‣ ఇంటర్ పూర్తిచేసినవారికి అవకాశం
జాతీయ స్థాయి సంస్థల్లో బీపీటీ, బీపీవో, బీవోటీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఇంటర్ విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో ప్రతిభ చూపినవారికి అవకాశం దక్కుతుంది. ప్రవేశం కల్పించే సంస్థలు కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అందువల్ల కోర్సుల్లో చేరిన విద్యార్థులు మేటి బోధన ప్రమాణాలు, వసతులు పొందవచ్చు. ఈ నేపథ్యంలో సంస్థలు, కోర్సులు, అర్హత, పరీక్ష వివరాలు చూద్దాం!
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజెబిలిటీస్ (ఎన్ఐఎల్డీ), కోల్కతా; స్వామీ వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్), కటక్; నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవరమెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్ (ఎన్ఐఈపీఎండీ), చెన్నై .. ఈ సంస్థలు థెరపీ కోర్సులను అందిస్తున్నాయి.
ఇవీ కోర్సులు
‣ బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ (బీపీవో)
‣ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ)
‣ బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ (బీవోటీ)
ప్రతి కోర్సు వ్యవధీ నాలుగేళ్లు. అదనంగా మరో ఆరు నెలలు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ చెల్లిస్తారు. అన్ని సంస్థల్లోనూ కలిపి 376 సీట్లు ఉన్నాయి. ఈ పరీక్షను (ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్), కటక్ నిర్వహిస్తుంది.
అర్హతలు: అన్ని కోర్సులకూ బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. బీపీవో కోర్సుకు ఎంపీసీ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ఐఈపీఎండీ, చెన్నై సంస్థలోని బీపీటీ, బీవోటీ కోర్సులకు ఎంపీసీ విద్యార్థులూ అర్హులే. ఏ కోర్సు, ఏ సంస్థకైనా జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మార్కుల శాతంలో సడలింపులు వర్తిస్తాయి.
వయసు: జనవరి 1, 2001 - డిసెంబరు 31, 2004 మధ్య జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
పరీక్ష విధానం
పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒకటి చొప్పున వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి. పార్ట్ ఎలో జనరల్ ఎబిలిటీ జనరల్ నాలెడ్జ్ విభాగం నుంచి పది ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ బిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా బయాలజీ / మ్యాథ్స్ ఐచ్ఛికంగా ఒక్కో సబ్జెక్టు నుంచి 30 చొప్పున ప్రశ్నలు ఇంటర్ సిలబస్ నుంచే వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు.
పై మూడు కోర్సులనూ పీజీ స్థాయిలో స్వామీ వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్), కటక్ అందిస్తోంది. మొత్తం 40 సీట్లు ఉన్నాయి. యూజీ స్థాయిలో సంబంధిత కోర్సులు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
యూజీ, పీజీ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15
పరీక్ష తేదీ: జులై 18 (యూజీ, పీజీ రెండు కోర్సులకూ)
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విజయవాడ
వెబ్సైట్: http://svnirtar.nic.in/