• facebook
  • whatsapp
  • telegram

మృత్తికలు

జీవరాశుల మనుగడకు మూలాలు

  నేలకి, మనిషికి లేదా జీవరాశికి ఉన్న అనుబంధం విడదీయలేనిది. జీవుల మనుగడంతా నేలపైనే ఆధారపడి ఉంది. ఇంత ముఖ్యమైన ఈ నేల ఎలా ఏర్పడుతుంది? ఇన్ని రకాలుగా ఉండటానికి కారణాలు ఏమిటి? ఒండ్రు నేలలు, నల్ల నేలలు, ఎర్ర నేలలు, ఎడారి నేలలు ఏవిధంగా రూపుదిద్దుకుంటున్నాయి? ఏ నేలలు ఎలాంటి పంటలకు ప్రత్యేకం?  జనరల్‌ స్టడీస్‌లో భాగంగా పరీక్షార్థులు ఈ అంశాలను  తెలుసుకోవాలి. 

 

  భూమి ఉపరితలంపై అనేక కర్బన, అకర్బన పోషకాలతో కూడుకుని వదులుగా ఉండే పలుచని పొరనే ‘మృత్తిక’ లేదా ‘నేల’ అంటారు. దీని మందం సుమారు 25 నుంచి 35 సెం.మీ. ఉంటుంది. మృత్తికలు జీవ, పునర్వినియోగ వనరులు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండే దేశాల్లో దీని ప్రాముఖ్యం ఎక్కువ. ప్రజల ఆహార అవసరాలు తీర్చి, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే వ్యవసాయ రంగానికి ప్రపంచ దేశాలన్నీ చాలా ప్రాధాన్యం ఇస్తాయి. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులెన్ని ఉపయోగించినప్పటికీ పంటల ఉత్పత్తి నేల స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది.

 

మృత్తికల స్వభావాలు - కారకాలు 

శీతోష్ణస్థితి, సహజ వృక్ష సంపద, నైసర్గిక స్వరూపం, కాలం, పవనాలు-గాలులు, వర్షం, మంచు గడ్డలు, నదులు లాంటివి మృత్తికల స్వభావానికి కారకాలు. ఇవి కాల క్రమేణా మాతృశిలను శిథిలం చేసి వాటితో జంతువులు, వృక్షాల శిథిలాలను కలిపేసుకుని కొంతకాలానికి నేలగా ఏర్పడతాయి. 

* మీటరు మందం ఉండే ‘నేల’ ఏర్పడాలంటే సుమారు 5000 నుంచి 10000 ఏళ్లు పడుతుంది. నేల సారం దానిలోని పోషక పదార్థాల శాతంపై ఆధారపడి ఉంటుంది. దానిలో పండే పంటలు నేల రకాలను అనుసరించి ఉంటాయి. 

* భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌) దేశంలోని నేలలను వివిధ అంశాల ప్రాతిపదికన ఎనిమిది రకాలుగా వర్గీకరించింది. 

 

ఒండ్రుమట్టి నేలలు: వీటినే అల్లూవియల్‌ నేలలు అంటారు. ఇవి మనదేశంలో భౌగోళిక విస్తీర్ణంలో 43.36 శాతాన్ని ఆక్రమించాయి. అంటే దేశ విస్తీర్ణంలో 143 మిలియన్‌ హెక్టార్లు ఈ రకమైన మృత్తికలే. ఇవి నదుల ద్వారా జరిగే క్రమక్షయం, రవాణా, నిక్షేపణం వల్ల ఏర్పడతాయి. ఈ నేలల్లో బంకమన్ను, ఇసుక రేణువులుంటాయి. ఇవి గంగా, బ్రహ్మపుత్రా నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని భాబర్, టెరాయి, భంగర్, ఖాదర్, కాంకర్, ఉషర్‌లుగా విభజించారు. ఈ నేలల్లో ఎక్కువగా వరి, గోధుమ, చెరకు జనపనార, పత్తి పండిస్తారు.

