• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ భౌగోళికాంశాలు

అంతటా వైవిధ్యం... అందుకే ఉపఖండం!

భారతదేశం వైవిధ్య భౌగోళికాంశాల సమాహారం. ఇక్కడ శీతోష్ణస్థితులు రకరకాలు. వర్షపాతాలు వేర్వేరు. పర్వతాలు, పీఠభూములు, లోయలూ పలువిధాలు. అందుకే  ఇదో ఉపఖండం. ఇండియన్‌ జాగ్రఫీని చదివే అభ్యర్థులు ముందుగా ఈ భౌగోళిక ప్రత్యేకతలపై అవగాహన ఏర్పరచుకుంటే మిగతా అంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. 

  భారతదేశం విశాలమైన భూభాగాన్ని కలిగి ఉంది. ఒక ఖండానికి ఉండే భిన్న శీతోష్ణస్థితులు, వివిధ రకాల వర్షపాతాలు, జలవనరులు, భౌగోళిక వైవిధ్యాలైన పర్వతాలు, లోయలు, పీఠభూములు ఉన్నాయి. అందకే మన దేశాన్ని ఉపఖండం అంటారు. భారతదేశం భూమికి ఉత్తరార్ధ గోళంలో 8o4' నుంచి 37o6' ఉత్తర అక్షాంశాలు, 68o7' నుంచి 97o25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం ఉత్తర కొన నుంచి దక్షిణ కొన వరకు 3214 కి.మీ., తూర్పు చివరి భాగం నుంచి పడమర చివరి భాగం వరకు 2933 కి.మీ. ఉంది. కర్కటరేఖ (ట్రాపిక్‌ ఆఫ్‌ కాన్సర్‌) మన దేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజిస్తూ దేశం మధ్య నుంచి ఎనిమిది రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తోంది. పశ్చిమ చివరి నుంచి తూర్పు చివరి ప్రదేశం మధ్య కాల వ్యత్యాసం రెండు గంటలు. దేశం మధ్య నుంచి 82 1/2o తూర్పు రేఖాంశం అలహాబాద్‌ సమీపంలోని మీర్జాపూర్‌ దగ్గరగా వెళుతోంది. గ్రీన్‌విచ్‌ కాలమానం కంటే భారత స్టాండర్డ్‌ టైమ్‌ 5 1/2 గంటలు ముందు ఉంటుంది.

  విస్తీర్ణ పరంగా 32,87,283 చ.కి.మీ. వైశాల్యంతో భారత్‌ ప్రపంచంలో ఏడో పెద్ద దేశంగా ఉంది. ఇది ప్రపంచ మొత్తం వైశాల్యంలో 2.4%. ఇందులో భూభాగం 29,73,193 చ.కి.మీ. కాగా జలభాగం 3,14,070 చ.కి.మీ. సముద్ర తీర పొడవు 7516 కి.మీ. దేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. భారతదేశంతో ఏడు దేశాలు భూసరిహద్దును కలిగి ఉన్నాయి. అవి పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌. హిమాలయ పర్వతాలు భారతదేశాన్ని ఆసియా ఖండం నుంచి వేరుచేస్తున్నాయి. 

  2000 నవంబరులో దేశంలో కొత్తగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌ నుంచి చత్తీస్‌గఢ్‌ (నవంబరు 1న), ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ (నవంబరు 9న), బిహార్‌ నుంచి ఝార్ఖండ్‌ను (నవంబరు 15న) ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించారు. 2014 జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా (29వ రాష్ట్రం) ఏర్పాటైంది. 2019 అక్టోబరు 31న జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించి జమ్మూ కశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్‌ - డయ్యూ, దాద్రానగర్‌ హవేలీలను విలీనం చేసి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి (పాండిచ్చేరి). ప్రధాన పుదుచ్చేరి, కారైకల్‌ తమిళనాడులో, యానాం ఆంధ్రప్రదేశ్‌లో, మహే కేరళలో ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 

 

భారతదేశానికి పొరుగు దేశాలతో సరిహద్దు

దేశం సరిహద్దు పొడవు శాతం
బంగ్లాదేశ్‌ 4096 కి.మీ. 26.95%
చైనా 3917 కి.మీ. 25.77%
పాకిస్థాన్‌ 3310 కి.మీ. 21.78%
నేపాల్‌ 1752 కి.మీ. 11.53%
మయన్మార్‌ 1458 కి.మీ. 9.59%
భూటాన్‌ 587 కి.మీ. 3.86%
అఫ్గానిస్థాన్‌ 80 కి.మీ. 0.52%

  దేశంలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్‌ కాగా అతిచిన్న రాష్ట్రం గోవా. అతిపెద్ద మహానగరం దిల్లీ. భారత్‌తో ఎక్కువ భూభాగ సరిహద్దు గల దేశం బంగ్లాదేశ్‌ (26.95%), తక్కువ భూభాగ సరిహద్దు గల దేశం అఫ్గానిస్థాన్‌ (0.52%). నేపాల్‌తో ఎక్కువ సరిహద్దు గల రాష్ట్రం బిహార్‌. పాకిస్థాన్‌తో ఎక్కువ సరిహద్దు ఉన్న రాష్ట్రం రాజస్థాన్‌. చైనాతో ఎక్కువ సరిహద్దు ఉన్న ప్రాంతం లద్దాఖ్‌ (ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం). భారతదేశంలో ఉన్న మొత్తం దీవుల సంఖ్య 247. వీటిలో 204 బంగాళాఖాతంలో, 43 అరేబియా సముద్రం, మన్నార్‌ సింధుశాఖలో ఉన్నాయి.

