భూకంపనాభి (Focus or Hypocentre)
* భూ అంతర్భాగంలో భూకంపం ప్రారంభమయ్యే ప్రదేశాన్ని భూకంపనాభి అంటారు.
* p తరంగాలు, l తరంగాల వేగంలోని తేడా ఆధారంగా భూకంపనాభి లోతును నిర్ధారిస్తారు.
భూకంప అభికేంద్రం (Epicentre)
* భూకంపనాభికి 90o కోణంలో భూ ఉపరితలంపై ఉండే ప్రదేశాన్ని భూకంప అభికేంద్రం అంటారు.
* భూకంపాల వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రాంతం భూ అభికేంద్రం.
* భూకంపనాభి లోతు పెరిగే కొద్దీ భూకంప ప్రభావానికి గురయ్యే ప్రాంత వైశాల్యం పెరుగుతుంది. భూకంప తీవ్రత తగ్గుతుంది.
* భూకంపనాభి లోతు తగ్గే కొద్దీ భూకంప తీవ్రత పెరుగుతుంది.
* భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని భూకంపశాస్త్రం (Seismology) అంటారు. వీటి తీవ్రతను తెలుసుకునేందుకు ‘భూకంపలేఖిని’ (Seismograph) అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.
* సెస్మోగ్రాఫ్ని తయారు చేసిన దేశం చైనా.
* భూకంప తరంగాలను గుర్తించి, ఒక గ్రాఫ్లా తయారు చేయడాన్ని భూకంప తరంగ చిత్రం అంటారు.
రకాలు
* భూకంప నాభి లోతు ఆధారంగా భూకంపాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:
1. లోతు నాభి భూకంపాలు/ అగాధ భూకంపాలు: భూ అంతర్భాగంలో 300 కి.మీ. కంటే ఎక్కువ లోతులో ఏర్పడే భూకంపాలు.
2. మాధ్యమిక నాభి భూకంపాలు: భూ అంతర్భాగంలో 55 కి.మీ. నుంచి 300 కి.మీ. లోతులో ఏర్పడే భూకంపాలు.
3. తక్కువ లోతు నాభి భూకంపాలు/ గాధ భూకంపాలు: 55 కి.మీ. కంటే తక్కువ లోతులో ఏర్పడే భూకంపాలు.
* భూ ఉపరితలంపై తీవ్ర నష్టానికి కారణమయ్యే భూకంపాలు - తక్కువ లోతు నాభి భూకంపాలు.
ట్రెమర్స్ (Tremors): ట్రెమర్స్ అనేవి చిన్న సైజు భూకంపాలు. వీటిని గుర్తించడం సాధ్యం కాదు. ఇవి అపాయకరమైనవి కాదు.
భూకంప తీవ్రత
* భూకంపం సంభవించడం వల్ల భూమి ఉపరితలంపై జరిగే ప్రాణ - ఆస్తి నష్టం, కూలిపోయిన భవనాలు, భూమిపై సంభవించిన పగుళ్లు మొదలైన వాటిని భూకంప తీవ్రత అంటారు. ఇది అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. ఈ నష్టం వివిధ రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:
1. ఎపిసెంటర్ నుంచి దూరం: భూ అంతర్భాగంలో ఉన్న భూకంపనాభి (ఫోకస్)లో భూకంపం ఆవిర్భవించగానే అందులో నుంచి విడుదలయ్యే శక్తి తరంగాల రూపంలో అన్ని దిక్కులకూ వ్యాపిస్తుంది.
* ఫోకస్కి లంబంగా భూ ఉపరితలం మీదకు గీసిన బిందువును భూకంప అభికేంద్రం (Epicentre) అంటారు.
* ఎపిసెంటర్ వద్ద జననష్టం, ఆస్తినష్టం ఎక్కువగా ఉంటాయి. దీని నుంచి దూరం పెరిగే కొద్దీ భూకంప తీవ్రత తగ్గుతుంది.
2. భూమి లోపలి పొరల ఒత్తిడి: భూకంప తీవ్రత భూమి లోపలి పొరల స్థితి ఆధారంగా కూడా మారుతూ ఉంటుంది.
ఉదా: భూమి లోపలి పొరల్లో భ్రంశాలు, సందులు, పగుళ్లు మొదలైనవి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కట్టిన భవనాలపై భూకంప తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉండదు. కాబట్టి వాటి నిర్మాణం దెబ్బతినదు. భూకంప తరంగాలు ఆ పగుళ్ల మీదుగా పయనిస్తాయి. దీంతో నష్టం వాటిల్లదు. భూమిలోపల ఇవన్నీ లేకుండా భూమి గట్టిగా, దట్టంగా, సంఘటితంగా ఉన్న చోట కట్టిన భవనాలు భూకంప తాకిడికి దెబ్బతింటాయి.
