• facebook
  • whatsapp
  • telegram

సహజ వృక్షసంపద - అడవులు

సహజ రక్షణలో... సంపద సృష్టిలో!

సునామీల వంటి విపత్తుల నుంచి సహజ రక్షణ కల్పించడంలో, అపార అటవీ సంపదను అందించి ఆర్థిక వృద్ధికి దోహదపడటంలో అడవులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వాతావరణ సమతౌల్యాన్ని సంరక్షించడంలోనూ వనాల ప్రాధాన్యం ఎనలేనిది. వర్షాలు కురవాలన్నా, ఆ వానల ధాటికి నేలలు కోతకు గురికాకుండా ఉండాలన్నా అరణ్యాలే ఆధారం. అందుకే జీవరాశుల మనుగడకు అత్యంత ముఖ్యమైన ఆ అడవులు-రకాలు, వాటిలో పెరిగే వృక్షాలు-ఉపయోగాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 


సహజ వృక్షసంపద - అడవులు

మానవ ప్రమేయం లేకుండా ప్రకృతిలో వాటికవే పుట్టి పెరిగే మొక్కలు, చెట్లు, గడ్డి పొదలను సహజ వృక్షసంపద లేదా అడవులు అంటారు. మనిషి మనుగడకు ఇవి అతిముఖ్యమైన సహజ వనరులు. ప్రపంచ భూభాగంలో 31% అడవులు ఉన్నాయి. అయితే అన్ని ఖండాలు, ప్రదేశాల్లో ఒకే విధంగా లేవు. ఒక దేశ ఆర్థిక పరిస్థితి ప్రత్యక్షంగా, పరోక్షంగా అక్కడి అటవీసంపదపై ఆధారపడి ఉంటుంది. వాతావరణంలోని వ్యత్యాసాలతో పాటు జంతువుల, మానవుల చర్యల కారణంగా అటవీ విస్తీర్ణం అన్ని ప్రాంతాల్లో ఒకేరకంగా ఉండదు. మన దేశంలోని అడవులు ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో పెరిగే రకాలే. పశ్చిమ దేశాలతో పోలిస్తే భారత్‌లో గృహాలకు, గృహావసరాలకు కలప వినియోగం తక్కువ. మన అడవుల్లో ఒకే రకం చెట్లు ఉండవు. వివిధ రకాల చెట్లు కలిసి పెరుగుతాయి. దీంతో వాణిజ్యపరంగా పనికొచ్చే చెట్లను నరకడం కష్టంగా ఉంటుంది. మన దేశంలో కాగితం తయారీకి పనికొచ్చే కలప తక్కువగా లభిస్తుంది. అది కూడా రవాణా సౌకర్యాలు అంతగా లేని హిమాలయ పర్వతాల్లోనే ఉంటుంది. అందువల్ల మనం కాగితపు గుజ్జును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.

 

దేశంలో అడవుల ద్వారా సుమారు పది లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. అడవుల నుంచి కలపతో పాటు అగ్గిపెట్టెలు, కాగితం, పెన్సిల్, రెసిన్, బంక, ఔషధాలు, తేనె, పండ్లు, ఆహార ఉత్పత్తులు లాంటివి లభిస్తాయి. చాలాకాలంగా వ్యవసాయం కోసం అడవుల నరికివేత కొనసాగుతోంది. దానివల్ల శీతోష్ణస్థితిలో మార్పులు, మృత్తికా క్రమక్షయం/నేల కోత లాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. చంబల్, నర్మద, మహానదీ తీరాలకు రెండువైపులా నేల కోత వల్ల కందర భూములు ఏర్పడ్డాయి. రాజస్థాన్‌ ఎడారి సంవత్సరానికి అర కిలోమీటరు మేర గంగామైదానం వైపు వ్యాపిస్తూ ఉంది.

 

మన దేశంలో వాతావరణ సమతౌల్యం కోసం అడవుల విస్తీర్ణం 33 శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది. అడవులను పెంచే కార్యక్రమం 1950లో మొదలైంది. వనమహోత్సవం పేరుతో ఏటా జులైలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో హరితహారం పేరుతో ప్రత్యేకంగా పచ్చదనం పెంపొందించే కార్యక్రమం 2015లో మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలనేది ఈ కార్యక్రమ లక్ష్యం. అందులో 100 కోట్ల మొక్కలు అటవీ ప్రాంతంలో, 120 కోట్ల మొక్కలు అటవీయేతర ప్రాంతంలో పెంచాలని, మొత్తంగా ఏటా 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళికలు రూపొందించారు.

