‣ ఉన్నత విద్యకు చేయూత!
ఉన్నత విద్యను కొనసాగించడంలో ఆర్థికంగా ఇబ్బంది పడే విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఇండియా చేయూతను అందిస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న పలు లోన్ల వడ్డీ రేట్లను తగ్గించింది. కొన్ని రుణాల పథకాల్లోని వడ్డీరేట్లలో రాయితీ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.
స్టూడెంట్ లోన్ స్కీం
ఈ పథకం ద్వారా రూ.7.5 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. సాధారణంగా దీనికి వడ్డీరేటు 9.30 శాతంగా ఉంటుంది. కానీ నిధుల వ్యయం ఆధారిత రుణరేట్ల (ఎంసీఎల్ఆర్) కింద బ్యాంకు 7.30 శాతం వడ్డీకే దీన్ని అందిస్తోంది. విద్యార్థినులకు ప్రత్యేకంగా వడ్డీరేటులో అదనంగా 0.50 శాతం రాయితీ ఉంటుంది. దీంతోపాటు ఎస్బీఐ ‘రిన్ రక్ష’ తదితర పాలసీలు తీసుకుంటే మరో 0.50 శాతం రాయితీ వర్తిస్తుంది. మన దేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యకు ప్రవేశం పొందిన ఎవరైనా ఈ రుణం పొందడానికి అర్హులే. తీసుకున్న రుణం గరిష్ఠంగా 15 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది.
స్కాలర్ లోన్ స్కీం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎంసీఎల్ఆర్ కింద 6.70 శాతం వడ్డీకే రుణాలు అందిస్తోంది. అలాగే 6.85 శాతం నుంచి 8.15 శాతం వరకు వడ్డీకి రుణాలు ఆఫర్ చేస్తోంది. పైన పేర్కొన్న ఇన్స్టిట్యూషన్లలో ప్రవేశాలు పొందే విద్యార్థులే ఈ రుణానికి అర్హులు. దీనికి ఎలాంటి ప్రాసెసింగ్ రుసుము ఉండదు. రుణం 15 ఏళ్లలోపు చెల్లించాలి.
విదేశీ విద్యకు...
విదేశాల్లోని ఇన్స్టిట్యూట్లు/విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్, డాక్టొరల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఎస్బీఐ విదేశీ విద్య రుణాలు అందిస్తోంది. ఫుల్టైమ్ రెగ్యులర్ కోర్సు చేసేవారే దీనికి అర్హులు. రూ.7.5 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు రుణం పొందవచ్చు. వడ్డీ రేటు 7.30 ఉంటుంది. విద్యార్థినులకు ప్రత్యేకంగా వడ్డీరేటులో అదనంగా 0.50 శాతం రాయితీ ఉంటుంది. దీంతోపాటు ఎస్బీఐ ‘రిన్ రక్ష’ తదితర పాలసీలు తీసుకుంటే మరో 0.50 శాతం రాయితీ వర్తిస్తుంది.
పార్ట్టైమ్ కోర్సుల కోసం..
ఎంపిక చేసిన 15 ఇన్స్టిట్యూషన్లలో పార్ట్టైమ్ కోర్సులు చేసే విద్యార్థులకు ఎస్బీఐ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు మూడేళ్ల కాలపరిమితికి ఎంసీఎల్ఆర్ కింద 7.30 శాతం వడ్డీకి రూ.7.5 లక్షల రుణం తీసుకోవచ్చు. విద్యార్థినులకు 0.50 శాతం వడ్డీలో రాయితీ ఇస్తారు. ఈ స్కీం కొన్ని ఎస్బీఐ శాఖల్లోనే అందుబాటులో ఉంటుంది.
స్కిల్ లోన్ స్కీం
ఈ పథకంలో భాగంగా విద్యార్థులు రూ.1.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. దీనికి మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఎంసీఎల్ఆర్ కింద వడ్డీరేటు 7.30 శాతంగా ఉంటుంది. ఈ పథకంలో ఎలాంటి రాయితీలు ఉండవు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో చేరే భారతీయ విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. తీసుకున్న తర్వాత ఏడేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
వెబ్సైట్: https://sbi.co.in/web/personal-banking/loans/education-loans