సామాజిక పరిస్థితులు
* ఫాహియాన్ రచనలు, స్మృతి గ్రంథాలు, కాళిదాసు నాటకాలు - కావ్యాలు, అప్పటి నాణేలు, శిల్పకళ, చిత్రలేఖనం గుప్తుల కాలంనాటి సామాజిక పరిస్థితులను తెలుపుతున్నాయి.
* చైనా యాత్రికుడు ఫాహియాన్ రెండో చంద్రగుప్తుడి ఆస్థానాన్ని సందర్శించి, అప్పటి పరిస్థితులను తన రచనల్లో వివరించాడు. వీటి ప్రకారం ఎక్కువ మంది పట్టణాల్లో నివసించేవారు, ప్రజల్లో అధికులు శాకాహారులు, మద్యం సేవించేవారు కాదు. ధర్మ, వైద్యశాలలు ఉండేవి.
* గుప్తులకాలంలో సమాజంలో వర్ణవ్యవస్థ ఉండేది. కులవ్యవస్థను కఠినంగా అమలు చేశారు. రాజు కులవ్యవస్థకు భంగం కలగకుండా చూసుకునేవాడు.
* కుల వ్యవస్థను కాపాడేందుకు రాష్ట్రస్థాయిలో ‘అభియదత్త’ అనే ఉద్యోగి ఉండేవాడు.
* బ్రాహ్మణులకు సమాజంలో మంచి గౌరవం ఉండేది. వీరు వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారు.
* సమాజంలో వివిధ వృత్తులు ఉండేవి. వైశ్యులు వ్యాపారం చేసేవారు. శూద్రులు అన్ని రకాల పనులను నిర్వర్తించేవారు. అంటరానివారిని హీనంగా చూసేవారు. బానిస వ్యవస్థ, వెట్టిచాకిరి ఉండేవి.
* కుటుంబానికి తండ్రి పెద్దగా వ్యవహరించేవాడు. వివాహ వ్యవస్థ అమల్లో ఉంది.
* యుక్త వయసు కంటే ముందే స్త్రీలకు వివాహం చేసేవారు. బహుభార్యత్వం, సతీసహగమనం ఉండేవి. క్రీ.శ. 510 నాటి ‘ఎరాన్’ శాసనంలో ఈ విషయాలు ఉన్నాయి.
* దేవదాసీలు, నర్తకీమణులకు సంఘంలో మంచి ఆదరణ ఉండేది. ఉన్నత కులాల్లోని స్త్రీలకు మాత్రమే విద్యావకాశాలుండేవి.
* ఉజ్జయినిలోని మహంకాళీ ఆలయంలో దేవదాసీలు ఉన్నట్లు కాళిదాసు రచనల ద్వారా తెలుస్తోంది.
* ఆస్తిహక్కు వంశపారంపర్యంగా ఉండేది. ప్రజలు కర్మసిద్ధాంతాన్ని పాటించేవారు. బ్రాహ్మణులకు వేదాలు, మంత్రాల్లో ప్రవేశం ఉంది. వీరికి అగ్రహారాలుండేవి. భూములు, గోవులను దానంగా స్వీకరించేవారు.
* ‘‘ప్రజలు నీతిమంతులు, అహింసా విధానం పాటించేవారు, దొంగతనాలులేవని’’ ఫాహియాన్ తన రచనల్లో రాశాడు.
* చదరంగం, వేట, కోడి - పొట్టేళ్ల పందేలు, పాచికలాట, సంగీతం, నృత్యం ప్రధాన వినోదాలు.
* సమాజంలో శైవ, వైష్ణవ శాఖలుండేవి. ప్రజలు విష్ణువు, శివుడు, కార్తికేయుడు, గణపతి, లక్ష్మీ, పార్వతి, దుర్గ, భవానీ మొదలైనవారిని పూజించేవారు.
ఆర్థిక పరిస్థితులు
* గుప్తులకాలం నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రజలు పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందారు.
* గుప్త రాజులు నదులకు ఆనకట్టలు కట్టి, చెరువులు తవ్వించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. బంజరు భూములకు సాగునీరు అందించారు.
