భూమి అత్యంత ముఖ్యమైన సహజ వనరు. ఇది భూ ఉపరితలంపై 30% మాత్రమే ఉంది. భూమిని వ్యవసాయం, గనుల తవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్లు, పరిశ్రమల స్థాపన మొదలైన అనేక రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీన్నే ‘భూ వినియోగం’ అంటారు. స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత లాంటి భౌతిక కారకాల ఆధారంగా భూ వినియోగాన్ని నిర్ణయిస్తారు.
* యాజమాన్యం ఆధారంగా భూమిని ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిందిగా వర్గీకరించారు.
* ప్రైవేట్ భూమి వ్యక్తుల యాజమాన్యంలో ఉంటుంది.
* ప్రభుత్వ భూమి ప్రజలందరి ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది.
* ప్రభుత్వ భూములను ‘ఉమ్మడి వనరులు’ అని కూడా అంటారు.
మృత్తికలు - నిర్వచనం
భూమి ఉపరితలంపై కప్పి ఉన్న సన్నటి మట్టి పొరను ‘నేల’ లేదా ‘మృత్తిక’ అంటారు. ఇది సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వల్ల ఏర్పడింది. శిలా శైథిల్యం అనే ప్రక్రియ ద్వారా ఇది జరుగుతుంది.
శిలా శైథిల్యం: వాతావరణంలోని మార్పుల వల్ల; జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్లు బలహీనమై, పగిలి మట్టిగా మారతాయి. దీన్నే శిలా శైథిల్యం అంటారు.
మృత్తికలు ఏర్పడటానికి ప్రధాన కారణాలు
నేలలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు - మాతృశిలల స్వభావం, వాతావరణం. స్థలాకృతి, సేంద్రియ పదార్థాలు, నేల ఏర్పడటానికి పట్టిన సమయం అనేవి ఇతర కారకాలు.
మాతృశిల: మృత్తికలకు రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలు మాతృశిల నుంచి వస్తాయి.
ఉదా: పురాతన స్పటికాకార, రూపాంతర శిలా శైథిల్యం వల్ల ఎర్ర మృత్తికలు ఏర్పడతాయి.
* దక్కన్ నాపరాయి ఉన్న ప్రాంతాల్లో నల్లరేగడి మృత్తికలు ఏర్పడతాయి.
* టెర్షరీ శిలలు ఉన్న చోట పర్వత మృత్తికలు ఏర్పడతాయి.
మృత్తికలను ప్రభావితం చేసే అంశాలు
భౌగోళిక స్వరూపం: భూభాగ భౌతిక స్వరూపం మృత్తికలను అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది. అందులో ఎత్తు, వాలు, లోతు ప్రధానమైనవి.
* వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్రమక్షయం అధికంగా జరుగుతుంది.
* ఎత్తు ఎక్కువగా ఉన్న పశ్చిమ కనుమల ప్రాంతంలో విక్షాళన ప్రక్రియ వల్ల లేటరైట్ మృత్తికలు ఏర్పడ్డాయి.
* లోతుగా ఉన్న ఉత్తర భారతదేశ భూ అభినతితో నిక్షేపణ వల్ల ఒండ్రు మృత్తికలు ఏర్పడ్డాయి.
జీవన సంబంధ కారకాలు: ఇవి మృత్తికల్లో హ్యూమస్ రేటును ప్రభావితం చేస్తాయి.
* హ్యూమస్ వల్ల మృత్తికలు బాగా సారవంతం అవుతాయి. దీనికి అనేక సూక్ష్మజీవులు తోడ్పడతాయి.
శీతోష్ణస్థితి/ వాతావరణం: ఉష్ణోగ్రత, వర్షపాతం శైథిÅల్య రేటుని, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి.
* శైథిల్యంతో పాటు జీవరాశుల మనుగడనూ శీతోష్ణస్థితి ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మృత్తిక రకాలు కూడా ప్రభావితమవుతాయి.
ఉదా: స్పటికాకార గ్రానైట్ శిలలు ఉన్న రాజస్థాన్లో ఇసుక మృత్తికలు ఏర్పడితే, అవే శిలలు ఉన్న కర్ణాటక, కేరళ ప్రాంతాల్లోని ఉష్ణమండల ఆర్థ్ర ప్రాంతాల్లో లేటరైట్ మృత్తికలు ఏర్పడ్డాయి.
* అధిక వర్షపాతం ఉన్న హిమాలయ సానువుల్లో ఉబి నేలలు (పీటీ నేలలు) ఏర్పడ్డాయి.
సమయం/ కాలం: ఒక సెంటీమీటరు మృత్తిక తయారవ్వాలంటే కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుంది.
