్సులను బట్టి పరీక్ష పేపర్లలో తేడాలుంటాయి. ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష రాసేవారికి పార్ట్ఎలో కెమిస్ట్రీ నుంచి 40 మార్కులుంటాయి. పార్ట్బిలో అభ్యర్థి బీఎస్సీ స్థాయిలో ఎంచుకున్న ఏదైనా ఒక సబ్జెక్టుకు సంబంధించి 60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చేరాలనుకునే వారికి పార్ట్ఎలో కెమిస్ట్రీ నుంచి 40 మార్కులు, పార్ట్బిలో బయోటెక్నాలజీ నుంచి 60 మార్కులు ఉంటాయి.
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 8,2021 నుంచి ప్రారంభం.
వెబ్సైట్: http://www.tscpget.com/