 

అడవుల్లో రకాలు

వర్షపాతం, ఉష్ణోగ్రత, నేలల స్వభావం, ఆ ప్రదేశం ఎత్తు ఆధారంగా అడవులను వర్గీకరించారు. మన దేశంలో వర్షపాతం ఆధారంగా అడవులను కింది విధంగా విభజించారు.

సతత హరిత అరణ్యాలు: వీటిని ఉష్ణమండల తేమతో కూడిన సతతహరిత అరణ్యాలు అంటారు. అధిక వర్షపాత ప్రాంతాల్లో (200 సెం.మీ. అంతకంటే ఎక్కువ) ఉంటాయి.  ఇవి పశ్చిమ తీరం, అసోం, పశ్చిమ్‌ బంగా, ఒడిశా, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో కనిపిస్తాయి. మనదేశ అడవుల్లో 21% మేర ఉన్నాయి. ఇక్కడి చెట్లు సంవత్సరం పొడవునా పొడవైన ఆకులతో ఉంటాయి. వెదురు, కేన్, పామ్స్, తుమ్మ, మహగని, ఎబోని, రోజ్‌వుడ్‌ లాంటి గట్టి కలప ఉన్న చెట్లు లభ్యమవుతాయి.

ఆకురాల్చే అడవులు: వీటిని ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అంటారు. ప్రధానంగా దక్షిణ భారత ద్వీపకల్ప ప్రాంతంలో ఉన్నాయి. నైరుతి రుతుపవన వర్షాల తర్వాత ఎక్కువకాలం అనార్ద్ర పరిస్థితుల ఉండటం వల్ల ఇక్కడి చెట్ల ఆకులు రాలిపోతాయి. ఈ రకమైన అడవులు మన దేశంలో సుమారు 60% వరకు ఉన్నాయి. వార్షిక వర్షపాతం 70 - 200 సెం.మీ. ఉన్న ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో అర్ధ ఆకురాల్చే అడవులు 100 - 200 సెం.మీ. వర్షపాతం ఉన్న కొండ ప్రాంతాలు, పీఠభూమి ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్, చోటానాగపుర్, శివాలిక్‌ పర్వత సానువులు, సహ్యాద్రి పర్వత వాలులో విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ సాల్, టేకు, మంచిగంధం, షీషమ్, వెదురు, ఖైర్, రెడ్‌వుడ్‌ వృక్షాలు విరివిగా కనిపిస్తాయి. అనార్ద్ర శుష్క ఆకురాల్చే అడవులు 70 - 100 సెం.మీ. వర్షపాతం ఉన్న ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా ఉంటాయి. వీటిలో టేకు, సాల్, వెదురు, గంధం, ఖైర్‌ చెట్లు కనిపిస్తాయి.

వర్షాభావ ప్రాంత అరణ్యాలు/చిట్టడవులు: ఇవి తక్కువ వర్షపాతం (50-75 సెం.మీ.) ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటిని ఉష్ణమండల ముళ్లజాతి అడవులు అంటారు. రాజస్థాన్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌ పశ్చిమ భాగం, గుజరాత్, పశ్చిమ కనుమల్లోని వర్షచ్ఛాయా ప్రాంతంలో ఉంటాయి. ఎక్కువగా పొదలు, బాబుల్, జంద్, షీషమ్, టమారిక్స్, ఈత, తాటి, రేగు, బ్రహ్మజెముడు, తుమ్మ, వేప, ఉసిరి లాంటి వృక్షాలు ఉంటాయి. ఈ రకం అడవులు మన దేశంలో సుమారు 3% ఉన్నాయి.

క్షార జలారణ్యాలు/మడ అడవులు: వీటిని మాంగ్రూవ్, డెల్టా అరణ్యాలు; పోటు, పాటు అడవులు అంటారు. ఇవి ఎక్కువగా సముద్ర తీరాల్లో, గంగానదీ డెల్టా ప్రాంతంలో ఉంటాయి. వీటిలో సుంద్రీ చెట్టు ప్రధానమైంది. పశ్చిమ బెంగాల్‌లోని గంగానది ముఖద్వారం వద్ద వీటితో కూడిన సుందరవనాలు కనిపిస్తాయి. ఇక్కడ పెరిగే ఇతర వృక్షాలు రైజోఫోరా, అవిసెన్నియా, ఎర్రమడా, నైపా. మడ అడవులు సునామీల నుంచి సహజ రక్షక కవచాలుగా పనిచేస్తాయి. ఇవి మనదేశంలో సుమారు 0.7% ఉన్నాయి.

