భారతదేశ చరిత్రలో క్రీ.శ. 1919-47 మధ్యకాలాన్ని గాంధీ యుగంగా పిలుస్తారు. ఈ కాలంలో గాంధీజీ భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టి తనదైన ముద్రవేశారు.
గాంధీజీ 1934లో కాంగ్రెస్ను వీడినా, మరణించే వరకు కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిగా నిలిచారు. 1940లో కొంతకాలం కాంగ్రెస్కు నాయకత్వం వహించినా మరుసటి సంవత్సరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. క్రీ.శ. 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చినప్పటికీ, ఉద్యమాన్ని ప్రారంభించేలోపు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని జైల్లో పెట్టింది.
భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో కీలక భూమిక పోషించి జాతిపితగా ప్రసిద్ధికెక్కిన గాంధీజీ గుజరాత్లోని కథియవార్ సంస్థానంలో పోర్బందర్ అనే గ్రామంలో అక్టోబరు 2, 1869లో జన్మించారు. గాంధీజీ తండ్రి కరమ్ చంద్ పోర్బందర్, రాజ్కోట్లలో దివాన్ (మంత్రి)గా పనిచేసేవారు. గాంధీజీ తల్లి పుత్లీబాయి. గాంధీజీకి 12 ఏళ్ల వయసులో కస్తూర్బాతో వివాహం జరిగింది. గాంధీజీ ఇంగ్లండులో బారిస్టరు చదువు పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు.
1893లో దాదా అబ్దుల్లా అనే వ్యక్తి తరపున న్యాయవాదిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అక్కడ శ్వేత జాతీయుల దురహంకారం వల్ల భారతీయులు ఎదుర్కొంటున్న అవమానాలను చూసి చలించిపోయారు. గాంధీజీ శ్వేతజాతి ప్రభుత్వంపై పోరాడటానికి సత్యాగ్రహమనే కొత్త ఆయుధాన్ని ఉపయోగించారు. గాంధీజీపై ప్రభావం చూపిన వ్యక్తుల్లో ప్రముఖులు... థోరూ, లియో టాల్స్టాయ్, జాన్ రస్కిన్. గాంధీజీ డర్బన్లో ఫీనిక్స్ ఫామ్ను ఏర్పాటు చేశారు. 1903లో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ప్రారంభించారు. 1910లో సత్యాగ్రహంలో పాల్గొనే కుటుంబాలకు అండగా ఉండటానికి టాల్స్టాయ్ ఫామ్ను ప్రారంభించారు. 1914 వరకు దక్షిణాఫ్రికాలో ఉండి, 1915 జనవరిలో భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన వారికి సేవ చేయడానికి ఇంగ్లండులో అంబులెన్స్ యూనిట్ను ఏర్పాటు చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని కైజర్ ఇ హింద్ అనే బంగారు పతకంతో సత్కరించింది.
ఉద్యమాల పరంపర
దక్షిణాఫ్రికాలో గాంధీ ప్రయత్నాల గురించి విద్యావంతులకేగాక, సామాన్య ప్రజలకు కూడా తెలిసింది. దేశంలో సామాన్య ప్రజల పరిస్థితిని తెలుసుకోవడానికి తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటి సభ్యుడిగా భారతదేశమంతటా పర్యటించారు. బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న సమయంలో హోమ్రూల్ ఉద్యమం చేయడం మంచిది కాదని భావించారు. జాతీయవాదుల లక్ష్యాలను సాధించడానికి అహింసాయుత సత్యాగ్రహమే సరైన విధానమని పేర్కొన్నారు. 1917-18 మధ్యకాలంలో మూడు పోరాటాల్లో పాల్గొన్నారు.
చంపారన్ సత్యాగ్రహం: బిహార్లోని చంపారన్లో నీలిమందు రైతులను కష్టాల నుంచి గట్టెక్కించడానికి 1917లో సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. గాంధీజీ సభ్యుడిగా ప్రభుత్వం ఒక విచారణ కమిటీని నియమించింది. విచారణ కమిటీ సిఫార్సుల మేరకు రైతులకు వ్యతిరేకంగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేశారు. ఇది భారతదేశంలో గాంధీజీకి మొదటి రాజకీయ విజయం.
