• facebook
  • whatsapp
  • telegram

వెళ‌దామా... వాయుసేన‌లోకి!

 మూడు విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి ఏఎఫ్‌క్యాట్ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌
 

డిగ్రీ అర్హతతో ఉన్న ముఖ్యమైన ఉద్యోగ పరీక్షల్లో ఏర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ఒకటి. ఈ పరీక్షను వాయుసేనలో ఉన్నతోద్యోగాల భర్తీకి ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. ఎంపికైనవారు ఏర్‌ఫోర్స్‌లో పైలట్, గ్రౌండ్‌ డ్యూటీ- టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. శిక్షణ సమయంలో స్టైపెండ్‌తోపాటు విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. సాధారణ డిగ్రీ, బీటెక్‌ పూర్తయినవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లు వీటికి పోటీ పడవచ్చు. మహిళలూ అర్హులే. తాజాగా వెలువడిన ఏఎఫ్‌ క్యాట్‌ - 2021(1) ప్రకటన వివరాలు చూద్దాం..
 

పైలట్‌ కావాలనే ఆశయం చాలా మందికి ఉంటుంది. అయితే ఎక్కువ మంది విషయంలో ఆర్థిక నేపథ్యం అందుకు సహకరించకపోవచ్చు. ఇలాంటివారికి ఏఎఫ్‌ క్యాట్‌ చక్కని మార్గంగా నిలుస్తోంది. ఈ పరీక్షలో మెరిసినవారు ఉచితంగా పైలట్‌ శిక్షణ అందుకోవడమే కాకుండా ఏర్‌ఫోర్స్‌లో ప్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. వాయుసేనలో మేటి ఉద్యోగాలెన్నో ఏఎఫ్‌ క్యాట్‌తో సొంతం చేసుకోవచ్చు. 
 

ఏటా రెండు సార్లు అంటే ఆరు నెలలకు ఒకసారి ఈ ప్రకటన వెలువడడం అభ్యర్థుల పాలిట ఎంతో సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. గరిష్ఠ వయసుకు లోబడి కనీసం 6 నుంచి 8 సార్లు పరీక్ష రాసుకునే అవకాశం ఉన్నందున దీన్ని లక్ష్యం చేసుకుని సన్నద్ధమైనవారు రెండుమూడు ప్రయత్నాల్లోనే విజయం సాధించడానికి అవకాశాలున్నాయి. ఎంపికైనవారికి ఫ్లయింగ్, టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ బ్రాంచీల్లో ఉద్యోగాలు కేటాయిస్తారు. పరీక్ష అభ్యర్థులందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) అదనంగా రాయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) పరీక్ష ఉంటుంది. వీటన్నింటిలో అర్హత సాదించినవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వమించి శిక్షణకు తీసుకుంటారు. ఎంపికైన విభాగాన్ని బట్టి ఏడాది నుంచి 18 నెలలు శిక్షణ కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ అందిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు.ఉద్యోగాలను శాశ్వత, 14 ఏళ్లపాటు కొనసాగే ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
 

స్టేజ్‌ 1, 2 ఇలా...

రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్‌ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఏర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డు (ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 10 పుష్‌ అప్స్, 3 చిన్‌ అప్స్‌ తీయగలగాలి. స్టేజ్‌ -1 స్క్రీనింగ్‌ టెస్టు. ఇందులో ఆఫీసర్‌ ఇంటలిజెన్స్‌ రాటింగ్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు ఉంటాయి. చిన్న అసైన్‌మెంట్లు, పజిల్స్‌ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి దానిపై విశ్లేషణ చేయమంటారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్‌ -2కి వెళ్తారు. స్టేజ్‌ -2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండోర్, అవుట్‌ డోర్‌ ఇంటరాక్టివ్‌ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటిలో మానసిక, శారీరక పనులు మిళితమై ఉంటాయి. ఆపై వ్యక్తిగత ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ దశలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి మెడికల్‌ పరీక్షలు చేపడతారు. అందులోనూ విజయవంతమైతే శిక్షణ కోసం ఎంపిక చేస్తారు.  
 

శిక్షణ...
అభ్యర్థులకు సంబంధిత విభాగంలో జనవరి మొదటి వారం, 2022 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ బ్రాంచ్‌ అభ్యర్థులకు 74 వారాలు, గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ విభాగాల వారికి 52 వారాలు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు ఎంపికైనవారికి ముందుగా ఆరు నెలల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. తర్వాత అభ్యర్థుల ప్రతిభ ప్రకారం.. ఫైటర్‌ పైలట్, ట్రాన్స్‌పోర్ట్‌ పైలట్, హెలికాప్టర్‌ పైలట్లగా విడదీసి శిక్షణను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఒక్కో దశలో 6 నెలలు చొప్పున దుండిగల్, హకీంపేట, బీదర్, ఎలహంకల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. 

 

ప్రోత్సాహకాలు...
శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 చొప్పున స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు విధుల్లో చేరతారు. ఉద్యోగంలో చేరినవారికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ ఇతర అలవెన్సులు ఉంటాయి. అలాగే మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ) లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు ఫ్లయింగ్‌ అలవెన్సు, టెక్నికల్‌ బ్రాంచీలవారికి టెక్నికల్‌ అలవెన్సు అదనంగా అందుతాయి. అన్నీ కలుపుకుని రూ.లక్షకు పైగా వేతనం లభిస్తుంది. వీరికి వివిధ ప్రోత్సాహకాలు దక్కుతాయి.

 

అర్హతలు...
ఫ్లయింగ్‌ బ్రాంచ్, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ / ప్లస్‌ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉండాలి.   

 

వయసు: జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1998 - జనవరి 1, 2002 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి.
 

గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎల్రక్టానిక్స్‌/ మెకానికల్‌) పోస్టులు ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు. ఇంటర్‌/ +2లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
 

గ్రౌండ్‌ డ్యూటీ - నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్‌ విభాగాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్‌ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. అకౌంట్స్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో బీకాం పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 

వయసు: గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1996 - జనవరి 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. వీటికి పురుషులు 157.5, మహిళలు 152 సెం.మీ.ఎత్తు ఉండాలి.
 

ఖాళీలు: అన్ని విభాగాల్లోనూ కలుపుకుని 235 ఉన్నాయి.  
 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: డిసెంబరు 1 నుంచి 30 వరకు స్వీకరిస్తారు.
 

పరీక్షలు: ఫిబ్రవరిలో నిర్వహించవచ్చు.
 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, తిరుపతి. 
 

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