* మౌర్యుల కాలంలో సౌరాష్ట్రలోని గిర్నార్ దగ్గర నిర్మించిన సుదర్శన తటాకాన్ని స్కందగుప్తుడు మరింత అభివృద్ధి చేశాడు.
* బావులు, చెరువుల నుంచి ‘పారశీక నీటి చక్రం’ (Persian Wheel) ద్వారా నీటిని పొలాలకు మళ్లించేవారు.
* ప్రజలు ఎక్కువగా దానధర్మాలు చేసేవారని ఫాహియాన్ పేర్కొన్నాడు.
* బ్రాహ్మణులకు, ప్రభుత్వ ఉద్యోగులకు భూములను విరివిగా దానం చేసేవారు. ఇది భూస్వామ్య వ్యవస్థకు కారణమైంది. భూస్వాములు ప్రజలపై అధికారం చెలాయించేవారు.
* వరి, గోధుమ, అల్లం, కూరగాయ పంటలు పండించేవారు.
* నూలు, పట్టువస్త్రాల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. వీటిని విదేశాలకు ఎగుమతి చేసేవారు. రాగి, ఇనుము, కంచు మొదలైన లోహాలతో వివిధ రకాలైన పరికరాలను తయారుచేసేవారు.
* రెండో చంద్రగుప్తుడు ఢిల్లీ సమీపంలోని ‘మెహరౌలి’ వద్ద ఇనుప స్తూపాన్ని నిర్మించాడు. ఇది నేటికీ తుప్పు పట్టలేదు. ఇది ఆనాటి శాస్త్ర సాంకేతికతకి నిదర్శనం.
* వృత్తి పనివారు సంఘాలు (శ్రేణులు)గా ఏర్పడి, అనేక కుటీర పరిశ్రమలను స్థాపించారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు శిక్షణా కేంద్రాలు ఉండేవి. ఈ సంఘాలు ఆ కాలంలో బ్యాంకులుగా పనిచేశాయి. వీటిని ‘నిగమాలు’ అనేవారు. కొన్ని నిగమాలు కలసి ఒక బృహత్ సంఘంగా ఏర్పడ్డాయి. శ్రేణులు తమ లాభాల్లో కొంత భాగాన్ని ప్రజోపయోగ కార్యకలాపాలకు వెచ్చించేవారు. శ్రేణి పెద్దను శ్రేష్ఠి అనేవారు.
*ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. రైతులు తమ పంటలో 1/6 వంతు భాగాన్ని భూమిశిస్తుగా చెలించేవారు. ఇవి ధన, ధాన్యరూపంలో ఉండేవి.
* ఎగుమతి, దిగుమతి సుంకాలు, వర్తక సుంకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించేది.
* అడవులు, గనులు, నాణేల ముద్రణ ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది.
* ‘‘ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఆదాయం సమకూరేది. దీన్ని రాజు పరిమితంగా ఖర్చు చేసేవాడు. ఇదే గుప్తుల అభివృద్ధి సాధనకు కారణం’’ అని కామందకుడు తన ‘నీతిసారం’లో పేర్కొన్నాడు.
వర్తక-వాణిజ్యం
* గుప్తులకాలంలో స్వదేశీ, విదేశీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. వీరు ‘రోమ్’ దేశంతో ఎక్కువగా వ్యాపార సంబంధాలు సాగించారు. ముఖ్యంగా సిల్కు, సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసేవారు.
* గంగా, యమున, నర్మదా నదుల ద్వారా నౌకాయానం బాగా అభివృద్ధి చెందింది.
* ఆగ్నేయాసియా దేశాలతో ‘తామ్రలిప్తి’ (బెంగాల్) ఓడరేవు ద్వారా వ్యాపారం జరిగింది.
* చేతివృత్తులు, వృత్తిసంఘాలు పట్టణ కేంద్రాల్లో ముఖ్యపాత్ర వహించాయి.
* పశ్చిమాన ‘బరుకచ్చ’, తూర్పున ‘తామ్రలిప్తి’ ఓడరేవులు వర్తకంలో ప్రధానపాత్ర పోషించాయి.
