మూలాల్లో భిన్నత్వం.. మనుగడలో ఏకత్వం!
భారతీయ సమాజం విశిష్ట లక్షణం భిన్నత్వం. ఇతర ఏ దేశ సమాజంలోనూ లేనన్ని సాంఘిక, సాంస్కృతిక, భాష, మతపరమైన భేదాలు ఇక్కడ ఉన్నాయి. అనాదిగా ఇతర దేశాల నుంచి కొనసాగిన విభిన్న జాతులు, తెగల వలసలు, దేశంలోని భౌగోళిక వైవిధ్యం తదితర కారణాలతో రకరకాల ప్రజా సమూహాలు ఈ నేలపై స్థిరపడిపోయాయి. ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సమాజ సహజ లక్షణమైంది. ఇక్కడి జాతుల పుట్టుపూర్వోత్తరాలు, శారీరక లక్షణాలు, సంస్కృతుల తీరు, వారు నివసిస్తున్న ప్రాంతాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.
భారత సమాజం అతిపురాతనమైంది. పూర్వం నుంచి వివిధ కాలాల్లో బయటి నుంచి విభిన్న జాతి, భాష, మత సమూహాలకు చెందిన ప్రజలు మన దేశం వచ్చి స్థిరపడ్డారు. కాలక్రమంలో ఆ సమూహాలన్నీ పరస్పరం కలిసిపోయి, కొత్త ఉపజాతులుగా రూపొందాయి. ఈ కారణంగా భారతదేశంలో వివిధ జాతి, భాష, మత, సంస్కృతి, సమూహాల మధ్య వైవిధ్యం కనిపిస్తుంది. భారత సమాజ మౌలిక లక్షణాల్లో సమష్టి కుటుంబం, కులవ్యవస్థ, గ్రామీణ సదుపాయాలు ముఖ్యమైనవి. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో నేటికీ ఈ లక్షణాలు ప్రభావంతంగా ఉన్నాయి. దేశంలోని జాతుల పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకోవడానికి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడి జాతుల లక్షణాల గురించి స్పష్టంగా చెప్పడానికి తగినన్ని ఆధారాలు లేవు. దీనిపై సామాజికవేత్తలు పలు సిద్ధాంతాలను రూపొందించారు.
వర్గీకరణలు: 1) రిస్లే వర్గీకరణ 2) రుగ్గిరీ వర్గీకరణ 3) హేడన్ వర్గీకరణ 4) ఇక్స్టెడ్ వర్గీకరణ 5) గుహా వర్గీకరణ 6) సర్కార్ వర్గీకరణ
1) రిస్లే వర్గీకరణ: భారతదేశ జనాభాను మొదటిసారిగా సర్ హెర్బర్ట్ హోప్ రిస్లే 7 శాస్త్రీయ దృక్పథాలుగా వర్గీకరించారు.
1. టర్కీ-ఇరానియన్లు: ఈ జాతి వారు వాయవ్య సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
శారీరక లక్షణాలు: తెలుపు రంగు, శరీరంపై తక్కువ రోమాలు, కంటి రంగు నలుపు, శరీర ఉష్ణోగ్రత ఎక్కువ.
2. ఇండో ఆర్యన్లు: వాయవ్య సరిహద్దు ప్రాంతాల్లో జీవిస్తున్నారు.
లక్షణాలు: తెలుపు రంగు, శరీరంపై తక్కువ రోమాలు, కంటి రంగు నలుపు, శరీర ఉష్ణోగ్రత ఎక్కువ.
3. స్కీలో-ద్రవిడియన్లు: వీరు స్కీధియన్లు, ద్రవిడియన్ల కలయికతో ఏర్పడ్డారు.
లక్షణాలు: ముఖం మీద రోమాలు తక్కువ, మధ్య రకం ముక్కు, దళసరి పెదవులు.
4. ఆర్యో ద్రవిడియన్లు: ఇండో ఆర్యన్, ద్రవిడయన్ల కలయిక వల్ల ఏర్పడ్డారు. వీరు ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, బిహార్లలో ఎక్కువగా ఉంటారు.
లక్షణాలు: గోధుమ/నలుపు రంగు శరీరం, మధ్యరకం ముక్కు, విశాలమైన నుదురు.
5. మంగోలో ద్రవిడియన్లు: వీరు బెంగాల్, బిహార్లలో ఉంటారు.
లక్షణాలు: నలుపు శరీరం. ముఖంపై వెంట్రుకలు ఉండవు. ముక్కు వెడల్పుగా ఉంటుంది. అయితే కొందరిలో సన్నగా, వెడల్పుగా ఉంటుంది.
6. మంగోలాయిడ్లు: వీరు అస్సాం, ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారు.
లక్షణాలు: పసుపు పచ్చని శరీరం, శరీరంపై తక్కువ రోమాలు, కనురెప్ప ముడతపడి ఉంటుంది.
