• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పిల్ల‌ల్ని స్కూళ్ల‌కు పంపాలా? వ‌ద్దా!

బ‌డికి పంపితే ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటించాలి?

పిల్లలను బడికి పంపాలా? వద్దా? ప్రస్తుతం తల్లిదండ్రుల మనసుల్లో మెదలుతున్న ప్రశ్న ఇదే. ఒకవైపు బడుల పునః ప్రారంభం. మరోవైపు కొవిడ్‌-19 మూడో దశ ముంచుకురావొచ్చనే హెచ్చరికలు. ఈ నేపథ్యంలో ఎవరికైనా ఊగిసలాట సహజమే. బడికి పంపకపోతే పిల్లలు చదువుల్లో మరింత వెనకబడి పోతారనే ఆందోళన కొందరిది. పిల్లల ప్రాణాల కన్నా చదువులు ముఖ్యమా? అనే భయం ఇంకొందరిది. ఇలాంటి సందిగ్ధావస్థలో ఎటు వైపు మొగ్గాలి? ఒకవేళ బడికి పంపితే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? పిల్లలకు ఎలాంటి ప్రవర్తన నేర్పించాలి?

కొవిడ్‌-19 భయంతో దాదాపు రెండేళ్లుగా పిల్లలు ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో చిన్నారులను కరోనా బారినపడకుండా కాపాడుకొని ఉండొచ్చు. కానీ చదువుల్లో వెనకబడి పోతున్న మాట నిజం. శారీరక సామర్థ్యం, మానసిక వికాసం రెండూ దెబ్బతిన్నాయి. నిజానికి బడి అంటే కేవలం చదువులే కాదు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ బంధాలు.. తోటి పిల్లల మధ్య స్నేహాలు బలపడటం కూడా. పిల్లల సంపూర్ణ వికాసానికివీ అవసరమే. ఇన్నాళ్లు ఇంట్లోనే ఉండిపోవటం వల్ల ఎంతోమంది పిల్లలు సోమరులుగా తయారవటం గమనిస్తున్నాం. శారీరక శ్రమ, ఆటలు లేకపోవటం వల్ల బరువు పెరిగిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఊబకాయ పిల్లల సంఖ్య పెరగటమే దీనికి నిదర్శనం. కొందరిలో మానసిక సమస్యలూ పొడసూపుతున్నాయి. టీవీలు, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లకు బానిసలవటం గమనిస్తున్నాం. వీడియో, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఓ వ్యసనంగానూ మారిపోయింది. క్రమశిక్షణ, పెద్దవాళ్ల మీద గౌరవం తగ్గిపోతున్నాయి కూడా. ఫోన్‌ ఇవ్వనంటే తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్న ఘటనలూ చూస్తున్నాం. ఇవన్నీ పూర్తిగా ఇంటికే పరిమితమవటం వల్ల తలెత్తిన అనర్థాలే. అందుకే కొందరు బడికి పంపటమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. క్రమంగా బడుల్లో హాజరు శాతమూ పెరుగుతోంది. అదే సమయంలో కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులూ కొవిడ్‌-19 బారినపడుతున్నారు. మరి దీని భయాన్ని ఎదుర్కోవటమెలా? ఇది మరికొందరి సందేహం. ప్రమాదం వాటిల్లొచ్చని ప్రయాణాలు ఆపలేం కదా. వాహనం ఫిట్‌గా ఉండేలా చూసుకుంటాం. హెల్మెటో, సీటు బెల్టో ధరిస్తాం. మార్గ సూచికలను, ట్రాఫిక్‌ సిగ్నళ్లను పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణిస్తాం. ఇదీ అంతే. కొవిడ్‌-19 ఎంత తీవ్రమైనదైనా నివారించుకునే మార్గాలు లేకపోలేదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇదేమంత కష్టమైన పనికాదు. నివారణ మార్గాలను పిల్లలకు నేర్పిస్తే తప్పకుండా పాటిస్తారు. కరోనా కోరలకు చిక్కనీయకుండానే చదువుల్లో, ఆటల్లో రాణించేలా చూసుకోవచ్చు.