* నేల/ మృత్తిక పొర మందాన్ని కాలం నిర్ణయిస్తుంది.
* ఒక మీటరు మందం ఉన్న నేల ఏర్పడటానికి సుమారు 5000 - 10000 ఏళ్ల సమయం పడుతుంది.
* లోతైన మృత్తికలు వ్యవసాయానికి అనువుగా ఉంటాయి. ఇవి ఏర్పడేందుకు సుమారు 3000 ఏళ్ల సమయం పడుతుంది.
మృత్తికా క్రమక్షయం
భూమిపై ఉన్న సారవంతమైన మట్టి కొట్టుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. దేశంలో సుమారు 175 మిలియన్ హెక్టార్ల భూమి క్రమక్షయానికి గురువుతున్నట్లు శాస్త్రవేత్తల అంచనా.
* క్రమక్షయం కారణంగా మనదేశంలో సాలీనా 6000 మిలియన్ టన్నుల మృత్తికలను కోల్పోతున్నాం. సరాసరి ప్రతి హెక్టారుకు 16.4 టన్నుల మృత్తికను నష్టపోతున్నాం.
* మృత్తికా క్రమక్షయం వల్ల సుమారు ఏటా 30 నుంచి 50 టన్నుల పంటనష్టం జరుగుతుంది. నదులు, జలాశయాలు ఏటా 1% నుంచి 2% వరకు తమ నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి.
రకాలు:
1. జల క్రమక్షయం: వర్షం, నీటి ప్రవాహం వల్ల మృత్తికలకి నష్టం వాటిల్లడాన్ని జల క్రమక్షయం అంటారు.
ఇది నాలుగు రకాలు అవి:
i) పట క్రమక్షయం
ii) వంక క్రమక్షయం
iii) అవనాళికా క్రమక్షయం
iv) రిపేరియన్ క్రమక్షయం
పట క్రమక్షయం: కుండపోత వర్షం లేదా వరదల కారణంగా విశాల ప్రాంతంలోని భూమి పైపొర కొట్టుకుపోవడాన్ని పట క్రమక్షయం అంటారు. దీనివల్ల సారవంతమైన మృత్తిక కొట్టుకుపోతుంది.
* అధిక వర్షపాత ప్రాంతాలైన శివాలిక్ కొండలు, పశ్చిమ - తూర్పు కనుమలు, అసోం, ద్వీపకల్పంలోని ఈశాన్య ప్రాంతాల్లో పట క్రమక్షయం సర్వసాధారణం.
* దేశంలోని 69 మిలియన్ హెక్టార్ల ఎర్ర మృత్తికలు, నల్లరేగడి నేలల్లో 67 మిలియన్ హెక్టార్లు పట క్రమక్షయానికి గురవుతున్నాయి.
వంక క్రమక్షయం: పట క్రమక్షయం అలాగే కొనసాగితే మృత్తికల్లో చేతివేళ్ల అకారంలో అనేక గాడులు ఏర్పడతాయి. దీన్నే వంక క్రమక్షయం అంటారు.
* బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వంక క్రమక్షయం ఎక్కువగా జరుగుతుంది.
అవనాళికా క్రమక్షయం: వంక క్రమక్షయం తీవ్రస్థాయిలో జరిగి అతిపెద్దవైన, లోతైన గాడులు ఏర్పడటాన్ని అవనాళికా క్రమక్షయం అంటారు.
* చంబల్, సింధూ, యమునా, గంగా, మహి, నర్మదా నదీ పరీవాహక ప్రాంతాల్లో అవనాళికా క్రమక్షయం జరుగుతుంది.
* అవనాళికా క్రమక్షయం వల్ల ఏర్పడిన భూములను కందర భూములు అంటారు. ఇవి ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి.
రిపేరియన్ క్రమక్షయం: గంగా, కోసి లాంటి నదులు గట్లను (నదీపరివాహక ప్రాంతాన్ని) కోస్తూ ప్రవహించడాన్ని రిపేరియన్ క్రమక్షయం అంటారు.
* ఏటా నదుల కారణంగా 53.34 మిలియన్ హెక్టార్ల భూమి క్రమక్షయానికి గురవుతుంది.
2. పవన క్రమక్షయం: అధిక వేగంతో నిరంతరం వీచే గాలుల వల్ల అనార్థ్ర, తీర ప్రాంతాల్లో మృత్తికా క్రమక్షయం జరుగుతుంది.
* వేగంగా వీచే గాలితో పాటు నిస్సార ఇసుక రేణవులు దొర్లుతూ, ఇసుక దిబ్బలుగా ఏర్పడతాయి.
* మనదేశంలో పవన క్రమక్షయం రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో జరుగుతుంది.
