• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగ ఖాతా తెరుస్తారా!

‣ బ్యాంకుల్లో 12,075 క్లర్కు ఉద్యోగాలు 
‣ ప్రిలిమ్స్‌తో పాటే మెయిన్స్‌ సన్నద్ధత

బ్యాంకు కొలువు...ఎందరో ఉద్యోగార్థుల కల! విధుల తీరు, చక్కని జీతం, ఆకర్షణీయమైన రుణ సదుపాయాలు దీని ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్కు పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్‌ సంస్థ తాజా ప్రకటన.. బ్యాంకులో పాగా వెయ్యాలనుకునేవారికి చక్కటి అవకాశం. ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం, సబ్జెక్టులు... అన్నీ గత ఏడాదిలాగే మార్పులేమీ లేకుండా ఉన్నాయి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్‌ పరీక్ష ముగిసేలోపే దానికీ, మెయిన్స్‌కు రెండింటికీ కలిపి సమగ్రంగా సిద్ధమైతే విజయ పథంలో ఉన్నట్టే!

బ్యాంకుల్లో క్లర్కు పోస్టులను 2020-21 సంవత్సరంలో భర్తీచేయడానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనెల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం- 12 వేలకు పైగా పోస్టులను దేశవ్యాప్తంగా భర్తీచేయనున్నారు. వీటిలో దాదాపు 1400 పోస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే భర్తీ అవనున్నాయి. నియామక ప్రక్రియ పూర్తయ్యేసమయానికి (31 మార్చి 2021) ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది!

ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే రెండంచెల ఆబ్జెక్టివ్‌ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. దీనిలో మొదటి అంచె (ప్రిలిమినరీ) కేవలం అర్హత పరీక్ష. రెండో అంచె (మెయిన్స్‌)లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు రెండింటిలోని ప్రతి విభాగంలో కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాల్సివుంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు మార్కులను వారి మొత్తం మార్కుల నుంచి తగ్గిస్తారు.

ఎల్‌పీటీ... ఉండేలా!
మొదటిసారిగా బ్యాంకు పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు తమ ప్రిపరేషన్‌ పట్ల స్పష్టత, ప్రణాళిక ఉండాలి. ముందుగా పరీక్షా విధానం, సబ్జెక్టులు, సిలబస్‌లపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ తరువాత పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలో చూడాలి.

పరీక్షలో విజయం సాధించాలంటే ఎల్‌పీటీ సూత్రం పాటించాలి. L- Learning (నేర్చుకోవడం), P-Practice (సాధన చేయడం), T-Tests (మోడల్‌ పరీక్షలు రాయడం). పరీక్షకున్న సమయంలోగా వీటన్నింటితో సిద్ధమవ్వాలి.

క్లర్కు పరీక్షకు సిద్ధమవడమంటే ‘ముందుగా ప్రిలిమ్స్‌ పరీక్ష, దానిలో క్వాలిఫై అయ్యాక మెయిన్స్‌ పరీక్ష’ అనుకోకూడదు. రెండింటికీ కలిపి తయారవ్వాలి. ప్రిలిమ్స్‌ పరీక్షలోగా రెండింటికీ సిద్ధమవ్వాలి. ప్రిలిమ్స్‌కు దాదాపు 3 నెలల సమయం ఉంది. అభ్యర్థులు తాము ప్రతిరోజూ నిర్దేశించుకున్న సమయంలో (కనీసం 8-10 గంటలు) ఎల్‌పీటీ ఉండేలా చూసుకోవాలి.

అన్ని విభాగాల్లో ఒక్కో టాపిక్‌ నేర్చుకుంటూ దానిలో ఉండే వివిధ తరహా ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. మొదటి రోజునుండే ఐబీపీఎస్‌ క్లర్కు పరీక్ష తరహాలో పూర్తిస్థాయి మోడల్‌పేపర్‌ను సమయాన్ని నిర్దేశించుకుని సాధించాలి. దీనివల్ల ప్రతి విభాగంలో నిర్దిష్ట సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో వారికి అవగాహన ఏర్పడుతుంది. మొదట్లో మోడల్‌ పేపర్‌లో తక్కువ మార్కులు వచ్చినా ప్రతిరోజూ కొత్త అంశాలు నేర్చుకుంటూ సాధన చేయడంవల్ల క్రమేపీ మోడల్‌ పేపర్‌లో కూడా ఎక్కువ మార్కులు వస్తాయి.

