• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - శీతోష్ణస్థితి

ఇక్కడ తొలకరి... అక్కడ ఏరువాక!

ఎండ కాస్తుంది. వర్షం కురుస్తుంది. చలి పుడుతుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఒక ప్రాంతం వర్షాలతో సస్యశ్యామలంగా ఉంటే మరో చోట కరవు తాండవిస్తుంది. అనేక రకాల అంశాలతో ప్రభావితమయ్యే ఈ శీతోష్ణస్థితి పరిస్థితుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

  భారతదేశం సువిశాలమైన భూభాగంతో వైవిధ్య శీతోష్ణస్థితులను కలిగి ఉంది. దాని వల్ల వ్యవసాయంతో పాటు మానవ నివాసాలు, వస్త్రాలంకరణ, ఆహార నియమాలు, రవాణా సౌకర్యాలు, పరిశ్రమల్లాంటివి ప్రభావితమవుతున్నాయి. ఒక ప్రాంతంలో అనుకూలంగా ఉండే శీతోష్ణస్థితిని ఆ ప్రాంత వనరుగా చెప్పవచ్చు.

  భారతదేశం ఉత్తరార్ధగోళంలో భూమధ్యరేఖకు దగ్గరగా ఉంది. కర్కటరేఖ దేశం మధ్యగా వెళుతోంది. ఈ కారణాల వల్ల దేశంలో దక్షిణ సగభాగం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంది. ఉత్తర సగభాగం సమశీతోష్ణ ప్రాంతంగా ఉంది. ఉత్తరాన ఉన్న హిమాలయాలు, దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రం  దేశంలోని వివిధ ప్రాంతాల ఉష్ణోగ్రత, వర్షపాతాలను ప్రభావితం చేస్తున్నాయి. దేశ ఉత్తరభాగం ఖండాతర్గతంగా ఉండటం వల్ల శీతాకాలంలో ఎక్కువ చలిగా, వేసవిలో అధిక వేడిగా ఉంటుంది. దీనికి భిన్నంగా ద్వీపకల్ప, తీరప్రాంతాల్లో సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. వేసవి, శీతాకాల ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం తక్కువగా నమోదవుతుంది. దీనికి కారణం ద్వీపకల్ప ప్రాంతం చుట్టూ సముద్రం ఆవరించి ఉండటమే. ఉత్తరాన ఉన్న హిమాలయాలు సైబీరియా నుంచి వీచే అతి శీతల గాలులను అడ్డుకోవడంతోపాటు నైరుతి రుతుపవనాలను దారిమళ్లించి ఉత్తర భారత మైదాన ప్రాంతాల్లో వర్షాలను కురిపిస్తున్నాయి. ఒక ప్రదేశం ఎత్తు పెరిగే కొద్దీ పీడనం, ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఉనికి, భూ జల విస్తరణ, సముద్రతీరం నుంచి ఉండే దూరం, హిమాలయ పర్వతాలు,  ప్రదేశం ఎత్తు, పవనాలు లాంటి అంశాల ఆధారంగా శీతోష్ణస్థితి ఉంటుంది. ఇవేకాకుండా ఎల్‌నినో, లానినో, దక్షిణ డోలనం, జెట్‌ స్ట్రీమ్స్‌ కూడా ప్రభావితం చేస్తాయి. 

  వేసవిలో భారత వాయవ్య ప్రాంతంలో అధిక వేడి వల్ల అల్ప పీడనం ఏర్పడుతుంది. ఇదే సమయంలో పసిఫిక్‌ మహాసముద్రం, ఆస్ట్రేలియాలోనూ అధిక పీడనం ఉంటుంది. దీంతో పవనాలు దక్షిణార్ధ గోళం నుంచి భూమధ్యరేఖను దాటి కుడిపక్కకు వంగి నైరుతి రుతుపవనాలుగా మారతాయి. రుతుపవనం (మాన్‌సూన్‌) అనే పదం మౌసిన్‌ అనే అరబిక్‌ పదం నుంచి వచ్చింది.    

  భారతదేశంలో రుతుపవనాల ప్రభావం ఎక్కువ. వ్యవసాయం, విద్యుత్తు ఉత్పత్తికి ఇవి ప్రధాన వనరులు. నైరుతి రుతపవనాలు జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు వీస్తాయి. వీటిని వేసవి వర్షాలు అంటారు. దేశ వార్షిక వర్షపాతంలో వీటి వాటా అధికం. ఈశాన్య రుతుపవనాలు అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వీస్తాయి. ఇవి శీతాకాలం వర్షాలు. 

