‣ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రతిభావంతులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఉపకార వేతనాలు అందిస్తోంది. ఏదైనా డిగ్రీ కోర్సులో సంబంధిత విశ్వవిద్యాలయం స్థాయిలో టాపర్లగా నిలిచినవారికి వీటిని అందిస్తారు. అయితే వీరు ప్రస్తుతం పీజీలో చేరివుండాలి. వీటికి ఎంపికైనవారికి ప్రతి నెలా రూ.3100 చొప్పున రెండేళ్లపాటు అందుతాయి. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచినవారికి ఇవి దక్కుతాయి. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ వివరాలు చూద్దాం..
జత చేయాల్సినవి...
‣ యూజీ సర్టిఫికెట్, పీజీలో చేరినట్టు ధ్రువీకరణ సర్టిఫికెట్, యూనివర్సిటీ ప్రొవిజనల్ సర్టిఫికెట్.
‣ సంబంధిత యూనివర్సిటీలు కూడా సబ్జెక్టుల వారీ యూజీ టాపర్స్ వివరాలు, పీజీ ప్రథమ సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్, స్కాలర్ యుటిలైజేషన్ సర్టిఫికెట్ అందించాలి.
‣ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 30
‣ వెబ్సైట్: https://scholarships.gov.in/
దేశ అభివృద్ధిలో ఉన్నత విద్య పాత్ర చాలా కీలకం. ఈ విభాగాన్ని పటిష్ట పరచినప్పుడే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతోన్న ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర ఉన్నత విద్య చదివేవారి సంఖ్య చాలా తక్కువ. ఈ లోటును పూరించడానికి సమర్థులైన యువతను డిగ్రీ నుంచి పీజీ దిశగా అడుగులేయించాలి. దీనికోసం వాళ్లను ప్రోత్సహించాలి. అందులో భాగంగానే యూజీసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ను ప్రారంభించింది. డిగ్రీ స్థాయిలో వివిధ కోర్సుల్లో యూనివర్సిటీ టాపర్లకు (మొదటి రెండు స్థానాలు పొందినవారు) ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. దీని వ్యవధి రెండేళ్లు. యూనివర్సిటీల వారీగా అత్యుత్తములుగా నిలిచి, పీజీ కోర్సుల్లో చేరితేనే ఈ స్కాలర్షిప్ అందుతుంది. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించి, వాళ్లు పీజీలో చేరేలా చూడడమే స్కాలర్షిప్ ముఖ్య ఉద్దేశం.
అర్హతలివీ...
విద్యార్థులు చదివిన యూనివర్సిటీ స్థాయిలో ఏదైనా బేసిక్ కోర్సులో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొంది ఉండాలి. డీమ్డ్ సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, అటానమస్ సంస్థల్లో చదివి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినా అర్హులే. అలాగే విద్యార్థులు ఏదైనా యూనివర్సిటీ లేదా పీజీ కాలేజీలో చేరివుండాలి. దూరవిద్యలో చదివినవారు ఈ స్కాలర్షిప్కు అనర్హులు. వయసు 30 ఏళ్లకు మించరాదు. డిగ్రీ స్థాయిలో బీఎస్సీ (జనరల్) కామన్ సబ్జెక్టులన్నీ, బీఏ (జనరల్) కామన్ సబ్జెక్టులన్నీ, బీకాం (జనరల్, ఆనర్స్) వీటిలో ఏ కోర్సైనా చదివి, మెరిట్ పొందినవారు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
ఎన్ని.. ఎన్నాళ్లు?
మొత్తం 3000 స్కాలర్షిప్పులు ఉన్నాయి. వీటి వ్యవధి రెండేళ్లు. నెలకు రూ. 3100 చొప్పున చెల్లిస్తారు. ప్రథమ సంవత్సరంలో మంచి ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మాత్రమే రెండో సంవత్సరం స్కాలర్షిప్ వర్తిస్తుంది.
నియమాలు...
‣ ఈ స్కాలర్షిప్కు ఎంపికైనవారు ఇతర స్కాలర్షిప్పులకు అనర్హులు.
‣ ఒకవేళ పీజీ మధ్యలో మానేయాల్సి వస్తే యూజీసీ అనుమతి తప్పనిసరి. లేదంటే అంతవరకు యూజీసీ కేటాయించిన స్కాలర్షిప్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.
‣ పీజీ ప్రథమ సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులు సాధిస్తేనే ద్వితీయ సంవత్సరం స్కాలర్షిప్ వర్తిస్తుంది.
‣ లైఫ్సైన్స్, ఫిజికల్, కెమికల్, ఎర్త్, మ్యాథమేటికల్, సోషల్ సైన్సులు, కామర్స్, లాంగ్వేజ్ కోర్సుల్లో వేటిలోనైనా పీజీలో చేరి ఉండాలి. ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుతోన్నవారికి ఈ స్కాలర్షిప్ వర్తించదు.