• facebook
  • whatsapp
  • telegram

బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన

   మొగలుల పరిపాలన ఉన్నత స్థితిలో ఉన్నకాలంలో యూరోపియన్లు వ్యాపార కార్యకలాపాల కోసం భారత్‌కు వచ్చారు. యూరోపియన్ల రాక ఆధునిక భారతదేశ చరిత్ర గతినే మార్చేసింది. ముందుగా వ్యాపారానికే పరిమితమైనా తర్వాత రాజకీయాల్లో తలదూర్చి ఆర్థిక, మత, సాంస్కృతిక పరిణామాలను నిర్దేశించారు. భారత్‌లో లభ్యమయ్యే సుగంధ ద్రవ్యాలకు ఐరోపా రాజ్యాల్లో గిరాకీ ఎక్కువగా ఉండేది. దీంతో యూరోపియన్లు భారత్‌లో అనేక 'ప్రాంతీయ కర్మాగారాల' పేరుతో వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలు ఏర్పర్చుకోవడంలో గుత్తాధిపత్యం కోసం పోర్చుగీస్, డచ్, బ్రిటిషర్లు, ఫ్రెంచ్‌వాళ్లు తమలోతాము పోటీపడ్డారు. ఈ పోటీలో పోర్చుగీస్, డచ్చి వారిపై బ్రిటిషర్లు సులభంగా విజయం సాధించారు. కానీ ఫ్రెంచ్‌వారి నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. వాణిజ్యం విషయంలో బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య పోటీ తలెత్తింది. దీంతోపాటు భారత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వారుచేసిన ప్రయత్నాలు 'కర్ణాటక యుద్ధాల'కు దారితీశాయి. 1756-1761 మధ్య జరిగిన మూడో కర్ణాటక యుద్ధం వల్ల బ్రిటిషర్లకు ఫ్రెంచివారి నుంచి పోటీ లేకుండా పోయింది. మూడో కర్ణాటక యుద్ధంలో సర్ ఐర్‌కూట్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం 1760లో వందవాసి (వాండివాష్) యుద్ధంలో ఫ్రెంచివారిని ఓడించారు. ఈ విజయంతో దక్షిణ భారతదేశ రాజకీయాల్లో బ్రిటిషర్లు బలమైన శక్తిగా రూపొందారు.
 

బెంగాల్‌లో బ్రిటిష్ అధికార స్థాపన
భారత్‌లోని సారవంతమైన, సౌభాగ్యమైన ప్రాంతాల్లో బెంగాల్ ఒకటి. మొగలుల రాజ్యంలో భాగంగా ఉన్న బెంగాల్ 18వ శతాబ్దంలో స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. బెంగాల్ నవాబ్ అలీవర్దీఖాన్ మొదట బ్రిటిష్‌వారి పట్ల స్నేహభావంలో ఉండేవాడు. కానీ కర్ణాటక పరిణామాలు అలీవర్దీఖాన్‌లో ఆందోళన రేకెత్తించాయి. 1756లో అలీవర్దీఖాన్ మరణించడంతో అతడి మనుమడు సిరాజుద్ధౌలా బెంగాల్ నవాబ్ అయ్యాడు. బ్రిటిష్, ఫ్రెంచివారు బెంగాల్‌లోని తమ కోటలను బలపరుచుకోవడం ప్రారంభించారు. 'యూరోపియన్లు వర్తకులుగానే ఉండాలి తప్ప, యజమానులు కాకూడదు' అని సిరాజ్ భావించాడు. కలకత్తా, చంద్రనాగూర్‌లలో ఉన్న కోటలను పడగొట్టవలసిందిగా బ్రిటిష్, ఫ్రెంచివారినీ సిరాజ్ ఆదేశించాడు. సిరాజుద్ధౌలా ఆజ్ఞను ఫ్రెంచివారు అమలు చేశారు. కర్ణాటక యుద్ధ విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో బ్రిటిషర్లు సిరాజ్ ఆదేశాలను ధిక్కరించి బెంగాల్‌లో వర్తకం చేయాలని భావించారు. దీంతో బెంగాల్ నవాబు 1756లో సైన్యాలను పంపి, బ్రిటిష్ స్థావరాలైన కాశింబజార్, కలకత్తాలను ఆక్రమించాడు.
 

