ముఖ్యాంశాలు
* నగరంలో వినిపించే ధ్వనులు ఢంకా నాదాన్ని తలపిస్తాయి.
* నగరం అరణ్యం లాంటిది.
* పల్లె ప్రజలు ఉపాధి కోసం నగరానికి వచ్చి మురికి ప్రదేశాల్లో ఊపిరాడని స్థితిలో బతుకుతున్నారు.
* నగరంలో ప్రతి మనిషి చదవాల్సిన పుస్తకం లాంటివాడు. కానీ ఆయన బతుకు పుస్తకంలోని పేజీలను చదివేవారు ఉండరు.
* నగరంలో ఉదయాన్నే పేవ్మెంట్లపై స్కూలు పిల్లలు సందడి చేస్తారు. వారి మాటల్లోంచి చదువుల పుప్పొడి రాలుతుంది.
* నగరంలో భవనాల పక్కనే పూరిపాకలు ఉంటాయి. ఐశ్వర్యం, పేదరికం పక్కపక్కనే సమాంతర రేఖల్లా కనిపిస్తాయి.
* నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉండదు.
* నగరంలోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి.
* నగరంలోని మనుషుల మధ్య ఆత్మీయ పలకరింపులు ఉండవు. ఏకాకిగా బతుకుతారు.
* నగరం అర్థంకాని రసాయనశాల.
* నిరుద్యోగం, జీవన వ్యయం భయపెట్టినా; కాలుష్యం కలవరపెట్టినా, ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా చిక్కుముడి విడదీయలేని పద్మవ్యూహం నగరం.
పబ్లిక్ పరీక్షలో రాదగిన ప్రశ్నలు
1. 'నగరగీతం' సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
2. 'నగరగీతం' పాఠ్యాంశ కవి అలిశెట్టి ప్రభాకర్ గురించి రాయండి.
3. నగర జీవనంలోని అనుకూల అంశాలను రాయండి.
4. నగరం అర్థం కాని రసాయనశాల, పద్మవ్యూహం అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది?
5. 'నగరంలో ప్రతి మనిషీ పఠనీయ గ్రంథమే' అనే వాక్యం నుంచి మీకేం అర్థమైంది?
పరీక్షలో రాదగిన భాషాంశాలు
పదజాలం
నానార్థాలు
ఘోష = ఉరుము, ఆవుల మంద, కంచు
పర్యాయపదాలు
మరణం = మృత్యువు, నిర్యాణం, చావు
అరణ్యం = విపినం, అడవి, అటవి, వనం
వ్యాకరణాంశాలు
అలంకారాన్ని గుర్తించండి.
నగారా మోగిందా
నయాగరా దుమికిందా
అలంకారం: అంత్యానుప్రాస అలంకారం
సమన్వయం: పాదాల చివర పూర్ణబిందువుతో కూడిన 'దా' వచ్చింది.
అలంకారాల గురించి రాయండి.
ముక్తపదగ్రస్త అలంకారం: ఒక పద్య పాదం లేదా వాక్యం ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాతి పాదం/ వాక్యం మొదలైతే దాన్ని ముక్తపదగ్రస్త అలంకారం అంటారు.
లాటానుప్రాస అలంకారం: ఒక వాక్యంలో ఒక పదం అర్థ భేదంతో కాకుండా తాత్పర్య భేదంతో వెంట వెంటనే వస్తే దాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు.
సూక్తి
శాంతితుల్యం తపోన్నాస్తి, నసంతోషాద్వరం సుఖం
నతృష్ణాయాః పరోవ్యాధిః నచధర్మా దయాసమః
భావం: శాంతం లాంటి తపస్సు, సంతోషం కంటే సుఖం, తృష్ణను మించిన వ్యాధి, దయను పోలిన ధర్మం లోకంలో లేవు. - ఆర్య ధర్మం