* చాళుక్యుల్లో మూడు రాజవంశాలు ప్రధానమైనవి. అవి:
1. పశ్చిమ చాళుక్యులు (క్రీ.శ. 500-755)
2. వేంగి చాళుక్యులు (క్రీ.శ. 624-1076)
3. కల్యాణి చాళుక్యులు (క్రీ.శ. 973-1200)
* వీరు దక్షిణ భారతదేశంలో రాజకీయ, ఆర్థిక, మత, సాహిత్య, వాస్తు, శిల్పకళా రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించారు.
* వీరేకాక వేములవాడ, ఎలమంచిలి, నిడదవోలు, అన్హిల్వాడా చాళుక్యులు కూడా వివిధ ప్రాంతాల్లో పరిపాలించారు.
బాదామి లేదా పశ్చిమ చాళుక్యులు
* వీరు క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు రాజ్యపాలన చేశారు. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో ఉన్న వాతాపి లేదా బాదామి వీరి రాజధాని.
* వీరిని ‘బాదామి’ చాళుక్యులు అని కూడా పిలుస్తారు.
* ఉత్తరాన కనౌజ్, దక్షిణాన పల్లవులతో వీరికి శత్రుత్వం ఉండేది.
* వీరితో నిరంతరం పోరాటాలు చేయడంవల్ల పశ్చిమ చాళుక్య వంశం పతనమైంది.
బాదామి చాళుక్య పాలకులు జయసింహ వల్లభుడు
* పశ్చిమ చాళుక్య స్థాపకుడు, తొలి పాలకుడు.
* ఇతడు మొదట్లో వాకాటకులకు సామంతుడిగా ఉన్నాడు. ‘వాతాపి’ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.
రణరాగుడు
* ఇతడికి ‘మహారాజ’ అనే బిరుదు ఉంది. రణరాగుడి కాలంలో రాజ్యం ప్రస్తుత బీజాపూర్ జిల్లాలోని బాదామి వరకు విస్తరించింది.
మొదటి పులకేశి
* క్రీ.శ. 535566 వరకు రాజ్యపాలన చేశాడు. బాదామి చాళుక్య రాజవంశంలో మొదటి సార్వభౌమ చక్రవర్తి. చాళుక్య రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేశాడు. అశ్వమేధ యాగాన్ని చేశాడు. బాదామిని రాజధానిగా చేసుకుని పాలించాడు.
* బాదామిలో లభించిన క్రీ.శ. 543 నాటి శాసనంలో మొదటి పులకేశి దండయాత్రలు, విజయాల గురించి ఉంది. క్రీ.శ. 543 - 544 కాలంలో ఇతడు ‘వాతాపి కోట’ నిర్మాణం ప్రారంభించాడు. ఇతడు చాళుక్య రాజ్యాన్ని కర్ణాటక వరకు విస్తరింపజేశాడు.
మొదటి కీర్తివర్మ
* క్రీ.శ. 566598 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడ్ని‘The First and Finest Maker of Vatapi’ గా పేర్కొంటారు.
* ఇతడు నలవాడ (బళ్లారి, కర్నూలు) పాలకుడైన నలరాజుని; బనవాసి పాలకుడైన కదంబుడిని; కొంకణ మౌర్యులను ఓడించి రాజ్యాన్ని విస్తరింపజేశాడు.
మంగళేశుడు
* కీర్తివర్మ మరణించేనాటికి అతడి కొడుకు రెండో పులకేశి బాలుడు. దీంతో తమ్ముడైన మంగళేశుడు రాజ్యపాలన చేశాడు. క్రీ.శ. 598-609 వరకు రాజుగా ఉన్నాడు.
* ఇతడు గుజరాత్ను పాలించిన ‘కాలచూరులను’ ఓడించి రేవతీద్వీపాన్ని (గోవా) ఆక్రమించాడు. ఇతడికి ‘పరమభాగవత’ అనే బిరుదు ఉంది.
* మంగళేశుడు తన కుమారుడ్ని రాజుగా చేయాలనుకున్నాడు. దీంతో క్రీ.శ. 609లో రెండో పులకేశితో వారసత్వ యుద్ధం జరిగింది. ఇందులో మంగళేశుడ్ని రెండో పులకేశి వధించి, రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు.
మొదటి విక్రమాదిత్యుడు
* క్రీ.శ. 642680 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు కూడా పల్లవులతో పోరాటాన్ని కొనసాగించాడు.
* ఇతడు పల్లవరాజు రెండో మహేంద్రవర్మను ఓడించాడు. కానీ తర్వాత జరిగిన ‘పెరువళనల్లూరు’ యుద్ధంలో విక్రమాదిత్యుడు ఓడిపోయాడు.
* మహేంద్రవర్మ తర్వాత పరమేశ్వరవర్మ పల్లవ పాలకుడయ్యాడు. విక్రమాదిత్యుడు ఇతడ్ని ఓడించి ‘కంచి’ని ఆక్రమించాడు.
* ఇదేకాలంలో తన తమ్ముడు జయసింహుడ్ని లాట, గుజరాత్ ప్రాంతాలకు గవర్నర్గా నియమించాడు. ఇది క్రమంగా లాటచాళుక్య వంశ ఏర్పాటుకు కారణమైంది.