పిల్లలకు శిక్షణ

కొవిడ్‌-19 వచ్చాక బాధపడటం కన్నా పిల్లలు దీని బారినపడకుండా చూసుకోవటమే అన్నింటికన్నా ఉత్తమం. మాస్కు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవటం, ఇతరులకు దూరం పాటించటం ఇందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల వీటి ప్రాధాన్యాన్ని, అవసరాన్ని పిల్లలకు విధిగా నేర్పించాలి.

మాస్కు ప్రాధాన్యం: వైరస్‌ వ్యాప్తిని అరికట్టటంలో మాస్కులు చాలా కీలకం. ఇవి ఇన్‌ఫెక్షన్‌ గలవారి నుంచి వైరస్‌ ఇతరులకు సోకకుండా చూస్తాయి. మాస్కు ధరించినవారికీ వైరస్‌ బారినపడకుండా ఎంతోకొంత రక్షణ కల్పిస్తాయి. అయితే మాస్కును ఎలా పడితే అలా ధరిస్తే ఉపయోగం లేదు. ముక్కు, నోరు, చెంపలు, గదమ కింది భాగం పూర్తిగా కప్పి ఉంచేలా మాస్కు ధరించాలి. ఈ విషయంలో పెద్దవాళ్లుగా మనమే ఆదర్శంగా ఉండాలి. మనల్ని చూసి పిల్లలు సరిగా మాస్కు ధరించటం నేర్చుకుంటారు. అలవాటు చేసుకుంటారు. బడి బస్సులో, స్కూలులో అన్ని వేళలా మాస్కు ధరించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి మాస్కును మరొకరకు ధరించొద్దని.. మాస్కును పట్టీలను పట్టుకొనే తీయాలని, మాస్కు ముందు భాగాన్ని తాకరాదని చెప్పాలి. మాస్కును తాకటానికి ముందు, తాకిన తర్వాత విధిగా చేతులు కడుక్కోవటమూ నేర్పించాలి.  

పిల్లలకు ఎన్‌95 మాస్కులు అవసరం లేదు. మూడు పొరలతో కూడిన కాటన్‌ మాస్కులు చాలు. వీటిని ఉతుక్కొని తిరిగి వాడుకోవచ్చు. బడికి వెళ్లే ముందు ఒకో పిల్లాడికి రెండు (వీలైతే మూడు) మాస్కులు ఇవ్వాలి. ఒకటి ఇంట్లోనే ధరించి పంపాలి. రెండో మాస్కును జిప్‌లాక్‌ బ్యాగులో పెట్టి ఇవ్వాలి. అదనంగా ఒక ఖాళీ జిప్‌లాక్‌ బ్యాగు కూడా ఇవ్వాలి.

భోజనం చేసేటప్పుడు మాస్కును తీసి ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. నేల మీద, చుట్టుపక్కల ఉండే క్రిములు మాస్కుకు అంటుకుంటే లేని జబ్బులు రావొచ్చు. తీసిన మాస్కును వెంట తెచ్చుకున్న ఖాళీ జిప్‌లాక్‌ బ్యాగులో పెట్టుకోవాలి. భోజనం పూర్తయ్యాక, చేతులు కడుక్కొని మళ్లీ ధరించాలి. ఒకవేళ మాస్కు కింద పడిపోయినా, చెడిపోయినా దాన్ని తిరిగి ధరించకూడదు. అదనంగా తెచ్చుకున్న మాస్కు ధరించాలి. ఇవన్నీ పిల్లలకు ఇంట్లోనే నేర్పించాలి.