* భూకంపాలు పెద్ద ఎత్తున సంభవించినప్పుడు దాని నుంచి విడుదలయ్యే శక్తి, సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎర్గ్ (Erge) లేదా జౌల్స్ (Joules) తో కొలుస్తారు.
1 Erge = 1 Dyne/-cm(లేదా)
1 Joule = 107 Ergs.
* భూకంపం సంభవించినప్పుడు దాని నుంచి వెలువడే శక్తి సామర్థ్యాలు 1010 Ergs నుంచి 1024 Ergs వరకు ఉంటాయి. ఇది కొన్ని వందల మిలియన్ ఆటంబాంబులతో సమానం.
* భూకంప శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకునేందుకు నాలుగు రకాల స్కేళ్లు అందుబాటులో ఉన్నాయి. అవి:
1. మెర్కలీ స్కేలు 2. రోస్సీ - ఫోరెల్ స్కేలు
3. ఓమరీ స్కేలు 4. రిక్టర్ స్కేలు
మెర్కలీ స్కేలు: ఇటలీకి చెందిన గ్యుసెప్పే మెర్కలీ భూకంప తీవ్రతను గుర్తించేందుకు 1931లో ఒక స్కేలును కనుక్కున్నారు. దీనికి మెర్కలీ స్కేల్ అనే పేరు పెట్టారు. దీనిలో 12 పాయింట్లు ఉంటాయి.
రోస్సీ - ఫోరెల్ స్కేలు: ఇటలీకి చెందిన మిచెల్ స్టెఫానో కాంటె డి రోస్సీ, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఫోరెల్ దీన్ని అభివృద్ధి చేశారు. ఇందులో 10 పాయింట్లు ఉంటాయి.
రిక్టర్ స్కేలు (Richter scale): కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ‘చార్లెస్ రిక్టర్’ 1935లో దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ స్కేలు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది. ఇందులో 9 నెంబర్లు ఉంటాయి.
* రిక్టర్ స్కేలుపై నమోదు తీవ్రత 2గా సూచిస్తే, మనం భౌతికంగా గుర్తించలేని భూ ప్రకంపనలు సంభవించినట్లు అర్థం. అందులోని ఏడో అంకె విశాలమైన ప్రాంతాన్ని నాశనం చేయగల తీవ్రతను గుర్తిస్తుంది/ సూచిస్తుంది.
భారతదేశంలో సంభవించిన భూకంపాలు
* భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం హిమాలయ పర్వత ప్రాంతం.
* భారతదేశంలో అధికంగా భూకంపాలు సంభవించే రాష్ట్రం అస్సాం.
* 1819: గుజరాత్ - కచ్ భూకంపం.
* 1897, 1950: అస్సాం భూకంపం.
* 1934: బిహార్ - నేపాల్ సరిహద్దు భూకంపం
* 1967: మహారాష్ట్ర - కొయనా భూకంపం.
* 1992: ఉత్తర కాశీ (యూపీ) భూకంపం
* 1993: మహారాష్ట్ర లాతూర్ భూకంపం.
* 1997: మధ్యప్రదేశ్ భూకంపం.
* 2001: భుజ్ భూకంపం.
* ప్రపంచంలో భూకంపాలు సంభవించేందుకు అవకాశంలేని దేశం ఆస్ట్రేలియా.
భూకంప తీవ్రత - శక్తి సామర్థ్యాలు
* భూకంపం సంభవించినప్పుడు దాని తీవ్రత (intensity), శక్తి సామర్థ్యాలు (magnitude) మొదలైనవి ఎంత ఉంటాయి అనే అంశంపై శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
* భూకంపానికి ముందు లేదా తర్వాత ‘ట్రెమర్స్’ అనేవి వస్తాయి. ఇవి ప్రమాదకరం కాదు.
టర్కీ భూకంపం
* సిరియా సరిహద్దు సమీపంలో టర్కీ (తుర్కియే) ఆగ్నేయ ప్రాంతంలో 2023, ఫిబ్రవరి 6న భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది.
* ఈ భూకంపం కారణంగా వేలాది మంది మరణించారు.
* టర్కీలో చారిత్రక గాజియన్టెప్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
* అనటోలియన్, అరేబియన్ భూఫలకాల మధ్య 100 కిలోమీటర్ల దూరం పైగా పగులు, ఒరిపిడితో ఈ భారీ స్థాయి భూకంపం తుర్కియే, సిరియాలను తాకింది.