7. ద్రవిడియన్లు: వీరు దక్షిణ ప్రాంతాల్లో కనిపిస్తారు. మరికొందరు మధ్యప్రదేశ్, నాగాలాండ్, తమిళనాడుల్లో ఉంటారు.
లక్షణాలు: నలుపు రంగు శరీరం, ఉంగరాల జుట్టు, ముఖంపై దళసరిగా రోమాలు, ముక్కు అనిగిపోయి ఉంటుంది.
2) రుగ్గిరీ వర్గీకరణ: గుఫ్రిడా రుగ్గిరి భారతదేశ జనాభాను 5 రకాలుగా విభజించాడు.
1. నిగ్రిటోలు: దక్షిణ భారతదేశపు అడవి జాతుల వారు. ఉదా: వెడ్డాలు
2. ఆస్ట్రలాయిడ్ - వెడ్డాయిడ్: ఉత్తర, ఈశాన్య భారత్లో ఉంటారు. ఉదా: ఒరాన్లు, సంతాల్, ముండాలు
3. ద్రవిడియన్లు: దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ఉదా: తెలుగు, తమిళం మాట్లాడేవారు
4. ఎత్తుగా ఉండి పొడవైన తల ఉన్నవారు.
ఉదా: తోడా (తమిళనాడు)
5. బ్రాఖీసెఫాలిక్ శీర్షం ఉన్నవారు. వీరు ఉత్తర ప్రాంతంలో నివసిస్తారు.ఉదా: నాగా, కుకీ తెగలు.
3) హేడన్ వర్గీకరణ: భారతదేశాన్ని 3 ముఖ్యమైన భౌగోళిక ప్రాంతాలుగా విభజించాడు.
1) హిమాలయ ప్రాంతం: i) ఇండో-అఫ్గాను ii) ఇండో- ఆర్యన్లు iii) మంగోలాయిడ్లు
2) ఉత్తరభారత మైదాన ప్రాంతం: i) ఇండో-అఫ్గాన్లు ii్శ రాజపుత్రులు
3) దక్కన్ ప్రాంతం: i) నిగ్రిటోలు ii) ప్రి-ద్రవిడియన్లు iii) ద్రవిడియన్లు iv) దక్షిణ భారతదేశంలోని బ్రాఖీసెఫాలిక్ శీర్షం ఉన్నవారు v) పశ్చిమంలో ఉన్న బ్రాఖీసెఫాలిక్ శీర్షం ఉన్నవారు
గమనిక: హేడన్ పరిశోధన అంతా శారీరక లక్షణాలు, ఆచార వ్యవహారాలు, భాష మొదలైన వాటి ఆధారంగా సాగింది. ఈ ఆధారాలతోనే అతడు సిద్ధాంతాలను రూపొందించాడు.
4) ఇక్స్టెడ్ వర్గీకరణ: శారీరక, సాంస్కృతిక లక్షణాలు ఆధారంగా వాన్ ఇక్స్టెడ్ భారతదేశ జనాభాను నాలుగు రకాలుగా విభజించాడు.
1. వెడ్డిడ్ వర్గం: వీరు 2 రకాలు.
ఎ) గోండిడ్ వర్గం: శరీరం గోధుమ వర్ణం, ఉంగరాల జుట్టు, తక్కువ రోమాలున్న శరీరం. ఉదా: ఒరానులు, గోండులు, భిల్లులు
బి) మెలిడ్ వర్గం: పసుపు రంగు శరీరం, శరీరంపై తక్కువ రోమాలు. ఉదా: కురుంబాలు, వెడ్డాలు
2) మెలనిడ్: వీరు సౌత్మెలనిడ్, కోలిడ్ అని రెండు రకాలుగా ఉంటారు.
3) ఇండిడ్: వీరిని గ్రేసైల్ ఇండిడ్, నార్త్ ఇండిడ్ అని రెండు రకాలుగా పేర్కొంటారు.
4) పేలియో-మంగోలాయిడ్: వీరు ప్రాచీన భారతీయ సంప్రదాయానికి చెందినవారు.
5) గుహా వర్గీకరణ: ఈయన ఆరు రకాలుగా వర్గీకరించాడు. 1) నిగ్రిటోలు 2) ప్రోటో ఆస్ట్రరాయిడ్లు 3) మంగోలాయిడ్లు 4) మెడిటేరియన్లు 5) వెస్ట్రన్ బ్రాఖీసెఫల్స్ 6) నార్డిక్లు - నిగ్రిటోలు
నోట్: * భారతదేశంలో అధిక సంఖ్యాకులు కాకసాయిడ్ జాతికి చెందుతారు. ఉత్తర్ప్రదేశ్, తమిళనాడులోని బ్రాహ్మణులు; పంజాబ్లోని సిక్కులు, గుజరాత్లోని నాగర బ్రాహ్మణులు తదితరులంతా ఈ జాతికి చెందినవారే. * హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే భారతీయులది మంగోలాయిడ్ జాతి. * ప్రస్తుతం నిగ్రిటో జాతి వారు దేశంలో తక్కువగా ఉన్నారు.