ఇతరులకు దూరం: ఇతరులకు కనీసం 2 మీటర్ల దూరంగా ఉండాలని పిల్లలకు చెప్పాలి. బడి బస్సులో ఒకవైపున ఒకరే కూర్చొనేలా చూసుకోవాలి. ఇంతకుముందు బస్సులో 30 మంది ఎక్కితే ఇప్పుడు 15 మందే ఎక్కాలన్నమాట. బస్సు దిగిన తర్వాత ఒకరి మీద ఒకరు పడకుండా దూరం దూరంగా దిగేలా, క్రమశిక్షణతో తరగతి గదుల్లోకి చేరుకునేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. తరగతుల్లోనూ విద్యార్థుల హాజరు సంఖ్య తగ్గించాలి. సగం మంది బడిలో, సగం మంది ఇంట్లో ఉండేలా చూసుకోవాలి (హైబ్రిడ్‌ స్కూలింగ్‌). తరగతుల వేళలను మార్చటం ద్వారానూ దీన్ని సాధించొచ్చు. సగం మంది తరగతులు 8 గంటలకు మొదలెట్టి 12 గంటలకు ముగించెయ్యొచ్చు. మిగతా పిల్లల తరగతులు ఒంటి గంటకు మొదలెట్టి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించొచ్చు. లేకపోతే ఒకరోజు సగం మందిని, మర్నాడు మరో సగం మందిని బడికి వచ్చేలా చూసుకోవచ్చు. ఇంట్లో ఉన్నవారికి ఆన్‌లైన్‌ తరగతులు బోధించొచ్చు.

తరగతి గదిలోనూ బల్లలు, కుర్చీల సంఖ్య తగ్గించాలి. పిల్లలను ఎదురెదురుగా కూర్చోనీయొద్దు. బల్లలు, కుర్చీలన్నీ ఒకే దిశలో ఉండేలా చూసుకోవాలి. వీలైతే కుర్చీల మధ్య ఫ్లెక్సీగ్లాస్‌ అడ్డంగా పెట్టొచ్చు. దీంతో ఒకరు వదిలిన శ్వాస మరొకరి మీద నేరుగా పడటాన్ని నివారించొచ్చు.

గదుల తలుపులు, కిటికీలు తెరచి ఉంచాలి. వీలైతే ఆరుబయట వరండాలోనో, చెట్ల కిందనో తరగతులు నిర్వహించటం మేలు. ఆరుబయటితో పోలిస్తే తలుపులు, కిటికీలు మూసి ఉన్న గదుల్లో వైరస్‌ వ్యాప్తి చాలా ఎక్కువ.

మధ్యాహ్న భోజనం వేళ సమయాన్నీ మార్చటం మంచిది. చిన్న తరగతులకు 12 గంటలకు, పెద్ద తరగతులకు ఒంటి గంటకు లంచ్‌టైం నిర్ణయించొచ్చు. అలాగే అందరూ ఒకే చోట కాకుండా వేర్వేరు చోట్ల భోజనం చేసేలా చూసుకోవాలి.

పిల్లల శారీరక, మానసిక వికాసానికి ఆటలు తప్పనిసరి. కరోనా భయంతో వీటికి దూరంగా ఉంచటం తగదు.   కాకపోతే కబడ్డీ, ఫుట్‌బాల్‌, కోకో వంటివి కాకుండా ఒకరినొకరు తాకకుండా ఉండే ఆటలు ఆడించాలి. దూరం దూరంగా ఉంచి పరుగెత్తించొచ్చు. స్కిప్పింగ్‌, బ్యాడ్మింటన్‌ వంటివి ఆడించొచ్చు.

చేతుల శుభ్రత: తుమ్ము, దగ్గు, శ్వాస ద్వారానే కాదు.. చేతుల ద్వారానూ సార్స్‌-కొవీ-2 సోకొచ్చు. ఇతరులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడిన తుంపర్లు పడిన వస్తువులను ముట్టుకొని.. అవే చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకితే వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించొచ్చు. కాబట్టి తరచూ చేతులను శుభ్రంగా.. కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో రుద్దుకొని, కడుక్కోవటం అత్యవసరం. ముఖ్యంగా భోజనానికి ముందు, తర్వాత.. అలాగే దగ్గాక, తుమ్మాక, మాస్కును ముట్టుకున్నాక చేతులను కడుక్కోవటాన్ని పిల్లలకు నేర్పించాలి. ఇంట్లోనైనా, బడిలోనైనా ఇది తప్పనిసరి. చేతులు కడుక్కోవటానికి వీల్లేకపోతే 60% ఆల్కహాలుతో కూడిన శానిటైజర్‌ రాసుకునేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులతో కళ్లను, ముక్కును రుద్దుకోవద్దని.. నోట్లో వేళ్లు పెట్టుకోవద్దని చెప్పాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అరచేతులను కాకుండా మోచేతిని నోటికి, ముక్కుకు అడ్డంగా పెట్టుకోవటం నేర్పించాలి. టిష్యూ కాగితాన్నయినా అడ్డు పెట్టుకోవాలి. దీన్ని చెత్తబుట్టలోనే వేయాలని చెప్పాలి.