* శుష్క పరిస్థితులు; మృత్తికలో తేమ, పచ్చదనం లేకపోవడం వల్ల పవన క్రమక్షయం జరుగుతుంది.
* కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ఏటా సుమారు 18.23 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో పవన క్రమక్షయం జరుగుతుంది.
నియంత్రణ పద్ధతులు: పవన క్రమక్షయం, రవాణా వల్ల పరిసర ప్రాంతాల్లోని ఒండ్రు మృత్తికలు కూడా నష్టపోతున్నాయి. దీన్ని నియంత్రించేందుకు సెంట్రల్ ఆరిడ్ జోన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఏజడ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు కొన్ని ప్రతిపాదనలు చేశారు.
అవి: సరైన చెట్లను, పొదలను, గడ్డి భూములను పెంచడం; కృత్రిమ అవరోధాలను నిర్మించడం మొదలైనవి.
మృత్తికా క్రమక్షయ సంరక్షణ పద్ధతులు
కాంటూర్ బారియర్స్: ఈ పద్ధతిలో భూస్వరూప వాలుకు అనుగుణంగా కట్టలు నిర్మిస్తారు. దీనివల్ల నీటి ప్రవాహ వేగం తగ్గి, క్రమక్షయం తగ్గుతుంది. నీలగిరి కొండల్లో ఆలుగడ్డ సాగు చేస్తున్న ప్రాంతాల్లో ఏటా ఒక హెక్టారుకు 39 అడుగుల చొప్పున క్రమక్షయం అయ్యేది. అక్కడ కాంటూర్ నిర్మాణాలు చేశాక క్రమక్షయం 15 అడుగులకు తగ్గింది.
మల్చింగ్ (గడ్డి కప్పడం): ఈ పద్ధతిలో మొక్కల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో ఎండు గడ్డిని ఉంచుతారు. ఇది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది.
రాక్ డ్యాం: కొండ పైభాగం నుంచి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించేందుకు రాళ్లతో కట్టిన నిర్మాణాన్ని రాక్ డ్యాం అంటారు. ఇది మృత్తికా క్రమక్షయం వల్ల జరిగే నష్టతీవ్రతను తగ్గిస్తుంది.
సోపాన వ్యవసాయం (టెర్రస్ ఫార్మింగ్): ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పుగా, మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోతను తగ్గిస్తుంది.
అంతర పంటలు: ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేర్వేరు వరుసల్లో సాగుచేస్తారు. ఇది నీటి ప్రవాహాల వల్ల నేల కొట్టుకు పోకుండా కాపాడుతుంది.
షెల్టర్ బెల్ట్స్: పొడి వాతావరణం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గాలుల ఉద్ధృతిని తగ్గించి, తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను పొలం గట్లపై వరుసగా పెంచుతారు. ఈ పద్ధతిని షెల్టర్ బెల్ట్స్ అంటారు.
ఇతరాలు:
* ఖాళీగా ఉన్న బంజరు భూముల్లో సామాజిక అడవులను పెంచడం.
* పంట మార్పిడి పద్ధతులను అనుసరించడం లేదా పంట తర్వాత అదే భూమిలో గడ్డిని సాగు చేయడం.
మాదిరి ప్రశ్నలు
1. ప్రపంచ మృత్తికల దినోత్సవం ఎప్పుడు?
1) నవంబరు 5 2) డిసెంబరు 5
3) ఫిబ్రవరి 22 4) ఏప్రిల్ 23
2. భారతదేశ ధాన్యాగారాలుగా ఏ మృత్తికలను పిలుస్తారు?
1) ఒండ్రు మృత్తికలు 2) ఎర్ర మృత్తికలు
3) నల్లరేగడి మృతికలు 4) ఆమ్ల నేలలు
3. శివాలిక్ పర్వత పాదాల వద్ద విసనకర్ర ఆకారంలో నిక్షేపితమైన గుళకరాళ్ల క్షేత్రం ఏది?
1) ఖాదర్ 2) బంగర్
3) చాబర్ 4) టెరాయి
4. చంబల్, సింధూ, యమునా, గంగా, నర్మాదా నదీ పరీవాహక ప్రాంతాల్లో జరిగే మృత్తికా క్రమక్షయం ఏ రకానికి చెందింది?
1) పట క్రమక్షయం
2) అవనాళికా క్రమక్షయం
3) వంక క్రమక్షయం
4) రిపేరియన్ క్రమక్షయం
5. మృత్తికల మందాన్ని ప్రభావితం చేసే కారకం?
1) భౌగోళిక స్వరూపం 2) మాతృశిల
3) సమయం 4) శీతోష్ణస్థితి
సమాధానాలు
1 - 2 2 - 1 3 - 3 4 - 2 5 - 3