6) సర్కార్ వర్గీకరణ: సర్కార్ అనే సామాజికవేత్త ప్రకారం గిరిజన జనాభాను మూడు రకాలుగా వర్గీకరించారు.
1. ఇండో - ఆర్యన్లు: వీరు మొదటగా సింధూ-గంగా నదుల పరీవాహక ప్రాంతాల్లో నివసించారు.
ఉదా: ఆదిమజాతి తెగలు
2. మీసోసెఫాల్లు: ఇరానో-సీథియస్ల కలయిక వల్ల ఏర్పడ్డారు.
3. బ్రాఖీసెఫాల్లు: మన దేశంలో వీరి జనాభాను సర్కార్ 4 రకాలుగా వర్గీకరించారు.
1) ఇరానో సీథియన్ వర్గం
2) ప్రాచీనకాలంలో ఆసియా నుంచి భారత్కు వచ్చిన బ్రాఖీసెఫాలిక్ వర్గం
3) మంగోలియన్ వర్గం
4) మలయన్ వర్గం
మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిని జతపరచండి.
కుల సిద్ధాంతాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు
1) జాతి సిద్ధాతం ఎ) రిస్లీ
2) భౌగోళిక సిద్ధాంతం బి) నెస్ఫీల్డ్
3) వృత్తి సిద్ధాంతం సి) గిల్బర్ట్
4) సంస్కార సిద్ధాంతం డి) హట్టన్
5) మన సిద్ధాంతం ఇ) హోకార్ట్, సెనార్ట్
1) 1-ఎ; 2-సి; 3-బి; 4-డి; 5-ఇ 2) 1-ఎ; 2-బి; 3-సి; 4-డి; 5-ఇ
3) 1-ఎ; 2-సి; 3-బి; 4-ఇ; 5-డి 4) 1-ఎ; 2-ఇ; 3-సి; 4-బి; 5-డి
2. కిందివాటిని జతపరచండి.
1) నిర్భయ చట్టం ఎ) మహిళలపై హింస ఘటనకు ఏర్పడింది
2) జె.ఎస్.వర్మ కమిషన్ బి) 2013, ఏప్రిల్ 3
3) షీ టీమ్స్ సి) 2014, అక్టోబరు 24
4) దిశా సంఘటన డి) 2019, నవంబరు 27
1) 1-బి; 2-ఎ; 3-డి; 4-సి 2) 1-బి; 2-ఎ; 3-సి; 4-డి
3) 1-ఎ; 2-బి; 3-సి; 4-డి 4) 1-డి; 2-బి; 3-సి; 4-ఎ
3. కిందివాటిలో ట్రాన్స్జెండర్లకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి.
1) దేశంలో ఎస్ఆర్ఎస్ (సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ) ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తమిళనాడు.
2) ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ను జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేస్తారు.
3) ట్రాన్స్జెండర్ అదనపు పేర్లు కిన్నెర, సఖి, జోగతీస్.
4) పైవన్నీ
4. 2011 జనాభా లెక్కల ప్రకారం వైకల్య జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి.
1) ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్
2) ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్
3) మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్
4) పశ్చిమ బెంగాల్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర
5. 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్ 2) ఉత్తర్ప్రదేశ్ 3) కేరళ 4) తెలంగాణ
6. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ను ఎంతకు పెంచింది?
1) రూ.2500 నుంచి రూ.4000
2) రూ.3016 నుంచి రూ.4016
3) రూ.3000 నుంచి రూ.4016
4) రూ.3500 నుంచి రూ.4016
7. అత్యధికంగా జోగినీ వ్యవస్థ కలిగిన జిల్లా?
1) మహబూబ్నగర్ 2) వరంగల్ 3) కరీంనగర్ 4) ఆదిలాబాద్
8. కిందివాటిని జతపరచండి.
సంస్థలు ఉన్న ప్రాంతం
1) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎ) సికింద్రాబాద్
2) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ బి) డెహ్రాడూన్
3) పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యండిక్యాప్డ్ సి) దిల్లీ
1) 1-ఎ, 2-బి, 3-సి 2) 1-సి, 2-బి, 3-ఎ
3) 1-బి, 2-ఎ, 3-సి 4) 1-సి, 2-ఎ, 3-బి
9. రైల్వే శక్తి టీమ్ టోల్ ఫ్రీ నంబర్?
1) 138 2) 139 3) 181 4) 182
10. భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థపై ఏర్పడిన మొదటి కమిషన్?
1) గురుపాద స్వామి కమిషన్ 2) దత్ కమిటీ
3) షిండే కమిటీ 4) దంతేవాలా కమిటీ
సమాధానాలు
1-2; 2-2; 3-4; 4-2; 5-1; 6-2; 7-3; 8-4; 9-2; 10-1.
రచయిత: వట్టిపల్లి శంకర్ రెడ్డి