• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో సెంట్రల్ కొలువులు 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌: సీహెచ్‌ఎస్‌ఎల్‌ -2020 ప్రకటన విడుదల

ఇంటర్‌ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ (ఎస్‌ఎస్‌సీ: సీహెచ్‌ఎస్‌ఎల్‌)-2020 ప్రకటన వెలువడింది. మూడంచెల్లో నిర్వహించే ఈ పరీక్షలో ప్రతిభ చూపిస్తే ఎల్‌డీసీ, పోస్టల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ హోదాలతో ఉద్యోగ విధులు నిర్వర్తించవచ్చు. చిన్న వయసులోనే సుస్థిరమైన కెరియర్‌ నిర్మించుకోవచ్చు! 

ఎస్‌ఎస్‌సీ ఏటా నిర్వహించే పరీక్షల్లో సీహెచ్‌ఎస్‌ఎల్‌ ఒకటి. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడానికి అవసరమైన నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మూడంచెల్లో నిర్వహించే ఈ పరీక్షలో ఒక అంకం నెగ్గినవారికే రెండో దశకు చేరడానికి అవకాశం లభిస్తుంది. ముందుగా టైర్‌-1 పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పేపర్, టైర్‌-3 స్కిల్‌ టెస్టు/ టైపింగ్‌ టెస్టు. తుది నియామకాలు మాత్రం టైర్‌ 1, 2ల్లో చూపిన ప్రతిభ ద్వారా చేపడతారు. టైర్‌ 3లో అర్హత సాధిస్తే సరిపోతుంది. టైర్‌ 2 అర్హత కోసం 33 శాతం మార్కులు తప్పనిసరి.  శాఖల వారీ పోస్టుల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. సీహెచ్‌ఎస్‌ఎల్‌-2019లో 4900, 2020లో 5900 ఖాళీలకు నియామకాలు జరిగాయి. ఒక్కో విడతలోనూ 3500కు పైగా ఉద్యోగాలు పోస్టల్‌ అసిస్టెంట్‌ / సార్టింగ్‌ అసిస్టెంట్‌ విభాగంలో భర్తీ చేశారు. 

లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఏ) పోస్టుల్లో చేరినవారికి లెవెల్‌ 2 ప్రకారం రూ.19,900 మూలవేతనం అందుతుంది. 
పోస్టల్‌ అసిస్టెంట్‌ / సార్టింగ్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలకు ఎంపికైనవారికి లెవెల్‌ 4 ప్రకారం రూ.25,500 మూలవేతనం దక్కుతుంది. అయితే కొన్ని విభాగాలకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు మాత్రం లెవెల్‌ 5 మూలవేతనం రూ.29,200 చెల్లిస్తారు. మూలవేతనానికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనం. లెవెల్‌-2 ఉద్యోగాలకు ఎంపికైనవారు సుమారు రూ.30 వేలు, లెవెల్‌-4 పోస్టులు సాధించినవారు ఇంచుమించు రూ.40 వేలు, లెవెల్‌-5 హోదా పొందినవారు అటుఇటుగా రూ.యాభై వేలు వేతనం అందుకోవచ్చు.

టైర్‌-1: ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి గంట. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. తప్పుగా గుర్తించిన సమాధానానికి అర మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో 4 భాగాలు ఉంటాయి. ఆంగ్ల భాషలో ప్రాథమిక స్థాయిలో 25, జనరల్‌ ఇంటలిజెన్స్‌ 25, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (బేసిక్‌ అరిథ్‌మెటిక్‌ స్కిల్‌) 25, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు వస్తాయి. ఆంగ్ల విభాగం తప్ప మిగిలిన ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో వస్తాయి.

టైర్‌-2: ఈ పరీక్షను డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. పేపర్‌పై పెన్నుతో రాయాలి. వంద మార్కుల ప్రశ్నపత్రం. పరీక్ష వ్యవధి గంట. ఇందులో 2 ప్రశ్నలు వస్తాయి. అడిగిన అంశంలో వ్యాసాన్ని 200-250 పదాల్లో రాయాలి. ఉత్తరం లేదా దరఖాస్తు 150-200 పదాల్లో పూర్తిచేయాలి. జవాబులను హిందీ లేదా ఇంగ్లిష్‌లోనే రాయాలి. ఈ విభాగంలో అర్హతకు కనీసం 33 శాతం మార్కులు పొందడం తప్పనిసరి. 

టైర్‌-3: దరఖాస్తు చేసుకున్న పోస్టు బట్టి స్కిల్‌ లేదా టైప్‌ టెస్టు నిర్వహిస్తారు. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు స్కిల్‌ టెస్టు నిర్వహిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు టైపింగ్‌ టెస్టు ఉంటుంది. ఈ పరీక్షల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. డేటా ఎంట్రీ పోస్టులకు టైపింగ్‌లో భాగంగా కంప్యూటర్‌పై 15 నిమిషాలకు 2000 నుంచి 2200 కీ డిప్రెషన్స్‌ ఇవ్వాలి. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ విభాగంలోని పోస్టులకైతే 15 నిమిషాలకు 3700-4000 కీ డిప్రెషన్స్‌ తప్పనిసరి. ఏదైనా అంశంలో ముద్రించిన సమాచారం పేపర్‌పై ఇచ్చి దాన్ని కంప్యూటర్‌లో పొందుపర్చమంటారు. ఈ ప్రయత్నంలో తప్పులు దొర్లితే మార్కులు తగ్గిస్తారు. టైప్‌ టెస్టులో భాగంగా ఇంగ్లిష్‌ లేదా హిందీ ఎంచుకోవచ్చు. ఆంగ్లం అయితే నిమిషానికి 35, హిందీ 30 పదాల చొప్పున టైప్‌ చేయాలి. పది నిమిషాల వ్యవధితో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆంగ్లంలో అయితే 1750, హిందీలో 1500 కీ డిప్రెషన్స్‌ ఇవ్వగలగాలి. టైప్‌/ స్కిల్‌ టెస్టులు ఎస్‌ఎస్‌సీ ప్రాంతీయ కేంద్రాల్లో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు వీటిని చెన్నైలో నిర్వహిస్తారు.

