ఇంజినీరింగ్ ఉద్యోగార్థులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. పోస్టుల సంఖ్య 268. బీటెక్/ బీఈ పూర్తిచేసినవారు అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) దేశవ్యాప్తంగా 268 మంది ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఈసీఈ); ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్; టెలికమ్యూనికేషన్; కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్; కంప్యూటర్ సైన్స్ (సీఎస్సీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగాల్లో బీటెక్/ బీఈ చేసినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్ విధానంలో కోర్సును పూర్తిచేసుండటం తప్పనిసరి. అంతే కాదు- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి చదివివుండాలి.
పోస్టులు: అసోం-24, గుజరాత్-36, ఉత్తర్ప్రదేశ్-48, మధ్యప్రదేశ్-12, రాజస్థాన్-24, జమ్మూ-కశ్మీర్-48, దిల్లీ-12, పంజాబ్-64.
దరఖాస్తుదారులకు కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్/ ఐపీ నెట్వర్కింగ్/ డేటా సెంటర్ ప్రాజెక్ట్స్/ సీసీటీవీ ప్రాజెక్ట్స్/ సెన్సార్ బేస్డ్ ఐఓటీ ప్రాజెక్ట్స్/ ఐటీ ఎనేబుల్డ్ ఎలక్ట్రానిక్స్/ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇన్స్టలేషన్, కాన్ఫిగరేషన్, మెయింటనెన్స్/ ప్రొడక్ట్ సపోర్ట్ సర్వీసుల్లో అనుభవం ఉన్నవారికి నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది.
అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ వారికి అయిదేళ్లు, ఓబీసీ వారికి మూడేళ్లు వయఃపరిమితిలో సడలింపు ఉంది. పీడబ్ల్యూడీ వారికి (కనీసం 40% ఉన్నవారు) పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక: బీఈ/ బీటెక్లో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆపై వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దానిలోనూ అర్హత సాధిస్తే ఉద్యోగావకాశం కల్పిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా సైన్అప్ అయ్యి తరువాత రిజిస్ట్రేషన్ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. ఆపై అవసరమైన ధ్రువపత్రాలను జతచేయాలి. ప్రక్రియ పూర్తయ్యాక ప్రింట్ తీసుకోవడం మంచిది. దరఖాస్తు ఫీజు రూ.500.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 5, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bel-india.in/