* రత్నాలు, సుగంధ ద్రవ్యాలు, నీలిమందు, ఔషధాలు, దంతపు వస్తువులు ఎగుమతి చేసేవారు. బంగారం, వెండి, రాగి, మేలుజాతి అశ్వాలను దిగుమతి చేసుకునేవారు.
* దేశంలోని పెద్ద నగరాలన్నింటినీ రహదారులతో అనుసంధానం చేశారు. ఇది వాణిజ్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది.
* బౌద్ధారామాలు, సంఘాలు వ్యాపారులకు ఆవాసాలుగా ఉండేవి.
* ఉజ్జయిని, కాశీ, ప్రయాగ, మధుర, వైశాలి, గయ అప్పటి ప్రముఖ వర్తక కేంద్రాలు.
* బౌద్ధ సంఘాల పెద్దలు వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వీరు వర్తకులకు వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. అప్పుపై వడ్డీ సంవత్సరానికి 20% ఉండేది.
* గుప్తులు భారతదేశంలో అధిక సంఖ్యలో బంగారు నాణేలు చలామణిలోకి తెచ్చారు. బంగారం, రాగి, వెండి, నాణేలు ముద్రించారు. ఇవి మారకంగా ఉపయోగపడ్డాయి.
* గుప్తులకాలం నాటి బంగారు నాణేలను ‘రూపక’ అంటారు. పశ్చిమ ప్రాంతంలో వెండి నాణేలు, తూర్పు ప్రాంతంలో బంగారు నాణేలు లభించాయి.
* ఒక బంగారు నాణెం విలువ 15 వెండి నాణేలకు సమానం. ఫాహియాన్ ప్రకారం ‘కౌరీలు’ (గవ్వలు) కూడా మారకపు ద్రవ్యంగా ఉండేవి.
మతపరిస్థితులు
* గుప్తుల కాలంలో బౌద్ధమతం క్షీణదశకు చేరుకుని, బ్రాహ్మణ మతం ఆధిక్యం పొందింది. ఇది హిందూమత పునరుద్ధరణకు కారణమైంది.
* భక్తిమార్గానికి గుప్తుల కాలంలో ప్రాధాన్యం పెరిగింది. విగ్రహారాధనకు ప్రాధాన్యం ఉండేది. భాగవత మతం విస్తృత ప్రచారం పొందింది.
* రాజులు, ప్రజలు యజ్ఞయాగాదులు నిర్వహించారు. సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు అశ్వమేధయాగాలు చేశారు.
* విష్ణుమూర్తి దశావతారాలు, రామాయణ, మహాభారతాలు ప్రాధాన్యం పొందాయి. భగవద్గీత హిందువులకు పవిత్ర గ్రంథం అయ్యింది.
* గుప్తులు అనేక దేవాలయాలను నిర్మించారు. పురాణ పఠనం, పుణ్యక్షేత్రాల దర్శనం, దానధర్మాలు చేయడం లాంటివాటిని పుణ్యకార్యాలుగా భావించారు.
* రాజులే కాదు, సామాన్యులు కూడా ధనం సేకరించి దేవాలయాలు నిర్మించారు.
* విదేశీయులు కూడా వైష్ణవ మతాన్ని స్వీకరించారు. శకులు, యవనులు, కుషాణులు వీరిలో ముఖ్యులు.
* గుప్తులకాలంలో బుద్ధుడ్ని దశావతారాల్లో ఒకడిగా భావించారు. దీంతో బౌద్ధమతం ఆదరణ కోల్పోయింది.
శైవ-పాశుపతం
* గుప్తులకాలంలో ప్రజలు శైవమతాన్నీ ఎక్కువగా ఆచరించారు. ఈ మతంలోని పాశుపతశాఖ ఎక్కువ ప్రజాదరణ పొందింది.
* క్రీ.శ.38081 నాటి మధుర శాసనంలో ‘లకులీస పాశుపతం’ గురించి ఉంది.
* మొదటి కుమారగుప్తుడి శాసనంలో అయోగ్య బ్రాహ్మణులు క్రతువులు, మతసాహిత్యంలో నిష్ణాతులు అని ఉంది. ఈ శాసనం ఉత్తర్ ప్రదేశ్లోని కరీమదండలో లభించింది.