 

నల్లరేగడి నేలలు:  వీటినే బ్లాక్‌ సాయిల్‌ నేలలు అంటారు. ఇవి అగ్నిపర్వత శిలాద్రవం (లావా) ప్రవహించడం వల్ల ఏర్పడినవి. ఇవి మాతృశిలల శైథిల్యం వల్ల ఏర్పడ్డాయి.  మనదేశంలో ఇవి 49.8 మిలియన్‌ హెక్టార్లలో అంటే 15.09 శాతం విస్తీర్ణంలో ఉన్నాయి. నల్లరేగడి నేలలకు నీటిని నిలిపి ఉంచే శక్తి ఎక్కువ. ఇవి పత్తి పంటకు అనుకూలం. అందుకే వీటిని బ్లాక్‌ కాటన్‌ నేలలు అంటారు. ఈ నేలలు వర్షకాలంలో జిగటగా, వేసవిలో ఎండిపోయి పెద్ద, పెద్ద పగుళ్లు ఏర్పడతాయి. భూఉపరితలంపై ఉండే మట్టి రాలిపోయి ఆ పగుళ్లలో చేరుతుంది. అలా స్వయం మట్టిమార్పిడి చేసుకుంటాయి. కాబట్టి వీటిని ‘స్వతఃసిద్ధ వ్యవసాయ సాగునేలలు’ అంటారు. ఈ నేలలు పత్తి, పోగాకు, వరి గోధుమ, మిరప, నూనె గింజలు, చెరకు, నిమ్మ పంటలకు అనుకూలం.

 

ఎర్ర నేలలు: వీటినే రెడ్‌ సాయిల్‌ అంటారు. పురాతన స్ఫటికాకార రూపాంతర శిలలు శిథిలమవడం వల్ల ఏర్పడతాయి. వీటిలో ఇనుము (ఎక్కువ శాతం), మెగ్నీషియం ఉండటం వల్ల ఎర్రగా ఉంటాయి.. తేమ ఎక్కువగా ఉన్న చోట పసుపు రంగులో కనిపిస్తాయి. దేశంలో 61 మిలియన్‌ హెక్టార్లలో సుమారు 18.9 శాతం విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు ఎక్కువగా ద్వీపకల్ప పీఠభూమి అయిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. తెలంగాణాలో ఈ నేలలను చెలక నేలలు/దుబ్బనేలలు అంటారు. ఈ నేలల్లో పోటాషియం, సిలికా, అల్యూమినియం ఎక్కువగా; నత్రజని, ఫాస్ఫరస్, సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇవి వరి, పత్తి, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, వేరుశనగ, కూరగాయలకు అనుకూలం.

 

లాటరైట్‌ నేలలు: ఇవి అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఈ నేలలు దేశంలో 12.2 మిలియన్‌ హెక్టార్లలో అంటే సుమారు  3.7% విస్తీర్ణంలో ఉన్నాయి. ఇవి తక్కువ సారవంతమైనవి. వీటిలో ఇనుము, పోటాషియం ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. నత్రజని, కాల్షియం, ఫాస్ఫేట్, సేంద్రీయ పదార్థాలు తక్కువ. ఈ నేలలు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, మేఘాలయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలంగాణలో జహీరాబాద్, నారాయణఖేడ్‌లలో ఎక్కువగా, ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు (సత్యవేడు), నెల్లూరు( కావలి, సూళ్లూరిపేటల) దగ్గర ఎక్కువ. ఇవి కాఫీ, తేయాకు, జీడిమామిడి, రబ్బరు, సుగంధ ద్రవ్యాల్లాంటి పంటలకు అనుకూలం.