* ఈ భూకంపం 1939లో ఈశాన్య టర్కీలో సంభవించిన అతిపెద్ద భూకంప పరిమాణాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
భూకంప తరంగాలు (Seismic waves)
* భూకంపనాభి నుంచి విడుదలైన శక్తి విభిన్న దిశలు, వేగాలు, తీవ్రతతో కంపన తరంగాల రూపంలో భూ ఉపరితలాన్ని చేరుతుంది. వీటినే భూకంప తరంగాలు అంటారు. ఇవి ప్రయాణించే దిశ, వేగం, తీవ్రత ఆధారంగా వీటిని మూడు రకాలుగా విభజించారు. అవి:
1. ప్రాథమిక తరంగాలు - Primary waves/ P తరంగాలు
2. ద్వితీయ తరంగాలు - Secondary waves/ Distortional waves/ S waves
3. ఉపరితల తరంగాలు Surface waves/ Rayleigh waves/ L waves
ప్రాథమిక తరంగాలు
* వీటిని ఒత్తిడి కలిగించే తరంగాలు (condensation waves), తోపుడు తరంగాలు అని కూడా అంటారు.
* P తరంగాలు తరంగమార్గం మీదుగా అణువులను ముందుకు, వెనక్కు కదుపుతూ ప్రయాణిస్తాయి.
* ఈ తరంగాలు ఎలాంటి మార్గం నుంచైనా ప్రయాణించగలవు.
* ఇవి మిగిలిన తరంగాల కంటే వేగంగా పనిచేస్తాయి. వీటి వేగం సెకన్కి 8 నుంచి 10 కి.మీ. వరకు ఉంటుంది.
* ఇవి ధ్వని తరంగాలను పోలి ఉంటాయి.
* P తరంగాల వేగం S తరంగాల వేగం కంటే 1.7 రెట్లు ఎక్కువ.
* P తరంగాలు ప్రయాణించే మార్గం పుటాకారంగా (concave) ఉంటుంది.
* భూకంపం సంభవించినప్పుడు ఈ తరంగాలు సిస్మోగ్రాఫ్లో త్వరగా రికార్డు అవుతాయి.
* రాతిపొరల సాంద్రత పెరిగితే ఈ తరంగాల వేగం కూడా పెరుగుతుంది.
ద్వితీయ తరంగాలు
* వీటిని గౌణ తరంగాలు, తిర్యక్ తరంగాలు అని కూడా అంటారు.
* ఈ తరంగాలు ప్రయాణించే దిశకు లంబంగా రాతి రేణువులు పైకీ కిందికీ కదులుతూ ఉంటాయి.
* ఇవి ద్రవ మార్గాల్లో (నీటిలో) ప్రయాణించలేవు.
* ఈ తరంగాల వేగం సెకనుకు 5 - 7 కి.మీ. వరకు ఉంటుంది. సిస్మోగ్రాఫ్లో P తరంగాల తర్వాత ఇవి నమోదు అవుతాయి.
* P, S తరంగాలు రెండూ భూమి లోపలికి చొచ్చుకుపోతాయి కానీ భూ ఉపరితలంపై ప్రయాణించలేవు. అందుకే వీటిని అంతర్ తరంగాలు (Body waves) అని పిలుస్తారు.
L తరంగాలు
* ఇవి చాలా జఠిలమైనవి. ఇవి ధ్వని తరంగాలను పోలి ఉండవు.
* ఈ తరంగ కదలికలు చాలా ప్రస్ఫుటంగా ఉంటాయి. ఇవి ప్రయాణించే దిశలో కోడిగుడ్డు ఆకారంలో రాతిరేణువులు కదులుతూ ఉంటాయి.
* అన్ని తరంగాల కంటే ఇవి చాలా నెమ్మదిగా పయనిస్తాయి. వీటి వేగం సెకనుకు 3 - 4 కి.మీ. వరకు ఉంటుంది.
* L తరంగాలను ర్యాలీ తరంగాలు, దీర్ఘ తరంగాలు అని కూడా అంటారు.
* ఇవి తరంగ మార్గంలో సముద్ర కెరటాల్లా ప్రయాణిస్తాయి.
* భూ ఉపరితలంపై సంభవించే నష్టానికి ఇవే కారణం.
* ఈ తరంగాలన్నీ వివిధ మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తాయి.
* P, S తరంగాల అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు భూ అంతర్నిర్మాణం గురించి తెలుసుకుంటారు.