అభ్యర్థులు చేయాల్సిన మరొక పని- ప్రశ్నలను వేగంగా సాధించే మెలకువలను నేర్చుకోవడం. వీలైనన్ని షార్ట్‌కట్‌ పద్ధతులను నేర్చుకుంటూ వాటిని ప్రశ్నను సాధించే సమయంలో ఉపయోగించేలా చూసుకోవాలి.

జనరల్‌/ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ మినహా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలో ఒకే విధమైన సబ్జెక్టులున్నాయి. అయితే ఆయా పరీక్షలననుసరించి ప్రశ్నల స్థాయుల్లో భేదముంటుంది. అభ్యర్థులు పూర్వ ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే అది అర్థమవుతుంది. అందుకే వీలైనన్ని పూర్వ ప్రశ్నపత్రాలను సాధించాలి. దీనివల్ల పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నల సరళిలోని మార్పులను కూడా గమనించే అవకాశమేర్పడుతుంది. దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ కొనసాగించవచ్చు.

ఈవిధంగా అభ్యర్థులు ఎవరికి వారు తమకు నప్పే పరీక్షా ప్రణాళికను ఏర్పరుచుకుని శ్రద్ధగా సంసిద్ధం కావాలి. ఇలా చేస్తే ఎక్కువ సంఖ్యలో పోస్టులున్న ఈ సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకులో క్లర్కు ఉద్యోగం సులువుగా సాధించవచ్చు!

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు
ప్రిలిమ్స్‌: డిసెంబరు 7, 8, 14, 21
మెయిన్స్‌: 19.01.2020
దరఖాస్తు చేయడానికి చివరి తేది: 09.10.2019

ఎన్ని పోస్టులు?
ఆంధ్రప్రదేశ్‌: 777
తెలంగాణ: 612
విద్యార్హతలు: ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
వయసు: 20-28 సం. (01.09.2019 నాటికి)

ఇవి చేయకండి
ఐబీపీఎస్‌ క్లర్కు పరీక్షలో విజయం సాధించాలంటే అభ్యర్థులకు ఏమి చేయాలన్నదానితో పాటు ఏమేం చేయకూడదో కూడా తెలియటం తప్పనిసరి. అవేమిటో చూద్దాం.
‣ ప్రిపరేషన్‌ ఎక్కడ, ఎలా మొదలు పెట్టాలో తెలియకపోవడం
‣ టైమ్‌టేబుల్‌ అనుసరించకపోవడం
‣ తాము నిర్దేశించుకున్న పరీక్షా ప్రణాళికను వదిలివేయడం
‣ కేవలం రోజులో ఎన్ని గంటలు చదివామో అని మాత్రమే గమనించుకోవడం
‣ కొన్ని విభాగాలను అశ్రద్ధ చేయడం
‣ అన్ని కాన్సెప్టులపై పట్టులేకపోవడం
‣ తాము బాగా చేయగలిగే టాపిక్స్‌పై నిర్లక్ష్యం వహించడం
‣ మోడల్‌ పేపర్లు/ ప్రీవియస్‌ పేపర్లు సాధించకపోవడం
‣ రాసిన మోడల్‌ పేపర్‌ను విశ్లేషించుకోకపోవడం
‣ పరీక్షా విధానంలోని ఆన్‌లైన్‌ టెస్టులను సాధన చేయకపోవడం
‣ టాపిక్స్‌ను రెగ్యులర్‌గా పునశ్చరణ (రివిజన్‌) చేయకపోవడం
‣ పరీక్ష రాయటంలో తమ వేగం, కచ్చితత్వం గమనించుకోకపోవడం, వాటిని మెరుగుపరుచుకోకపోవడం
‣ ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవకపోవడం. కరెంట్‌ అఫైర్స్‌, ఫైనాన్షియల్‌/బ్యాంకింగ్‌ వార్తలను పట్టించుకోకపోవడం
‣ దృష్టినంతా ప్రిలిమ్స్‌ పరీక్ష పైన మాత్రమే పెట్టడం
‣ సోషల్‌మీడియాను వదల్లేక దానిలో విలువైన సమయం వృథా చేయడం
‣ లక్ష్యసాధనకు అవసరమైన ప్రేరణను పరీక్ష రాసేవరకూ కొనసాగించకపోవడం
వీటన్నింటినీ అనుకూలంగా మార్చుకుంటే ఫలితం తప్పక వస్తుంది. అభ్యర్థులూ.. గుర్తుంచుకోండి- విజయం సాధించాలంటే మీరు మాత్రమే కష్టపడాలి. వేరెవరో మీకోసం ఏమీ చేయలేరు!

Posted Date : 10-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