‣ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం
భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) 210 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లిష్ టైపింగ్లో నైపుణ్యంతో పాటు కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష, కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు జరుగుతాయి!
జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులు గ్రూప్-బి నాన్-గెజిటెడ్ కేటగిరీకి చెందుతాయి. ప్రాథమిక మూలవేతనం రూ.35,400. హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు కలిపి రూ.63,068 వరకు వేతనంగా పొందొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వీరికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
వయసు: జులై 1, 2022 నాటికి 18-30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ఓబీసీ/ఫిజికల్లీ ఛాలెంజ్డ్/ఎక్స్ సర్వీస్మెన్... మొదలైన వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయఃపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు గరిష్ఠ వయఃపరిమితిలో ఎలాంటి సడలింపూ ఉండదు.
పరీక్ష ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ఎక్స్-సర్వీస్మెన్/పీహెచ్/ స్వాతంత్య్ర సమరయోధుల రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు రూ.250. ఈ ఫీజును ఆన్లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి.
రిజర్వేషన్లు: ఎస్సీ/ఎస్టీ/ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి. స్వాతంత్య్ర సమరయోధులపైన ఆధారపడినవారికి కల్పించే రిజర్వేషన్లు మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జారీచేసే ఉత్తర్వులకు అనుగుణంగా ఉంటాయి.
పరీక్ష విధానం
అర్హులైన అభ్యర్థులు కింది సబ్జెక్టుల్లో పరీక్ష రాయాలి.
1. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో 100 ప్రశ్నలకు ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో జవాబులను గుర్తించాలి (50 జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నలు, 25 జనరల్ ఆప్టిట్యూడ్, 25 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఉంటాయి). ఈ పరీక్ష వ్యవధి 2 గంటలు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4వ వంతు మార్కులను తగ్గిస్తారు.
2. ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ (25 ప్రశ్నలు) ఉంటుంది.
3. టైపింగ్ టెస్ట్ (కంప్యూటర్ మీద) ఉంటుంది. 3 శాతం తప్పులను తీసివేసినప్పటికీ నిమిషానికి 35 పదాల చొప్పున టైప్ చేయగలగాలి. ఈ పరీక్ష వ్యవధి 10 నిమిషాలు.
4. డిస్క్రిప్టివ్ టెస్ట్ (ఇంగ్లిష్ లాంగ్వేజ్) - కాంప్రహెన్షన్ పాసేజ్, ప్రెస్సీ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఉంటాయి. దీని వ్యవధి 2 గంటలు.
‣ ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహించిన రోజునే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష, టైపింగ్ స్పీడ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాలి. పరీక్షలు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఇతర ముఖ్యాంశాలు
‣ పూర్తి వివరాలు రాసి ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ప్రింటవుట్ను అభ్యర్థులు భద్రపరుచుకోవాలి. అలాగే అడ్మిట్కార్డ్ జారీ నిమిత్తం అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరును పదిలపరుచుకోవాలి.
‣ ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులను సమర్పిస్తే చివరిసారిగా పంపినదాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
‣ అడ్మిట్కార్డులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.పోస్టులో పంపరు.
‣ పరీక్షలు/ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ/డీఏలు చెల్లించరు.
‣ రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించే తేదీల వివరాలను వెబ్సైట్లో ప్రకటిస్తారు. ఈ సమాచారాన్ని అభ్యర్థులకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 10.07.2022
వెబ్సైట్: http://www.sci.gov.in/