కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన పాండిచ్చేరి యూనివర్సిటీ వివిధ ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్హతలతో వీటికి పోటీ పడవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 20లోగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
దేశంలో పేరున్న విద్యాసంస్థల్లో పాండిచ్చేరి విశ్వవిద్యాలయం ఒకటి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) 2020 జాతీయ ర్యాంకుల్లో ఈ సంస్థ విశ్వవిద్యాలయాల కేటగిరీలో 58, ఓవరాల్ విభాగంలో 81 స్థానాల్లో నిలిచింది. విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం పుదుచ్చేరిలో ఉంది. కరేకల్, అండమాన్ నికోబార్ దీవులు, పోర్టు బ్లెయిర్లో ఉప కేంద్రాలు ఉన్నాయి. ఎక్కువ కోర్సులు పుదుచ్చేరిలో, కొన్నింటిని ఉప కేంద్రాల్లో అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడి సైన్స్ కోర్సులకు ఎక్కువగా పోటీపడుతుంటారు.
ఏమేం కోర్సులు?
ఇంటర్తో ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎమ్మెస్సీ
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, అప్లయిడ్ జియాలజీ, స్టాటిస్టిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ అండ్ ఎకనామిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా (సీల్).
అర్హత: వీటిలో కొన్ని కోర్సులకు ఏ గ్రూప్తోనైనా ఇంటర్ ఉత్తీర్ణులు పోటీపడవచ్చు. మిగిలినవాటికి ఆ సబ్జెక్టులు ఇంటర్లో చదివుండడం తప్పనిసరి.
యూజీ పూర్తిచేసుకున్నవారికి
‣ ఎంఏ: ఆంత్రోపాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్ అండ్ కంపారిటివ్ లిటరేచర్, ఫ్రెంచ్ (ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రెటేషన్), హిందీ, హిస్టరీ, హ్యూమన్ రైట్స్ అండ్ ఇన్క్లూజివ్ పాలసీ, మాస్ కమ్యూనికేషన్, ఫిలాసఫీ, పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్, సంస్కృతం, సోషియాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్, తమిళ్, విమెన్ స్టడీస్.
అర్హత: వీటిలో చాలా కోర్సులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలినవాటికి సంబంధిత సబ్జెక్టును యూజీలో చదివుండడం తప్పనిసరి.
‣ ఎమ్మెస్సీ: అప్లయిడ్ జియాలజీ, అప్లయిడ్ సైకాలజీ, బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెరైన్ బయాలజీ, మ్యాథమేటిక్స్, మైక్రో బయాలజీ, ఫిజిక్స్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్, స్టాటిస్టిక్స్.
అర్హత: యూజీలో సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్టును చదివివుండాలి.
‣ ఎంటెక్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యుటేషనల్ బయాలజీ, ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్.
అర్హత: సంబంధిత విభాగాల్లో బీటెక్ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
‣ ఎంబీఏ: బ్యాంకింగ్ టెక్నాలజీ, ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ టెక్నాలజీ.
అర్హత: ఏదైనా యూజీ డిగ్రీ ఉత్తీర్ణత.
ఇవేకాకుండా ఎంసీఏ, ఎంకాం (బిజినెస్ ఫైనాన్స్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్), లైబ్రరీ సైన్స్, ఎంఎస్డబ్ల్యూ, ఎంపీఏ, ఎంఎడ్, ఎంపీఈడీ, ఎల్ఎల్ఎం కోర్సులూ ఉన్నాయి. యూజీలో సంబంధిత కోర్సులు చదివినవారు అర్హులు. విస్తృత విభాగాల్లో పీహెచ్డీ అందిస్తున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ఇలా...
ఆన్లైన్ పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. ఎల్ఎల్ఎం కోర్సుకి అదనంగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఎంపీఈడీకి ఫిజికల్ టెస్టు అదనం. పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం జేఆర్ఎఫ్ స్కోరు/విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్ష, ఇంటర్వ్యూలతో లభిస్తుంది. జేఆర్ఎఫ్తో ప్రవేశం పొందినవారికి కేంద్రం నిర్దేశించిన ఫెలోషిప్ అందుతుంది. ప్రవేశ పరీక్షతో అవకాశం పొందిన వారికి ప్రతి నెలా రూ.8000 స్టైపెండ్ చెల్లిస్తారు. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్లో చేరినవారికి స్కాలర్షిప్పు అందుతుంది. గాట్ -బి స్కోర్తో ఎంటెక్ కంప్యుటేషనల్ బయాలజీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సుల్లో చేరినవారికి డీబీటీ ఫెలోషిప్ అందుతుంది. ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీల్లో చేరినవారికి మెరిట్, మెరిట్ కం మీన్స్ స్కాలర్షిప్పులు ప్రతిభ, అవసరాల ప్రాతిపదికన అందుతాయి. పాతప్రశ్నపత్రాలు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వాటిని పరిశీలించి పరీక్ష స్వరూపం, చదవాల్సిన అంశాలపై అవగాహనకు రావచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 20
పరీక్షలు: సెప్టెంబరు 2, 3, 4 తేదీల్లో.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ.
వెబ్సైట్: https://www.pondiuni.edu.in/home