అహ్మదాబాద్ మిల్లు సమ్మె: ప్లేగు బోనస్ నిలుపుదలకు సంబంధించి మిల్లు యజమానులకు, కార్మికులకు మధ్య గొడవ జరిగింది. దీంతో గాంధీజీ అహ్మదాబాద్ వస్త్ర కార్మికుల సంఘాన్ని స్థాపించి, 1918లో నిరాహార దీక్ష చేపట్టారు. చివరకు మిల్లు యాజమాన్యం కార్మికుల వేతనం 35 శాతం పెంచడానికి అంగీకరించింది.
ఖేదా సత్యాగ్రహం: గుజరాత్లోని ఖేదాలో 1918లో కరవు సంభవించింది. రెవెన్యూ కోడ్ ప్రకారం సాధారణ ఉత్పత్తిలో 1/4వ వంతు కంటే తక్కువైతే రైతులు భూమి శిస్తు నుంచి మినహాయింపునకు అర్హులు. అయితే అధికారులు పన్ను చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. గాంధీజీ సత్యాగ్రహం చేపట్టడంతో రైతులను భూమి శిస్తు చెల్లింపు నుంచి మినహాయించారు. ఈ సత్యాగ్రహం సందర్భంగా సర్దార్ పటేల్, ఇందూలాల్ యాజ్ఞక్ లాంటి యువనాయకులు గాంధీజీకి అనుచరులుగా మారారు.
* పై మూడు పోరాటాలలో విజయం సాధించడం ద్వారా గాంధీజీ సామాన్య ప్రజల నమ్మకాన్ని, గౌరవాన్ని పొందగలిగారు. అలాగే వారి బలాలు, బలహీనతలను అర్థం చేసుకోగలిగారు.
రౌలత్ చట్టం - 1919
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జాతీయవాదులు రాజ్యాంగపరమైన సంస్కరణల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని రూపొందించింది. దీన్ని వారు అవమానకరంగా భావించారు. విప్లవాత్మక నేరాల చట్టాన్ని ప్రభుత్వం 1919 ఫిబ్రవరిలో రూపొందించింది. ఈ చట్టాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి సర్ సిడ్నీ రౌలత్ నాయకత్వం వహించడం వల్ల ఈ చట్టం రౌలత్ చట్టంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని భారతీయులు నల్ల చట్టంగా పరిగణించి 1919 ఏప్రిల్ 6న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు.
జలియన్వాలాబాగ్ దురంతం: నిషేధ ఆజ్ఞల గురించి తెలియని సమీప గ్రామాల్లోని ప్రజలు 1919 ఏప్రిల్ 13 బైశాఖి పండగ రోజున సైఫుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ల అరెస్ట్కు నిరసనగా అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ (పార్కు) లో సమావేశమయ్యారు. జనరల్ డయ్యర్ పైశాచిక ప్రవర్తనవల్ల జరిగిన పోలీసు కాల్పుల్లో సుమారు 400 మంది మృతి చెందారు. దీనికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ బిరుదును త్యజించారు. హింసాత్మక పరిస్థితుల పట్ల అప్రమత్తమైన గాంధీజీ ఏప్రిల్ 18, 1919న ఉద్యమాన్ని ఉపసంహరించారు.
సహాయ నిరాకరణ ఉద్యమం: గాంధీజీ 1919-22 మధ్య ఖిలాఫత్, సహాయ నిరాకరణ ఉద్యమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ రెండు ఉద్యమాలు ప్రారంభించడానికి కారణాలు వేరైనా, అహింసాయుత సహాయ నిరాకరణ అనే ఉమ్మడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఖిలాఫత్ ఉద్యమానికి, భారత రాజకీయాలకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఇదే తక్షణ కారణం కావడం విశేషం.
* 1919 నవంబరులో ఢిల్లీలో జరిగిన అఖిల భారత ఖిలాఫత్ సమావేశంలో బ్రిటిష్ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చారు. గాంధీజీ ఖిలాఫత్ సమస్యపై సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ప్రారంభించాలని భావించినా, మతపరమైన సమస్యపై ముస్లిం నాయకులతో పొత్తుకలిగి ఉండటాన్ని తిలక్ తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు గాంధీజీ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆమోదాన్ని పొందడంలో సఫలీకృతులయ్యారు. ఖిలాఫత్ ఉద్యమాన్ని బలపరుస్తూ గాంధీజీ 1920 ఆగస్టు 31న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.
* కాంగ్రెస్ సెప్టెంబరు 1920లో కోల్కతాలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి అంగీకరించింది. 1920 డిసెంబరులో జరిగిన నాగ్పుర్ సమావేశంలో కాంగ్రెస్ ఈ ఉద్యమానికి ఆమోదముద్ర వేసింది. ఇదే సమావేశంలో కాంగ్రెస్ కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించింది. స్వరాజ్య సాధనే తన లక్ష్యమని పునరుద్ఘాటించింది.
