• facebook
  • whatsapp
  • telegram

మాన‌వాభివృద్ధిలో భార‌త‌దేశం   

       ప్రపంచ దేశాల ఉమ్మడి లక్ష్యం మానవాభివృద్ధి. యూఎన్‌డీపీ 1990 నుంచి మానవాభివృద్ధి నివేదికను రూపొందిస్తుంది. ప్రపంచీకరణలో భాగంగా పేదల సాధికారత, సుస్థిర అభివృద్ధికి అనేక ప్రయత్నాలు జరిగాయి. భారతదేశం కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్‌ శాస్త్రవేత్త మహబూబ్‌ ఉల్‌హక్‌ సమగ్రమైన అభివృద్ధికి కొలమానంగా మానవాభివృద్ధిని సూచించారు. మన దేశ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ మానవాభివృద్ధి సూచికను సమర్థించి అభివృద్ధి పరిచారు.
                     మొదటి మానవాభివృద్ధి నివేదిక (Human development report)లో  తొలిమాటగా హక్‌ ‘ప్రజలే ఒక దేశానికి నిజమైన సంపద’ అని పేర్కొన్నారు. ప్రజలు సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడమే పాలన ప్రథమ ధ్యేయం కావాలని పిలుపునిచ్చారు. మానవాభివృద్ధి మనుషుల సుసంపన్న మనుగడను కోరుకుంటుంది. ఇది ప్రజల ఎదుగుదలకు అవకాశాలు కల్పించి వాటి ఎంపికలో తగిన స్వేచ్ఛను అందిస్తుంది. మానవాభివృద్ధి సూచిక అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ పాలకుల ఆలోచన, ప్రాధాన్యాల అమలుతీరులో మార్పు మొదలైంది. ప్రపంచ దేశాలను పరిశీలించి వాటికి ర్యాంకులు ప్రకటించడం వల్ల దేశాల మధ్య పోటీ ఏర్పడింది.   
* ప్రస్తుతం యూఎన్‌డీపీ మూడు అంశాల ఆధారంగా ప్రపంచ మానవాభివృద్ధి సూచికను లెక్కిస్తుంది.
    1) సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచిక 
    2) విజ్ఞాన సూచిక (చదువుకునే అంచనా సంవత్సరాలు + చదువులో పిల్లలు కొనసాగే సగటు సంవత్సరాలు) 
    3) GNP per capita (ppp US $)

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం   
    1990 నుంచి ఇప్పటి వరకు యూఎన్‌డీపీ ఏటా మానవాభివృద్ధి నివేదికను రూపొందిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని న్యూయార్క్‌లో 1965, నవంబరు 22న ఏర్పాటు చేశారు. ఇది ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలందించే స్వచ్ఛంద విరాళాలతో పనిచేస్తుంది. దాదాపు 180 దేశాల ప్రభుత్వాలతో కలిసి స్థానిక అభివృద్ధి సమస్యల గురించి అవగాహన కల్పిస్తుంది. ప్రభుత్వాల సామర్థ్యాలను పెంచి పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ప్రపంచ మానవాభివృద్ధి నివేదికతో పాటు స్థానిక, ప్రాంతీయ, జాతీయ నివేదికలను తయారుచేసి అందజేస్తుంది.

మన దేశ ప్రయత్నాలు 
    యూఎన్‌డీపీ భారతదేశంలో మానవాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 42 ప్రాజెక్టులు అమలు చేస్తూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వామిగా ఉంది. వీటిలో శక్తి, పర్యావరణం (25); పేదరిక నిర్మూలన (9), ప్రజాస్వామ్య పాలన (7), ప్రకృతి వైపరీత్యాలకు (1) సంబంధించిన ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో అయిదు నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయి. ప్రభుత్వాలు 1947 నుంచి వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజల ఆదాయవృద్ధి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. 

భారతదేశ ప్రగతి
    ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం 189 దేశాలను పరిశీలించి ఆయా దేశాల ప్రగతి ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుంది. 2018 నివేదిక ప్రకారం నార్వే మొదటి స్థానం, నైజర్‌ 189వ స్థానంలో ఉన్నాయి. భారత్‌ 2017లో 131వ స్థానంలో ఉండగా 2018లో 130వ స్థానాన్ని పొందింది. 1990 నాటి మొదటి నివేదిక ప్రకారం భారత్‌ 114వ స్థానంలో ఉంది. యూఎన్‌డీపీ మానవాభివృద్ధి సూచిక విలువను 0  1 మధ్య లెక్కించి ప్రపంచ దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది.  

1) అత్యధిక మానవాభివృద్ధి దేశాలు: 0.80  - 1
    నార్వే, స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా, జపాన్, సౌదీ అరేబియా  

2) అధిక మానవాభివృద్ధి దేశాలు: 0.7  - 0.8
    చైనా, బ్రెజిల్, ఇరాన్, మెక్సికో, థాయ్‌లాండ్, శ్రీలంక  

3) మధ్య స్థాయి మానవాభివృద్ధి దేశాలు: 0.55  - 0.7 
    బంగ్లాదేశ్, ఇండియా, భూటాన్, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా  

4) తక్కువ మానవాభివృద్ధి దేశాలు: 0.55 కంటే తక్కువ
    అఫ్గానిస్థాన్, బురుండి, నైజీరియా, టాంజానియా, ఉగాండా  
    1990లో భారతదేశ మానవాభివృద్ధి సూచిక విలువ 0.427 నుంచి 2000 సంవత్సరం నాటికి 0.493 కు పెరిగింది. అంటే తక్కువ మానవాభివృద్ధి దేశంగా దాదాపు దశాబ్ద కాలం కొనసాగింది. ఈ విలువ 2012లో 0.600 కు, 2018లో 0.640 కు వృద్ధి చెంది మధ్య స్థాయి మానవాభివృద్ధి దేశాల జాబితాలో చేరింది. చైనా, శ్రీలంక మినహా ఇతర పొరుగు దేశాలు ర్యాంకుల్లో తేడా ఉన్నప్పటికీ మధ్య స్థాయి జాబితాలోనే ఉన్నాయి. 1990 నుంచి మన దేశ సూచిక విలువ దాదాపు 50% పెరగడాన్ని పేదరికంపై విజయంగా పేర్కొనవచ్చు. 1990  2017 మధ్య మన దేశ తలసరి ఆదాయంలో అత్యధికంగా 266.6% వృద్ధి నమోదైంది. 1990 కంటే ప్రస్తుత సగటు జీవనకాలం 11 సంవత్సరాలు, సగటు పాఠశాలలో గడిపే కాలం 4.7 సంవత్సరాలు పెరిగింది. 
    మానవాభివృద్ధి సూచిక ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశం అన్నింట్లో వెనుకబడి ఉంది. ఆర్థిక అసమానతలు అధికమవడం వల్ల 26.8% మానవాభివృద్ధిని కోల్పోయాం. శ్రామిక మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యం కేవలం 27.2% ఉండగా పురుషులది 78.8%. అంటే లింగ సమానత్వంలో మన దేశం ఇంకా వెనుకబడి ఉంది. విద్య, ఆరోగ్య సేవల్లో నాణ్యత లోపించింది. మానవాభివృద్ధిలో రాష్ట్రాల మధ్య అసమానతలు ఉన్నాయి. కేరళ అగ్రస్థానంలో, బిహార్‌ చివరి స్థానంలో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 27వ స్థానంలో ఉండి మధ్య స్థాయి మానవాభివృద్ధి రాష్ట్రంగా కొనసాగుతుంది. 

Posted Date : 11-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