కలకత్తా చీకటి గది ఉదంతం:
* 1756 జూన్‌లో సిరాజుద్ధౌలా కలకత్తాలోని పోర్ట్ విలియంకోట ముట్టడిలో 146మంది బ్రిటిషర్లను ఖైదీలుగా పట్టుకుని ఒక చిన్న గదిలో బంధించాడు. మరుసటిరోజు ఉదయం తలుపులు తెరిచేసరికి 23 మంది మాత్రమే బతికి ఉన్నారు. ఇది కలకత్తా చీకటి గది ఉదంతంగా ప్రసిద్ధికెక్కింది.
* బెంగాల్ పరిణామాలను గుర్తించిన మద్రాస్‌లోని అధికారులు కలకత్తా పునరాక్రమణ బాధ్యతలను రాబర్ట్ క్లైవ్ కు అప్పగించారు.
* క్లైవ్ కు సహకరించడానికి కల్నల్ వాట్సన్ నాయకత్వంలో నౌకాదళాన్ని పంపించారు. క్లైవ్, వాట్సన్‌లు 1757 జనవరిలో కలకత్తాను పునరాక్రమించుకున్నారు.
 

 ప్లాసీ యుద్ధం:
ప్లాసీ యుద్ధం రాబర్ట్‌క్లైవ్, సిరాజుద్ధౌలాకు మధ్య 1757 జూన్ 23న జరిగింది. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్ధౌలాను బ్రిటిషర్లు వధించారు. ఈ యుద్ధంలో సిరాజుద్ధౌలా సేనాని మీర్ జాఫర్ బెంగాల్ రాజ్యాధికారాన్నిఆశించి క్లైవ్ కు సహకరించాడు. మీర్ జాపర్‌తోపాటు సిరాజ్ ప్రతినిధి మాణిక్‌చంద్, వర్తకుడు అమీన్‌చంద్, బ్యాంకర్ జగత్‌సేట్, భూస్వామి రాయ్‌దుర్లభ్, ఖడింఖాన్ ప్లాసీ యుద్ధంలో క్లైవ్ కు సహకరించి సిరాజ్‌ను ఓడించిన కుట్రలో భాగస్వాములయ్యారు. క్లైవ్ కు, కుట్రదారులకు మధ్య రహస్య ఒప్పందాన్ని అమీన్‌చంద్ కుదిర్చాడు.
* ప్లాసీ యుద్ధంలో విశ్వాస ఘాతకులైన మీర్‌జాఫర్, రాయ్‌దుర్లభ్ నాయకత్వంలోని సిరాజ్ ముఖ్య సైన్యం యుద్ధంలోనే పాల్గోలేదు. ప్లాసీ యుద్ధంలో 29మంది బ్రిటిష్ సైనికులు, సుమారు 500మంది బెంగాల్ సైనికులు మరణించారు. క్లైవ్ సహకారంతో మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయ్యాడు. దాని ఫలితంగా 24 పరగణాల భూమి కంపెనీకి లభించింది.
 

