‣ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఐడీబీఐ ప్రకటన
‣ అర్హత; డిగ్రీ ఉత్తీర్ణత
బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి మరో శుభవార్త. తాజాగా ఐడీబీఐ 620 అసిస్టెంట్ మేనేజర్ల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ప్రకటన విడుదల చేసిన ఈ బ్యాంకు వెంటనే ఇంకో ప్రకటన ఇవ్వడం గమనార్హం.
మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది (9 నెలలు తరగతి పాఠాలు, 3 నెలలు ఇంటర్న్షిప్) పాటు పీజీడీబీఎఫ్లో శిక్షణ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్తోపాటు అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ఏ) ఉద్యోగం లభిస్తుంది.
అర్హత
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. వయసు జులై 1, 2021 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇస్తారు.
ఎంపిక ఇలా..
అర్హులైన అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన వారు పర్సనల్ ఇంటర్వ్యూలకు అర్హత సాధిస్తారు. అందులో ప్రతిభ ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి. దరఖాస్తులకు ఆగస్టు 22, 2021 తుది గడువు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్: విజయవాడ, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
రాత పరీక్ష
పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు.. లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్, ఇంటర్ప్రిటేషన్ (60 ప్రశ్నలు, 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ (60 ప్రశ్నలు, 60 మార్కులు) అంశాల నుంచి మొత్తం 200 ప్రశ్నలు వస్తాయి. సమయం రెండు గంటలు ఉంటుంది. పరీక్షలో రుణాత్మక మార్కులుంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.
సిలబస్.. ప్రిపరేషన్
లాజికల్ రీజనింగ్: ఈ విభాగంలో అభ్యర్థుల తార్కిక ఆలోచనా విధానాన్ని గమనిస్తారు. సంఖ్యలు, డిజైన్ల మధ్య సంబంధాలను ఎలా అర్థం చేసుకుంటున్నారో పరిశీలిస్తారు. కోడింగ్, డీ-కోడింగ్, అనాలజీ, సిరీస్, డైరెక్షన్స్, సీటింగ్ అరెంజ్ మెంట్స్, రక్తసంబంధాలు, ర్యాంకింగ్, పజిల్స్, ఆల్ఫాబెట్ టెస్ట్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీలైనంత సాధన చేస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. మిర్రర్ ఇమేజెస్, బొమ్మలతో కూడిన ప్రశ్నలు ఇస్తారు.
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్: ఇది గణితంలోని అనేక ప్రక్రియల అమలులో అభ్యర్థుల నాలెడ్జ్ ను అంచనా వేస్తుంది. ముగిసిన లావాదేవీల డేటా ఆధారంగా విశ్లేషణలు చేసి కొన్ని అంశాలను, అర్థాలను, ప్రయోజనాలను రాబడతారు. ఈ సామర్థ్యం అభ్యర్థుల్లో తగినంత ఉందో లేదో ఈ పరీక్షతో నిర్ణయిస్తారు.
ఇంగ్లిష్ లాంగ్వేజ్: అభ్యర్థికి సాధారణ ఆంగ్లభాషపై ఉన్న పరిజ్ఞానాన్ని ఈ విభాగంలో పరిశీలిస్తారు. రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ అరేంజ్మెంట్స్, సెంటెన్స్ కరెక్షన్స్, జంబుల్డ్ సెంటెన్స్ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. గ్రామర్ రూల్స్, ఒకాబులరీ, యాంటనిమ్స్, సిననిమ్స్పై దృష్టి పెట్టాలి. గ్రామర్పై పట్టు సాధిస్తే పరీక్షలో వచ్చే ప్రశ్నలకు సులభంగా సమాధానాలను గుర్తించవచ్చు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థి తార్కిక, విశ్లేషనాత్మక, పరిమాణాత్మక నైపుణ్యాలకు ఇది పరీక్ష. సమస్యలను పరిష్కరించడంలో సామర్థ్యం, అంకెలు, సంఖ్యలపై పట్టు, గణిత నైపుణ్యాలను పరిశీలిస్తారు. ప్రతిరోజూ సాధన చేస్తేనే ఇందులో సఫలమవుతారు. ఈ విభాగంలో సమాధానాలను గుర్తించడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. మిగతా వాటిని త్వరగా పూర్తి చేసి దీనికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. గణితంలో కీలక భావనలైన కూడికలు, తీసివేతలు, భాగహారాల వంటి వాటిపై పట్టు సాధించాలి. నిష్పత్తులు, శాతాలు, వర్గమూలాలు, ఘనమూలాలు, లాభ-నష్టాలు, కాలం-పని, కాలం-దూరం మొదలైన అంశాలను ప్రాథమిక స్థాయి నుంచి ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ అవేర్ నెస్ : దీనిలోని ప్రశ్నలు బ్యాంకింగ్, ఎకానమీ, ఫైనాన్స్ విభాగాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచే ఉంటాయి. పరీక్షకు 5-6 నెలల ముందు నుంచి జరిగిన పరిణామాలపై అడుగుతారు. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలను చదవాలి. సాధన చేయాలి. కేంద్ర ప్రభుత్వం స్కీములు, జాతీయ/ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ముఖ్యమైన దినోత్సవాలు, పుస్తకాలు, రచయితలు, ప్రదేశాలు, వ్యక్తులు, బ్యాంకుల ట్యాగ్లైన్లు తదితర విషయాలపై దృష్టి సారించాలి.
బ్యాంకింగ్ నాలెడ్జ్: ఇందులో సాధారణంగా బ్యాంకింగ్ పరిభాషలు, తాజా సాంకేతికతలు, బ్యాంకింగ్ చరిత్ర, ప్రస్తుత వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులకు సంబంధించి దిన పత్రికల్లో వచ్చే విషయాలపై అవగాహన ఉండాలి.
శిక్షణ.. ఫీజు వివరాలు
ఎంపికైన అభ్యర్థులను ఏడాదిపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సులో చేరుస్తారు. ఆ సమయంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,50,000 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్దేశించిన విధంగా విడతల వారీగా ఫీజు కట్టే వెసులుబాటు ఉంది. అర్హుత గల అభ్యర్థులకు ఐడీబీఐ బ్యాంకు విద్యారుణం సైతం మంజూరు చేస్తుంది. కోర్సులో చేరేటప్పుడు అభ్యర్థులు మూడేళ్లు సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం (9 నెలలు)లో నెలకు రూ.2500 ఇస్తారు. ఇంటర్న్షిప్ (3 నెలలు) సమయంలో నెలకు రూ. 10 వేలు చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరినవారికి మొదటి నెల నుంచి రూ.36,000 నుంచి రూ.49,910 వరకు అందుతుంది.
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 4, 2021
వెబ్సైట్: https://www.idbibank.in/