* ఆ కాలంలో సూర్యుడ్ని కూడా ఎక్కువ మంది ఆరాధించేవారు. వారి మత గురువులను ‘మాఘలు’ అనేవారు.
షడ్దర్శనాలు
* భారత తత్వశాస్త్ర ముఖ్య లక్షణాలుగా షడ్దర్శనాలను పేర్కొంటారు. అవి: న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత. ఇవి గుప్తుల కాలంలో ఉండేవి.
* పురాణాలు, ధర్మశాస్త్రాలు రాయడంలో, సాంఘిక చట్టాలను పవిత్రంగా చేయడంలో ఇవి సహకరించాయి.
* గుప్తుల కాలంలోనే హిందూ మత పునరుద్ధరణ జరిగింది. యజ్ఞాలు, కర్మకాండల నిర్వహణ ఎక్కువైంది.
* దేవతలకు రూపాలిచ్చి విగ్రహాలను ప్రతిష్ఠించడం ఈ కాలంలోనే ప్రారంభమైంది.
బౌద్ధ - జైన మతం
* గుప్త పాలకులు వైదికమతాన్ని ఆచరించినప్పటికీ జైన, బౌద్ధ మతాల పట్ల సహనభావం ప్రదర్శించారు.
* హిందువులు, బౌద్ధులు పరస్పర మైత్రితో జీవించారని ఫాహియాన్ తన రచనల్లో పేర్కొన్నాడు.
* గుప్త పాలకులు బౌద్ధులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదరించారు. ఉదాహరణకు సముద్రగుప్తుడు వసుబంధుడ్ని (అభిధర్మకోశ గ్రంథకర్త, విజ్ఞానవాద స్థాపకుడు) ఆదరించగా, రెండో చంద్రగుప్తుడు తన సేనానిగా అమరకదేవుడ్ని నియమించాడు.
* కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇది క్రీ.శ. 5వ శతాబ్దిలో బౌద్ధ అధ్యయన కేంద్రంగా ఆవిర్భవించింది. వల్లభి విశ్వవిద్యాలయం కూడా ఈ కోవకు చెందిందే.
* నలంద, సారనాథ్, మధుర, పాటలీపుత్రం మొదలైన ప్రాంతాల్లో గుప్తులకాలంలో కొన్ని జైన, బౌద్ధ విగ్రహాలను ప్రతిష్ఠించారు.
* కపిలవస్తు, కుశినగరం, గయలో బౌద్ధమతం క్షీణదశలో ఉన్నట్లు ఫాహియాన్ రాశాడు.
* క్రీ.శ.453లో వల్లభిలో జైనమత పెద్దలు సమావేశమై జైన గ్రంథాలను క్రోడీకరించారు. మధుర, వల్లభి శ్వేతాంబర శాఖకు కేంద్రంగా ఉండేవి.
భాగవత తత్వం
* మౌర్యుల తర్వాతి కాలంలో భాగవత మతం ఆవిర్భవించింది. వీరికి విష్ణువు ప్రధాన ఆరాధ్య దైవం. ఇతడి రూపాలే నారాయణుడు, వాసుదేవుడు. తర్వాతి కాలంలో ఈ ముగ్గురూ కలసి భాగవత మత తత్వం ఆవిర్భవించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.
* భక్తి, అహింస ఈ మతంలో ప్రధాన అంశాలు.
* భగవద్గీత, విష్ణుపురాణం, విష్ణుస్మృతి భాగవత తత్వాన్ని చర్చించాయి.
* సామాజిక వ్వవస్థకు హాని జరిగితే విష్ణువు తగిన రూపంలో అవతరించి, ధర్మాన్ని రక్షిస్తాడని సామాన్య ప్రజలు నమ్మారు.
*క్రీ.శ.6 వ శతాబ్ది నాటికి విష్ణువును త్రిమూర్తుల్లో ఒకరుగా ఆరాధించారు.
* ఈ శాఖలోనూ విగ్రహారాధన, దేవాలయ నిర్మాణం, భక్తిభావం, పండుగలు జరుపుకోవడం లాంటివి ఉండేవి.
* భాగవతం వల్ల మహాయాన బౌద్ధమత శాఖకు ఆదరణ తగ్గింది.