మెరుగైన మార్కులకు...
పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. ఇలా రాస్తున్నప్పుడు సమయ నిబంధనను కచ్చితంగా పాటించాలి. జవాబులను సరిచూసుకుని వెనుకబడిన విభాగాల సన్నద్ధతకు అదనపు సమయం కేటాయించుకోవాలి. టైర్‌-1లో అరవై నిమిషాల్లో వంద ప్రశ్నలకు జవాబు గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకు 36 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంటలిజెన్స్‌ల్లో వివిధ ప్రశ్నలకు ఈ వ్యవధి సరిపోదు. సెక్షన్లవారీ సమయాన్ని నిర్ణయించలేదు కాబట్టి ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలను తక్కువ వ్యవధిలో ముగించి మిగిలిన వ్యవధిని క్వాంట్, ఇంటలిజెన్స్‌ అంశాల్లోని ప్రశ్నలకు వెచ్చించాలి. అవకాశం ఉన్నన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే తక్కువ వ్యవధిలో పరీక్ష పూర్తి చేయడం సాధ్యమవుతుంది. కొన్ని ప్రశ్నలకు జవాబు రాబట్టడానికి ఎక్కువ సమయం అవసరం కావచ్చు. అలాంటివాటిని ఆఖరులో, సమయం ఉంటేనే ప్రయత్నించాలి. రుణాత్మక మార్కులు ఉన్నందున అసలేమాత్రం తెలియని, అవగాహన లేని ప్రశ్నలను వదిలేయడమే మంచిది. 

జనరల్‌ ఇంగ్లిష్‌
ఈ విభాగంలో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో గమనిస్తారు. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, కాంప్రహెన్షన్‌.. తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ మార్కులు పొందడానికి 8,9,10 తరగతుల ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకోవాలి. వీలైనన్ని నమూనా ప్రశ్నలు సాధన చేయాలి.

జనరల్‌ ఇంటెలిజన్స్‌ 
ఈ విభాగంలో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలు ఉంటాయి. నంబర్‌ ఎనాలజీ, నంబర్‌ క్లారిఫికేషన్, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్, నంబర్‌ సిరీస్, కోడింగ్‌- డీకోడింగ్, వర్డ్‌ బిల్డింగ్‌...మొదలైన విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. తర్కాన్ని ఉపయోగించి వీటికి జవాబులు గుర్తించవచ్చు. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకుంటే ఈ విభాగం ఎవరికైనా సులువుగానే ఉంటుంది. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా తక్కువ సమయంలో జవాబు గుర్తించే నైపుణ్యం అలవడుతుంది. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 
నంబర్‌ సిస్టమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, త్రికోణమితి అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌లో శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వయసు నిర్ణయించడం, రైళ్లు, పడవ వేగాలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ దాదాపు దిగువ తరగతుల్లో చదువుకున్నవే. అందువల్ల గణిత పుస్తంలోని ఈ విభాగాలను మరోసారి బాగా అభ్యాసం చేయాలి. అలాగే ముఖ్యమైన సూత్రాలు, వాటిని ఉపయోగించే విధానం తెలుసుకోవాలి.  

జనరల్‌ అవేర్‌నెస్‌
సాధారణ పరిజ్ఞానంతో ఈ విభాగంలో ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. దైనందిన జీవితంతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా వస్తాయి. చుట్టూ జరుగుతోన్న సంఘటనలపై అవగాహన ఉన్నవారు సులువుగానే సమాధానాలు గుర్తించగలరు. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. 8,9,10 తరగతుల సైన్స్, సోషల్‌ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన విషయాలు నోట్సు రాసుకోవాలి. వర్తమాన వ్యవహారాల కోసం మార్చి 2020 నుంచి రాబోయే మార్చి 2021 వరకు ముఖ్య సంఘటనలు మననం చేసుకోవాలి. పత్రికలు చదువుతున్నప్పుడే ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్నవాటిని నోట్సు రూపంలో రాసుకుంటే గుర్తుంచుకోవడం తేలికవుతుంది. నియామకాలు, అవార్డులు, విజేతలు, రచయితలు... ఈ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. 

ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలను తక్కువ వ్యవధిలో ముగించాలి. మిగిలిన వ్యవధిని క్వాంట్, ఇంటలిజెన్స్‌ అంశాల్లోని ప్రశ్నలకు వెచ్చించటం మేలు

ప్రకటన ముఖ్యాంశాలు
అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.
వయసు: జనవరి 1, 2021 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1994 - జనవరి 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ:  డిసెంబరు 15, 2020
దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు
టైర్‌-1 పరీక్షలు: ఏప్రిల్‌ 12 నుంచి 27 వరకు నిర్వహిస్తారు 
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల
టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్ష: వివరాలు తర్వాత ప్రకటిస్తారు. 
వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