 

ఎడారి నేలలు: వీటినే ఆరిడ్‌ సాయిల్‌ అంటారు. ఇవి ఎడారి ప్రాంతాలు అంటే శుష్క, అర్ధ శుష్క శీతోష్ణస్థితి ఉండే ప్రాంతాల్లో శిలల యాంత్రిక శైథిల్యం వల్ల ఏర్పడతాయి. వీటిలో ఇసుక రేణువులు,. ఫాస్ఫరస్‌ ఎక్కువ. నత్రజని, సేంద్రీయ పదార్థాలు తక్కువ. గాలి వీచే విధానాన్ని బట్టి ఇవి విస్తరిస్తాయి. ఈ నేలలు దేశంలో సుమారు 4.42 శాతం అంటే.. 14.6 మిలియన్‌ హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఇవి రాజస్థాన్, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో విస్తరించాయి. ఈ నేలలు సజ్జ, జొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలకు అనుకూలం.

 

ఆమ్ల, క్షార నేలలు: వీటినే లవణీయత ఉండే లేదా క్షార నేలలు అంటారు. ఈ నేలల్లో సోడియం, కాల్షియం, మెగ్నీషియం, లవణాలుంటాయి. శుష్క వాతావరణంలో భూమిలో నీరు నిలిచి లవణాలు బయటకు పొలేని పరిస్థితుల్లో ఏర్పడతాయి. ఇవి రాజస్థాన్, గుజరాత్‌లలో ఎక్కువ. గంగా మైదాన వాయవ్య ప్రాంతంలో వీటిని ‘రే కల్లార్‌’  ఊసర నేలలు అంటారు. దేశ భూభాగంలో ఇవి సుమారు 1.2 శాతం విస్తరించి ఉన్నాయి. 

 

అటవీ నేలలు:  దేశంలో ఎక్కువగా కొండ ప్రాంతాల్లో విస్తరించి ఉండటం వల్ల వీటిని పర్వత నేలలు అంటారు. ఇవి ఎక్కువగా లడఖ్, జమ్ము-కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో ఉన్నాయి. ఈ నేలలు దేశంలో సుమారు 7.2 శాతం, 24 మిలియన్‌ హెక్టార్లలో విస్తరించాయి. పండ్ల తోటలకు, సుగంధ ద్రవ్యాల పంటలకు అనుకూలం. 

 

పీట్‌/జీవసంబంధ నేలలు:  వీటినే సేంద్రియ నేలలు అంటారు. వీటిలో తేమ, బురద ఎక్కువ. ఇవి వ్యవసాయానికి అంతగా అనుకూలం కాదు. దేశ భూభాగంలో ఇవి మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అక్కడ కూడ విస్తరించి ఉన్నాయి. 

  భారతదేశంలో మృత్తికలు చాలా పురాతనమైనవి. సారవంతమైనవి. పంటలకు చాలా అనుకూలంగా ఉంటాయి. సరైన వ్యవసాయ పద్ధతులు, తగిన మోతాదులో ఎరువులను వాడితే పంటలు బాగా పండి ఎక్కువ దిగుబడినిస్తాయి. మృత్తికా క్రమక్షయం/ నేల కోత మనదేశంలో వ్యవసాయానికి పెద్ద సమస్య. ప్రతి సంవత్సరం లక్షల టన్నుల మృత్తిక వరదల వల్ల కొట్టుకుపోతుంది. అధిక వర్షపాతం, తక్కువ సమయంలో అతి ఎక్కువ వర్షపాతం వల్ల కూడా నేల కొట్టుకుపోతుంది. వాలుగా ఉండే భూఉపరితలం, మృత్తిక పరిమాణం, నిర్మాణం; అడవుల విస్తరణ, భూ వినియోగం, ప్రకృతి విపత్తులు, మానవ చర్యలు, జంతువులు మొదలైనవి కూడా మృత్తికా క్రమక్షయానికి కారకాలు.

  నేల కోత/మృత్తికా క్రమక్షయాన్ని తగ్గించడానికి కాంటూర్‌ కందకాలు తవ్వడం, టెర్రస్‌ విధానంలో వ్యవసాయం, మల్చింగ్, అడవుల పెంపకం, జంతువులను నియంత్రించడం, గడ్డిభూములు పెంచడం, పంటమార్పిడి విధానం, చెక్‌ డ్యామ్‌లు నిర్మించడం, వాలుకు అడ్డంగా దున్నడం, పోడు వ్యవసాయాన్ని ఆపివేయడం, ముఖ్యంగా గ్రామీణులను చైతన్యపరచడం మొదలైనవి ఫలితాలనిస్తాయి. 