 

సరిహద్దు రేఖలు

ఎల్‌ఓసీ రేఖ: భారత్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ల మధ్య ఉన్న రేఖ.

ఎల్‌ఏసీ/ఎల్‌ఓఏసీ రేఖ: జమ్మూ-కశ్మీర్‌ (ప్రస్తుత లడఖ్‌)లోని ఆక్సాయ్‌ చిన్‌ - చైనా మధ్య గల వాస్తవాధీన రేఖ.

ఏజీపీఎల్‌ రేఖ: భారత్‌లోని పెద్ద హిమానీనదం సియాచిన్, పాకిస్థాన్‌ మధ్య ఉన్న వాస్తవ మోహరింపు రేఖ.

రాడ్‌క్లిఫ్‌ రేఖ: భారత్‌ - పాకిస్థాన్, భారత్‌ - బంగ్లాదేశ్‌లను వేరు చేస్తుంది.

సర్‌క్రిక్‌ రేఖ: గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతంలో పాకిస్థాన్‌ గుర్తించిన సరిహద్దు రేఖ. ఇది 24o సమాంతర రేఖ.

డ్యూరాండ్‌ రేఖ: భారత్‌ - అఫ్గానిస్థాన్‌ మధ్య ఉన్న రేఖ (బిట్రిష్‌ కాలం నాటి ఒప్పంద రేఖ).

  భారతదేశ దక్షిణ చివర ఉన్న ఇందిరా పాయింట్‌ గ్రేట్‌ నికోబార్‌ ద్వీపంలో ఉంది. భారతదేశ చురుకైన అగ్నిపర్వత ప్రాంతం మధ్య అండమాన్‌లో ఉన్న బారెన్‌ ద్వీపం. ఉత్తర అండమాన్‌లో ఉన్న అగ్నిపర్వత ద్వీపం నార్కొండం. అండమాన్, నికోబార్‌ దీవులను 10ా అక్షాంశం (10 డిగ్రీల ఛానల్‌) వేరుచేస్తుంది. దక్షిణ అండమాన్, లిటిల్‌ అండమాన్‌లను డంకన్‌ పాప్‌ వేరుచేస్తుంది. గ్రేట్‌ నికోబార్, సుమత్రా (ఇండోనేషియా) దీవులను గ్రాండ్‌ ఛానల్‌ వేరుచేస్తుంది. అండమాన్, నికోబార్‌ దీవులను పచ్చదీవులు అంటారు. మినికాయ్, మాల్దీవులను 8ా ఉత్తర అక్షాంశం (8ా డిగ్రీల ఛానల్‌) వేరుచేస్తుంది. భారత్‌ - శ్రీలంకను పాక్‌ జలసంధి వేరుచేస్తుంది. 

 

మాదిరి ప్రశ్నలు

 

1. కిందివాటిలో భూపరివేష్టిత రాష్ట్రం?

1) కేరళ             2) తమిళనాడు           3) గుజరాత్‌        4) తెలంగాణ

 

2. దేశంలో సముద్రతీర రేఖ అధికంగా ఉన్న రెండో రాష్ట్రం? (మొదటిది గుజరాత్‌)

1) తమిళనాడు            2) కేరళ                3) పశ్చిమ్‌ బంగా              4) ఆంధ్రప్రదేశ్‌

 

3. భారత్‌లో మొదట సూర్యుడు ఉదయించే రాష్ట్రం?

1) ఆంధ్రప్రదేశ్‌             2) అరుణాచల్‌ ప్రదేశ్‌               3) తమిళనాడు           4) ఒడిశా

 

4. దేశంలో సముద్ర తీరాన్ని కలిగిన రాష్ట్రాలు?

1) 5              2) 7             3) 9             4) 15

 

5. భారత కాలమానానికి గ్రీన్‌విచ్‌ సమయానికి మధ్య గల తేడా?

1) 3 గంటలు          2) 5 గంటలు               3) 5 1/2 గంటలు         4) 6 1/2 గంటలు

 

6. విస్తీర్ణ పరంగా భారత్‌ ప్రపంచంలో ఎన్నోస్థానంలో ఉంది?

1) 2              2) 5              3) 6            4) 7

 

7. దేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు ఎన్ని?

1) 25               2) 26                3) 27             4) 28

 

8. భారత్‌లో అతి చిన్న రాష్ట్రం ఏది?

1) కేరళ                2) సిక్కిం              3) మిజోరాం              4) గోవా

 

9. తెలంగాణ రాష్ట్రం ఎన్నో రాష్ట్రంగా ఏర్పాటైంది?

1) 26             2) 27                3) 28         4) 29

 

10. దేశంలో అతిపెద్ద మహానగరం?

1) ముంబయి             2) బెంగళూరు             3) హైదరాబాద్‌            4) దిల్లీ

 

సమాధానాలు

1-4      2-4      3-2      4-3      5-3      6-4      7-4      8-4      9-3     10-4.

 

రచయిత: డాక్టర్‌ ఆనంద్‌ 

 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

 

 భారతదేశం - ఉనికి

 భారతదేశం - వ్యవసాయం

 సహజ ఉద్భిజ సంపద

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 30-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