  ఉష్ణోగత్ర, వర్షపాతాలను అనుసరించి సాధారణంగా భారతదేశంలో మూడు రుతువులు సంభవిస్తాయి.1) వేసవికాలం (మార్చి నుంచి జూన్‌), 2) వర్షాకాలం (జూన్‌ నుంచి అక్టోబరు), 3) శీతాకాలం (నవంబరు నుంచి ఫిబ్రవరి). 

 

భారత వాతావరణ శాఖ రుతుపవనాలు, ఉష్ణోగ్రతల ఆధారంగా రుతువులను నాలుగు రకాలుగా విభజించింది. 

* శీతాకాలం - డిసెంబరు నుంచి ఫిబ్రవరి 

* వేసవికాలం - మార్చి నుంచి మే  

* నైరుతి రుతుపవన కాలం - జూన్‌ నుంచి సెప్టెంబరు

* ఈశాన్య రుతుపవన కాలం - అక్టోబరు, నవంబరు

 

శీతాకాలం 

  నవంబరు రెండోవారంలో మొదలై డిసెంబరు, జనవరి నాటికి చలి తీవ్రత పెరుగుతుంది. ఉత్తర భారతదేశంలో జనవరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. శీతాకాలంలో ఉత్తర భారతంలో కురిసే సాధారణ హిమపాతాన్ని మహవత్‌ అంటారు. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో పర్షియన్‌ దేశాల నుంచి వచ్చిన పశ్చిమ అలజడుల వల్ల వర్షం కురుస్తుంది. ఈ వర్షం అక్కడ రబీ పంటలకు అనుకూలంగా ఉంటుంది. భారత్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ద్రాస్‌ (కార్గిల్‌) సెక్టార్‌ ప్రాంతం (-45oC)

 

వేసవికాలం

  వేసవిలో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనికి కారణం సూర్యుడు భూమధ్యరేఖ నుంచి కర్కటరేఖ వైపు పయనిస్తూ కిరణాలను భూమిపై నిటారుగా ప్రసరించడమే. ఈ కాలంలో దేశ వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వీచే గాలులు సంవహనం చెంది దేశంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయి. అవే సంవహన వర్షపాతాలు. వీటినే తెలంగాణలో తొలకరి జల్లులు, ఆంధ్రప్రదేశ్‌లో ఏరువాక జల్లులు అని అంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో మ్యాంగో షవర్స్‌ లేదా ముంగూరు వర్షాలుగా పేర్కొంటారు. వేసవి కాలంలో దేశ వాయవ్య ప్రాంతంలో అత్యంత వేగంగా వీచే వేడి, పొడి గాలులను ‘లూ’ అని పిలుస్తారు. వేసవిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఉన్న గంగానగర్‌లో జూన్‌లో 50oC వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. 2016లో రాజస్థాన్‌లోని పలోడి ప్రాంతంలో అత్యధికంగా 51oC ఉష్ణోగ్రత నమోదైంది. 

 

నైరుతి రుతుపవన కాలం

  భారతదేశంలో పంటలకు ఇవి ముఖ్యమైన రుతుపవనాలు. జూన్‌ మొదటి వారంలో ప్రారంభమై జులై రెండో వారానికల్లా దేశమంతటా విస్తరిస్తాయి. దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 80 శాతం వీటి వల్లే కురుస్తుంది. ఇవి మొదటగా అండమాన్‌ నికోబార్‌ దీవులు, కేరళ రాష్ట్రాన్ని తాకుతాయి. నైరుతి రుతుపవన కాలంలో పర్వతీయ వర్షపాతం ఎక్కువ. పర్వతాల పశ్చిమ భాగంలో అధికంగా కురిస్తే, తూర్పు భాగంలో తక్కువగా కురుస్తుంది. ఈ తక్కువ వర్షం కురిసే ప్రాంతాన్ని వర్షచ్ఛాయ ప్రాంతం అంటారు.  దేశంలో అత్యధిక వర్షపాతం మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్‌రామ్‌ (1187 సెం.మీ.), చిరపుంజి (1141 సెం.మీ.)లలో నమోదవుతుంది

 