ప్లాసీ యుద్ధ ఫలితాలు:
* రాజకీయంగా ప్లాసీ యుద్ధానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ యుద్ధానంతరం బెంగాల్‌లోనూ, భారతదేశంలోనూ సర్వాధిపత్యం చెలాయించడానికి బ్రిటిషర్లకు మార్గం సులువైంది.
* బ్రిటిషర్లు తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం బెంగాల్ ఆర్థిక వనరులను ఉపయోగించుకున్నారు.
* ఆర్థిక వనరులతోపాటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
* బ్రిటిషర్ల భారతదేశ ఆక్రమణ వాస్తవానికి ప్లాసీ యుద్ధంతోనే మొదలైంది.
* ఈ యుద్ధం ద్వారా బ్రిటిషర్లకు కలిగిన ప్రయోజనాలు ఏ యుద్ధంతోనూ లభించలేదు.
* ఈ యుద్ధం బ్రిటిషర్ల ఖ్యాతిని మరింత పెంచింది.
* భారత్‌లోని రాజకీయ బలహీనతలను బహిర్గత పరిచింది.
* ఆర్థిక దోపిడి, భారత సంపదను బ్రిటన్‌కు తరలించడం ఈ యుద్ధంతోనే ప్రారంభమైంది.
* 1758లో క్లైవ్ బెంగాల్ గవర్నర్ అయ్యాడు. ఇతడు బెంగాల్‌లో డచ్‌వారిని అంతమొందించాడు.
 

బక్సార్ యుద్ధం:
1760లో రాబర్ట్ క్లైవ్ ఇంగ్లండ్‌కు వెళ్లిన తర్వాత వాన్‌సిటార్ట్ బెంగాల్ గవర్నర్ అయ్యాడు. మీర్ జాఫర్‌ను బెంగాల్ నవాబ్ పదవి నుంచి తొలగించి, అతడి అల్లుడు మీర్‌ఖాసీంను బెంగాల్ పీఠంపై వాన్‌సిటార్ట్ కూర్చోబెట్టాడు.
* మీర్‌ఖాసీం బర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ జిల్లాలను కంపెనీకి అప్పగించాడు.
* 29 లక్షల రూపాయలను కంపెనీ అధికారులకు ముట్టజెప్పాడు.
* మీర్‌ఖాసీం కొంతకాలం తర్వాత పరిపాలనా వ్యవహారాల్లో, కంపెనీ జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించి, బ్రిటిషర్ల ఆగ్రహానికి గురయ్యాడు.
* 1763లో మీర్‌ఖాసీంను తొలగించి, మీర్ జాఫర్‌ను మళ్లీ బెంగాల్ నవాబును చేశారు.
* మీర్‌ఖాసిం అయోధ్య నవాబు షుజా ఉద్ధౌలా, మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం సహాయం కోరాడు.
* సర్ హెక్టర్ మన్రో నాయకత్వంలోని కంపెనీ సైన్యం మీర్‌ఖాసీం కూటమిని 1764 అక్టోబరు 17న బక్సార్ యుద్ధంలో ఓడించింది.
* భారతదేశ చరిత్రలోనే నిర్ణయాత్మక యుద్ధాల్లో బక్సార్ యుద్ధం ఒకటి.
బక్సార్ యుద్ధం బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసింది.
* 1765లో బెంగాల్ గవర్నర్‌గా క్లైవ్ తిరిగి నియమితుడయ్యాడు.
క్లైవ్ మొఘల్ చక్రవర్తి, అయోధ్య నవాబుతో అలహాబాద్ సంధిని కుదుర్చుకున్నాడు.
* బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది.
* బెంగాల్ అధికారాలను దివానీ, నిజామత్‌లుగా విభజించారు.
* దివానీ అంటే భూమిశిస్తు వసూలు చేసుకునే అధికారం, నిజామత్ అంటే పరిపాలనా బాధ్యత.
* 1770లో బెంగాల్‌లో తీవ్ర క్షామం వచ్చింది. లక్షలాదిమంది దీనికి బలయ్యారు.
* కంపెనీ వర్తకుల్లో అవినీతి పెరిగింది.
* కంపెనీ పరిస్థితిని సరిదిద్దడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేసింది.
భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత రాబర్ట్ క్లైవ్ కు దక్కుతుంది. కానీ ఇతడిపై ఫోర్జరీ నేరారోపణ కూడా వచ్చింది. చిన్న గుమాస్తాగా జీవితం ప్రారంభించిన ఇతడు స్వయంకృషితో గవర్నర్ పదవికి ఎదిగాడు.

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