 

మృత్తికా ఆరోగ్య పత్రం

* 2016లో ఇస్రో (ఐఎస్‌ఆర్‌ఓ) అంచనాల ప్రకారం భారత దేశ వాయవ్య ప్రాంతంలో 50 శాతం భూభాగం ఎడారిగా మారే ముప్పును ఎదుర్కొంటోంది. 

* కేంద్ర ప్రభుత్వం 2015, ఫిబ్రవరి 19న మృత్తికా సంరక్షణ కోసం ఒక పథకం ప్రవేశ పెట్టింది. మృత్తికా ఆరోగ్య పత్రం (సాయిల్‌ హెల్త్‌ కార్డ్‌). దీన్ని ప్రతి రెండేళ్లకు ఒకసారి ఇస్తారు. దీనిలో ఏయే పంటలకు ఏయే పోషకాలు వాడాలో తెలియజేస్తారు.

* ప్రస్తుతం ‘సేవ్‌ సాయిల్‌’ అనే ఉద్యమం భారత్‌లో ప్రారంభమైంది. ‘ఈషా ఫాండేషన్‌’ వ్యవస్థాపకులు ‘సద్గురు జగీ ్గవాసుదేవ్‌’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రÛమం సాగుతోంది. ఇందులో భాగంగా  మోటార్‌ బైక్‌ యాత్రను సద్గురు లండన్‌లో గత మార్చి 21న మొదలుపెట్టారు. 27 దేశాల్లో, 30,000 కిలోమీటర్లు పర్యటించి 350 కోట్ల మంది ప్రజలను చైతన్యపరిచి, వారి మద్దతు కూడగట్టడమే ఈ ఉద్యమం లక్ష్యం. యాత్ర వందరోజులపాటు సాగి దక్షిణ భారతదేశంలోని కావేరీ నది దగ్గర ముగుస్తుంది.

 

ప్రధాన మృత్తికా పరిశోధనా కేంద్రాలు 

* ఐ.సి.ఎ.ఆర్‌.- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ సైన్స్, భోపాల్, మధ్యప్రదేశ్‌ 

* ఐ.ఐ.హెచ్‌.ఆర్‌.- సాయిల్‌సైన్స్, బెంగళూరు, కర్ణాటక 

* ఐ.సి.ఎ.ఆర్‌.- సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైలాండ్‌ అగ్రికల్చర్‌ (కీడా) హైదరాబాద్‌

* ఐ.సి.ఎ.ఆర్‌.- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్సర్వేషన్, డెహ్రడూన్‌ ఉత్తరాఖండ్‌

* ఐ.సి.ఎ.ఆర్‌. - సెంట్రల్‌ సాయిల్‌ సెలైనిటి రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, కర్నాల్, హరియాణా

* ఐ.సి.ఎ.ఆర్‌.- నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ సాయిల్‌ సర్వే అండ్‌ లాండ్‌ యూజ్‌ ప్లానింగ్, బెంగుళూరు, కర్ణాటక 

* కాపి సాయిల్‌ హెల్త్‌ మానిటరింగ్‌ అండ్‌ మేనేజ్మెంట్  బెంగళూరు, కర్ణాటక 

* డి.డబ్ల్యూ, ఆర్‌ హిస్సార్, హరియాణ 

* ఐ.సి.ఎ.ఆర్‌.- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్సర్వేషన్, ఊటీ, తమిళనాడు

 

రచయిత: డా.గోపగోని ఆనంద్‌

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  భారతదేశ నదీ వ్యవస్థ

  సహజ ఉద్భిజ సంపద

‣ భారతదేశం - వ్యవసాయం

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 30-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