పర్వత ప్రాంత అరణ్యాలు/హిమాలయ అడవులు: దేశంలో ఈ రకం అడవులు 9% ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో కశ్మీర్‌ నుంచి అసోం వరకు వ్యాపించి ఉన్నాయి. హిమాలయాల్లో ఎత్తును బట్టి ఉష్ణోగ్రతలు, వర్షపాతం మారుతూ ఉంటుంది. అందవల్ల ఎత్తును బట్టి వీటిని వివిధ పేర్లతో పిలుస్తారు. వెయ్యి మీటర్ల ఎత్తువరకు ఉన్న అరణ్యాలను ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, 1000 - 1800 మీటర్ల ఎత్తులో ఉన్నవాటిని ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు, 1800 - 3300 మీటర్ల ఎత్తు ఉన్న వాటిని శృంగాకార అరణ్యాలు, 3300 మీటర్ల కంటే ఎత్తులో ఉన్న వాటిని అల్ఫైన్‌ అరణ్యాలని అంటారు.

* పశ్చిమ కనుమల్లో 1800 - 3000 మీటర్ల ఎత్తులో పెరిగిన అరణ్యాలను షోలాస్‌ అంటారు.

* ‘ఫారెస్ట్‌’ పదం ‘ఫోరెస్‌’ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. ఫోరెస్‌ అంటే గ్రామం వెలుపలి భాగం అని అర్థం.

* ప్రపంచ వ్యాప్తంగా ఎడారీకరణ దినోత్సవాన్ని జూన్‌ 17న నిర్వహిస్తారు.

* ఐక్యరాజ్య సమితి 2010 - 2020 దశాబ్దాన్ని ఎడారులు, ఎడారీకరణ వ్యతిరేక పోరాట దశాబ్దంగా ప్రకటించింది.

 

ప్రస్తుతం భారతదేశంలో అడవుల విస్తీర్ణం 21.71%, ఇతర చెట్ల విస్తీర్ణం 2.91%, మొత్తం అడవులు, చెట్ల విస్తీర్ణం 24.62%. పొదలు 1.42%, అడవులు లేని ప్రాంతం 76.87%. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌ (77,000 చ.కి.మీ.) అరుణాచల్‌ప్రదేశ్‌ (66,000 చ.కి.మీ.), అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలు హరియాణా (1600 చ.కి.మీ.), పంజాబ్‌ (1800 చ.కి.మీ.) అటవీ శాతం ఎక్కుగా ఉన్న రాష్ట్రాలు మిజోరం (84%), అరుణాచల్‌ ప్రదేశ్‌(79%), తక్కువ శాతం ఉన్నవి హరియాణా (3.63%), పంజాబ్‌ (3.67%).

అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ-కశ్మీర్‌ (21,000 చ.కి.మీ.), అండమాన్‌ నికోబార్‌ దీవులు (6700 చ.కి.మీ.), తక్కువ విస్తీర్ణం ఉన్నవి చండీగఢ్‌ (23 చ.కి.మీ.), లక్షదీవులు (27 చ.కి.మీ.). అడవుల శాతం ఎక్కుగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు లక్షదీవులు (90%), అండమాన్‌ నికోబార్‌ (82%). తక్కువ ఉన్నవి లద్దాఖ్‌ (1.3%), పుదుచ్చేరి (10.8%).

* తెలంగాణలో విస్తీర్ణంలో, శాతంలో అటవీ ప్రాంతం ఎక్కుగా ఉన్న మొదటి మూడు జిల్లాలు ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌.

 

దేశంలోని అటవీ పరిశోధనా సంస్థలు

* ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ - దెహ్రాదూన్‌

* ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆరిడ్‌ జోన్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ - జోధ్‌పుర్‌

* ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీ - దెహ్రాదూన్‌

* సెంటర్‌ ఫర్‌ సోషల్‌ ఫారెస్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ - అలహాబాద్‌

* రెయిన్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ - జోర్హాట్‌ (అసోం)

* ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీ - హైదరాబాద్‌

* సెంటర్‌ ఫర్‌ ఫారెస్ట్‌ బేస్‌డ్‌ లైవ్‌లీహుడ్స్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌ - అగర్తల (త్రిపుర)

* టెంపోరేట్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ - సిమ్లా

* ట్రాపికల్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ - జబల్‌పుర్‌

* ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ - భోపాల్‌

రచయిత: గోపగోని ఆనంద్‌

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  భారతదేశ నదీ వ్యవస్థ

‣  సహజ ఉద్భిజ సంపద

 భారతదేశం - వ్యవసాయం

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 10-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