ఈశాన్య రుతుపవనాలు

  వీటినే తిరోగమన రుతుపవనాలు అంటారు. భారత్‌లో గంగా మైదానంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి అక్టోబరు రెండోవారం నాటికి బంగాళాఖాతం వరకు వెళుతుంది. దీని ప్రభావానికిలోనై దేశ ఈశాన్య దిశ నుంచి ద్వీపకల్పం వైపు రుతుపవనాలు తిరోగమిస్తాయి. ఈ పవనాలు బలహీనంగా ఉండి కొద్దిపాటి వర్షాన్ని ఇస్తాయి. అక్టోబరులో దక్షిణ భారతదేశంలో ఏర్పడే అక్టోబరు హీట్‌ వల్ల అల్పపీడనం ఏర్పడి తుపానులు వస్తాయి. దేశం మొత్తం వర్షపాతంలో ఈశాన్య రుతుపవనాల వల్ల సుమారు 10 - 13 శాతం వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా తమిళనాడులోని కోరమాండల్‌ తీరంలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. కర్ణాటక, కేరళ, దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుంది. ఇవి అక్టోబరులో ప్రారంభమై డిసెంబరు చివరినాటికి దేశమంతటా విస్తరిస్తాయి. 

  భారతదేశ సగటు వర్షపాతం 118.7 సెం.మీ. సగటున వర్షం కురిసే రోజులు 40 నుంచి 45. ఈశాన్య రాష్ట్రాల్లో 180 రోజులు కురిస్తే, పశ్చిమాన రాజస్థాన్‌ ప్రాంతంలో 20 రోజులు మాత్రమే వర్షం పడతుంది. ప్రపంచ వర్షపాతంలో సుమారు 4% మన దేశంలో కురుస్తుంది. దేశంలో రుతువుల వారీగా పరిశీలిస్తే నైరుతి రుతుపవనాల వల్ల 75 - 80%, ఈశాన్య రుతుపవనాల వల్ల  10 - 13%, వేసవిలో 8 - 10%, శీతాకాలంలో 2 - 3% వర్షపాతం నమోదవుతుంది. అత్యధిక వర్షపాతం జులై, ఆగస్టుల్లో, అత్యల్ప వర్షపాతం డిసెంబరు, జనవరిల్లో ఉంటుంది.

  వర్షపాతాన్ని బట్టి ప్రాంతాలను నాలుగు రకాలుగా విభజించవచ్చు. 200 సెం.మీ. కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలను అధిక వర్షపాత ప్రాంతాలు, 100 - 200 సెం.మీ. వర్షం పడే ప్రాంతాలను సాధారణ వర్షపాత ప్రాంతాలు, 50 - 100 సెం.మీ. వర్షం పడే ప్రాంతాలను తక్కువ వర్షపాత ప్రాంతాలు, 50 సెం.మీ. కంటే తక్కువ వర్షం నమోదయినట్లయితే అత్యల్ప వర్షపాత ప్రాంతాలని అంటారు.

ఎల్‌నినో: దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా వేడెక్కడాన్ని ఎల్‌నినో అంటారు. దీన్ని మొదటిసారి పెరూ మత్స్యకారులు గుర్తించారు. ఎల్‌నినో అంటే చిన్నబాలుడు (ది క్రిస్ట్‌ చైల్డ్‌) అని అర్థం. ఈ ఎల్‌నినో ప్రతి 3 - 7 ఏళ్ల కాలంలో సంభవించవచ్చు. దీనివల్ల భారత్‌తోపాటు ఆగ్నేయాసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ దెబ్బతిని, వర్షాలు సరిగా పడవు. దాంతో కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

లానినో: పెరూ శీతల ప్రవాహం బలంగా ఉన్నప్పుడు భూమధ్యరేఖ వరకు ప్రయాణించి పసిఫిక్‌ మహాసముద్ర ఉష్ణోగ్రతలను తగ్గించడాన్ని లానినోగా వ్యవహరిస్తారు. లానినో అంటే చిన్న బాలిక (ది క్రిస్ట్‌ గాళ్‌) అని అర్థం. దీని వల్ల భారత్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.

దక్షిణ డోలనం: హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల మధ్య పీడన వ్యవస్థలో ఏర్పడే పరస్పర వ్యతిరేకతనే దక్షిణ డోలనం/టెలీ లింక్స్‌ అంటారు. 

జెట్‌ స్ట్రీమ్స్‌: వాతావరణంలోని ఎగువస్థాయిలో బలమైన గాలులు పడమర నుంచి తూర్పు దిశగా వీయడాన్ని జెట్‌ స్ట్రీమ్స్‌ అంటారు. ఇవి భూమి చుట్టూ ఏర్పడతాయి.

 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  భారతదేశం - వ్యవసాయం

‣ భారతదేశం - పరిశ్రమలు

 భారతదేశం - ఉనికి

 

‣ ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 21-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