బడి నుంచి వెళ్లేటప్పుడూ చేతులు కడుకున్నాకే బస్సు ఎక్కించాలి. ఇంటికి వచ్చాక నేరుగా బాత్రూమ్‌లోకి వెళ్లి దుస్తులు విప్పేసి, స్నానం చేసి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి.

పెద్దలందరికీ టీకా

కొవిడ్‌-19 నివారణకు టీకా అత్యుత్తమ మార్గం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ ఇన్‌ఫెక్షన్‌ నివారణకు, జబ్బు తీవ్రం కాకుండా ఉండటానికి తోడ్పడుతున్నాయి. ఎంత ఎక్కువమంది టీకా తీసుకుంటే అంత ఎక్కువగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి మనదగ్గర పిల్లలకు టీకా అందుబాటులో లేదు. కాబట్టి పెద్దవాళ్లంతా టీకా తీసుకోవటం తప్పనిసరి. ఇంట్లో తల్లిదండ్రులే కాదు.. బడిలోనూ ఉపాధ్యాయులు, వార్డెన్ల దగ్గర్నుంచి ఆయాలు, బస్సు డ్రైవర్ల వరకూ అంతా విధిగా టీకాలు తీసుకోవాలి. ఇలా పిల్లలకు కొవిడ్‌-19 సోకకుండా చూసుకోవచ్చు.

కొవిడ్‌-19 లక్షణాలు కనిపిస్తే?

రోజూ పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండటం ముఖ్యం. జ్వరం, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది, నిస్సత్తువ, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతి, వికారం, విరేచనాలు, ఆకలి లేకపోవటం, కొత్తగా రుచి, వాసన కోల్పోవటం, కడుపు నొప్పి, కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో చూస్తుండాలి. బడిలో ఉన్నప్పుడు ఇలాంటి కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే విడిగదిలోకి మార్చాలి. పారాసిటమాల్‌ సిరప్‌ లేదా మాత్ర ఇవ్వాలి. బస్సులో కాకుండా విడిగా ఇంటికి పంపించాలి. ఇంట్లోనూ వేరే గదిలో ఉంచాలి. ఆన్‌లైన్‌లో డాక్టర్‌ను సంప్రదించి, తగు మందులు ఇప్పించాలి. కొవిడ్‌ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించాలి. పాజిటివ్‌గా తేలితే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. రెండు రోజులైనా జ్వరం, దగ్గు వంటివి తగ్గకపోతే సీబీపీ, సీఆర్‌పీ రక్త పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి డాక్టర్లు చికిత్స చేస్తారు. ఒకవేళ దగ్గు తీవ్రంగా ఉండి, శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడటం, నిద్ర పోకపోవటం, తినలేకపోవటం, చిరాకు పడటం, మగతగా పడుకోవటం, మూత్రం సరిగా రాకపోవటం, విపరీతమైన కడుపునొప్పి, వాంతుల వంటి లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. కొవిడ్‌-19ను ముందుగా గుర్తించి, వీలైనంత త్వరగా చికిత్స ఆరంభిస్తే తేలికగా తగ్గిపోతుంది. భయపడాల్సిన పనిలేదు. ఆలస్యమైతే మాత్రం ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

 

- డాక్ట‌ర్ స‌తీష్ ఘంటా,
డైరెక్ట‌ర్‌, నియోనేట‌ల్‌,
పీడియాట్రిక్ క్రిటిక‌ల్ కేర్ విభాగం,
లిటిల్ స్టార్స్ చిల్డ్ర‌న్స్ హాస్పిట‌ల్, హైద‌రాబాద్‌ 

Posted Date : 25-12-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