వినయాదిత్యుడు
* క్రీ.శ. 680696 వరకు రాజ్యన్ని పాలించాడు. ఇతడి కాలంలో ఎలాంటి యుద్ధాలు లేవు. ‘అలంపూర్’ వద్ద ఆలయ నిర్మాణం ఇతడి కాలంలోనే జరిగింది.
విజయాదిత్యుడు
* క్రీ.శ. 696-733 వరకు రాజ్యాన్ని పాలించాడు. ఇతడు పట్టడకల్ లేదా కీసువల్ను సుందరంగా తీర్చిదిద్దాడు. పల్లవ రాజ్యంపై దండెత్తి అపార సంపద కొల్లగొట్టాడు.
* పల్లవ రాజు పరమేశ్వరవర్మతో మిళింద యుద్ధం చేశాడు. ఇందులో గాంగరాజు పరమేశ్వర వర్మకు సాయం చేసి, విజయాదిత్యుడ్ని చంపాడు.
రెండో విక్రమాదిత్యుడు
* క్రీ.శ. 733744 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి కాలంలో అరబ్బులు రాజ్యంపైకి దండెత్తారు. వీరిని లాటరాజైన జయసింహవర్మ కుమారుడు పులకేశి ఓడించాడు.
* ్ర రెండో విక్రమాదిత్యుడు పులకేశికి ‘అవనీజనాశ్రయ’ అనే బిరుదు ఇచ్చాడు.
* రెండో విక్రమాదిత్యుడు పల్లవరాజు నందివర్మను ఓడించి, కాంచీపురాన్ని దోచుకున్నాడు.
* చేర, చోళ, పాండ్య, కలభ్రులను ఓడించి, చాళుక్యుల అధికారాన్ని కన్యాకుమారి వరకు వ్యాపింపజేశాడు.
రెండో కీర్తివర్మ
* క్రీ.శ. 744757 వరకు రాజ్యపాలన చేశాడు. బాదామి చాళుక్యుల్లో చివరివాడు. ఇతడి కాలంలో చాళుక్యులకు సామంతుడిగా ఉన్న రాష్ట్రకూట రాజు ‘దంతిదుర్గుడు’ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు.
* దంతిదుర్గుడి కుమారుడు మొదటి కృష్ణుడు కీర్తివర్మను ఓడించి చాళుక్యరాజ్యాన్ని ఆక్రమించడంతో బాదామి చాళుక్య రాజవంశం పతనమైంది.
రెండో పులకేశి (క్రీ.శ. 609-642)
* బాదామి చాళుక్యుల్లో గొప్పవాడు. అనేక దండయాత్రలు చేసి, చాళుక్య రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతడు ‘దక్షిణాపథ చక్రవర్తి’గా పేరుగాంచాడు.
* రెండో పులకేశి దక్షిణ భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో ఉత్తర భారతదేశాన్ని హర్షవర్ధనుడు పాలించాడు.
దండయాత్రలు: రెండో పులకేశి అనేక దండయాత్రలు చేశాడు. ముఖ్యంగా వారసత్వ యుద్ధ సమయంలో అతడిపై చాళుక్య సామంతుడు ‘అప్పాయిక’ తిరుగుబాటు చేశాడు. అందులో అప్పాయిక ఓడిపోయాడు.
* దీని తర్వాత కదంబులను, కొంకణ ప్రాంత మౌర్యులను, గాంగరాజులను, లాటపాలకులు, ఘర్జరులను ఓడించాడు. వీరంతా రెండో పులకేశికి సామంతులుగా మారారు.
* గాంగరాజైన దుర్వినేతను ఓడించి, అతడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు.
* ఈ యుద్ధాల ఫలితంగా రెండో పులకేశి రాజ్యం ఉత్తర సరిహద్దు ‘మహీనది’ వరకు విస్తరించింది. కళింగ రాజధాని పిఠాపురాన్ని ఆక్రమించి, తన సోదరుడైన ‘విష్ణువర్ధనుడికి’ అప్పగించాడు.
* రెండో పులకేశి పుల్లలూరు యుద్ధంలో పల్లవ రాజైన మహేంద్రవర్మను ఓడించి, వధించాడు.
* వేంగి పాలకుడైన ‘మూడో మాధవవర్మ’ను కునాల యుద్ధంలో ఓడించాడు.
* ఉత్తర భారతదేశాన్ని పాలిస్తున్న హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశంపై ఆధిపత్యం కోసం రెండో పులకేశిపై దండెత్తాడు. వీరిద్దరి మధ్య నర్మదా నది తీరాన యుద్ధం జరిగింది. ఐహోల్ శాసనం ప్రకారం, ఈ పోరులో రెండో పులకేశి విజయం సాధించి, ‘పరమేశ్వర’ అనే బిరుదు పొందాడు. యుద్ధం తర్వాత నర్మదానది రెండు రాజ్యాల మధ్య సరిహద్దుగా మారింది.
* ఈ యుద్ధం వల్ల చాళుక్యుల అధికారం మహారాష్ట్ర, మైసూరు ప్రాంతాలకు విస్తరించింది. చోళ, చేర, పాండ్యులతో పాటు దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని చిన్న రాజ్యాల పాలకులు కూడా రెండో పులకేశికి సామంతులుగా మారారు.
* క్రీ.శ. 641 లో పులకేశి రెండోసారి పల్లవరాజ్యంపై దండెత్తాడు. ఆ సమయంలో మొదటి మహేంద్రవర్మ కుమారుడు మొదటి నరసింహవర్మ పల్లవ రాజుగా ఉన్నాడు. అతడు ‘మణి మంగళయుద్ధం’లో పులకేశిని ఓడించాడు. దీనికి ప్రతిగా రెండో పులకేశి రాయలసీమలోని పల్లవ సామంతులైన బాణులను ఓడించి, కంచిని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.
* క్రీ.శ. 642 లో మొదటి నరసింహవర్మ పులకేశిపై దండెత్తి, అతడ్ని ఓడించి, వధించాడు. ఈ ఓటమి నుంచి కోలుకోవడానికి పశ్చిమ చాళుక్యులకు 12 ఏళ్లు పట్టింది. చాళుక్య, పల్లవుల మధ్య యుద్ధం సుదీర్ఘ కాలం జరగడంవల్ల ఈ రెండు రాజ్యాలు ఆర్థికంగా నష్టపోయాయి.
* రెండో పులకేశి సామ్రాజ్యం ఉత్తరాన నర్మదానది నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు, పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు విస్తరించింది.
ఇతర విషయాలు: పర్షియా చక్రవర్తి ‘రెండో ఖుస్రూ’ పులకేశి ఆస్థానానికి రాయబారిని పంపినట్లు పర్షియన్ చరిత్రకారుడు ‘తబారి’ పేర్కొన్నాడు. పర్షియా రాయబారి ఇతడి ఆస్థానానికి వచ్చినట్లు ఉండే వర్ణచిత్రం ‘అజంతా గుహ’లో ఉంది.
* చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ క్రీ.శ. 640-41లో రెండో పులకేశి ఆస్థానానికి వెళ్లాడు. ‘‘చాళుక్య రాజ్యం విశాలమైంది, రెండో పులకేశికి శత్రువులంటే భయంలేదు, ప్రజలు యుద్ధప్రియులు, కష్టజీవులు’’ అని అతడు సి-యూ-కి గ్రంథంలో పేర్కొన్నాడు.
పుట్టుపూర్వోత్తరాలు
* బాదామి చాళుక్య రాజవంశ పుట్టుపూర్వోత్తరాల గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ప్రముఖుల అభిప్రాయాలు:
* బిల్హణుడి ‘విక్రమాంకదేవ చరిత్ర’ ప్రకారం, చాళుక్యులు బ్రహ్మచాళకం వంశం నుంచి ఆవిర్భవించారు. అందుకే వీరిని ‘చాళుక్యులు’గా పేర్కొన్నారు. ఈ వంశం అనేక శాఖలుగా విడిపోయి, వివిధ ప్రాంతాలను పరిపాలించాయి. ఆయా ప్రాంతాల పేరు మీదుగా వీరికి గుర్తింపు వచ్చింది. ఉదాహరణకు వేంగి, కల్యాణి, బాదామి చాళుక్యులు.
* ‘‘చలిక, నలుకి, సతికి, చల్కి అనేవి చాళుక్య పదానికి పర్యాయపదాలు’’ - మల్లంపల్లి సోమశేఖరశర్మ
* ‘‘బాదామి చాళుక్యులు మధ్య ఆసియా నుంచి వచ్చిన ఘార్జరులు అనే శాఖకు చెందినవారు’’ - డాక్టర్ వి.ఎ.స్మిత్.
* ‘‘వీరు మధ్య ఆసియాకు చెందిన సెల్యుకస్ వంశానికి చెందినవారు’’ - జాన్ప్లీట్, రైస్.
* ‘‘చాళుక్యులు కన్నడ కుటుంబానికి చెందినవారు’’ - డి.సి.సర్కార్
శాసన ఆధారాలు:
* బాదామిలో లభించిన శాసనాల్లో ‘చాళక, చాళక్య’ పదాలు విరివిగా ఉన్నాయి.
* వివిధ శాసనాల్లో వీరిని వానవ్యసగోత్రులు, హరిపుత్రులని పేర్కొన్నారు.
* కొన్ని శాసనాల్లో చాళుక్యులు చంద్రవంశ క్షత్రియులని ఉంది.
* నాగార్జునకొండ శాసనంలో ఇక్ష్వాకు చక్రవర్తుల కింద ఉన్న హిరణ్య రాష్ట్ర (కడప) పాలకుడు ‘చలికి రెమ్మణుకుడు’ చాళుక్యవంశ మూలపురుషుడు అని ఉంది.
* చాళుక్యులు మొదట శూద్రులు, తర్వాత క్షత్రియులుగా మారారు అని వివిధ చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
రచయిత
డాక్టర్ వి. రాజ్మహ్మద్
అసిస్టెంట్ ప్రొఫెసర్