ఉద్యమ లక్ష్యాలు, కార్యక్రమాలు
లక్ష్యాలు: రౌలత్ చట్టాన్ని రద్దు చేసి, జలియన్ వాలాబాగ్ దురంతంపై బ్రిటిష్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేయాలి.
* బ్రిటిష్ ప్రభుత్వం టర్కీ పట్ల ఉదార వైఖరిని అవలంబించాలి. టర్కీ సుల్తానుకు ఖలీఫా పదవిని తిరిగి కట్టబెట్టాలి.
* స్వరాజ్య డిమాండును అంగీకరించాలి.
నకారాత్మక కార్యక్రమాలు: బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, గౌరవ పదవులను భారతీయులు వెనక్కి ఇచ్చివేయాలి.
* ప్రభుత్వ దర్బారుకు, అధికార ఉత్సవాలకు ఆహ్వానాలను తిరస్కరించాలి.
* ప్రభుత్వ నియంత్రణలోని పాఠశాలలు, కళాశాలలను విద్యార్ధులు బహిష్కరించాలి.
* బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించాలి.
* మెసపటోమియాలో పనిచేయడానికి అన్నివర్గాల వారు తిరస్కరించాలి. ¤ రాష్ట్ర, కేంద్ర శాసన సభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించాలి. ¤ విదేశీ వస్తువులను బహిష్కరించాలి. ¤ స్థానిక సంస్థలలోని నామినేటెడ్ స్థానాలకు భారతీయులు రాజీనామా చేయాలి.
సకారాత్మక కార్యక్రమాలు
* ఆచార్య నరేంద్రదేవ్, చిత్తరంజన్ దాస్, లాలా లజపతిరాయ్, జాకీర్ హుస్సేన్, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుల ఆధ్వర్యంలో జాతీయ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి.
* తిలక్ స్వరాజ్య నిధికి ఆరునెలలలోగా కోటి రూపాయలు విరాళంగా సేకరించారు.
* స్వదేశీ పరిశ్రమల అభివృద్ధికి ప్రయత్నాలు జరిగాయి. 1921 జులైలో అలీ సోదరులు బ్రిటిష్ సైన్యం నుంచి ముస్లింలు వైదొలగాలని పిలుపునిచ్చారు.
* హిందూ - ముస్లింల మధ్య సఖ్యతను పెంపొందించడం, స్త్రీల అభ్యున్నతికి కృషి చేయడం, అంటరానితనాన్ని నిర్మూలించడం.
* దేశంలోని విశిష్ట వ్యక్తులు లాభదాయకమైన న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఖాదీ స్వాతంత్య్రానికి చిహ్నంగా మారింది.
* వేల్స్ యువరాజు పర్యటనను బహిష్కరించాలని నిర్ణయించారు. బొంబాయిలో నవంబరు 17, 1921న అతని పర్యటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో రైతులు ప్రభుత్వానికి భూమి శిస్తు చెల్లించడం ఆపేశారు.
* 1921 మే లో గాంధీజీ, వైస్రాయి లార్డ్ రీడింగ్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 1922 ఫిబ్రవరి 1న గాంధీజీ బార్డోలి నుంచి శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
చౌరీచౌరా సంఘటన
* ఉద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో 1922 ఫిబ్రవరి 5న ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చౌరీచౌరా గ్రామంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామం గోరఖ్పూర్ నుంచి 35 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో ఊరేగింపుగా వెళ్తున్న రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులను స్టేషనులో బంధించి నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవదహనమయ్యారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమాన్ని నిలిపేశారు.
ఉప్పు సత్యాగ్రహం
* 1929లో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించారు. దాని ప్రకారం గాంధీజీ నాయకత్వంలో మరో ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు.
* గాంధీ 11 అంశాలతో అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్కు ఒక వినతిపత్రాన్ని ఇచ్చారు. కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. దీంతో గాంధీజీ 1930, మార్చిలో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. 193034 మధ్య ఈ ఉద్యమం కొనసాగింది.
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం
* బ్రిటిష్ ప్రభుత్వం 1930లో లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమయంలోనే భారత్లో గాంధీజీ ఆధ్వర్యంలో ఉప్పు సత్యాగ్రహం కొనసాగుతోంది.
* భారత జాతీయ కాంగ్రెస్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. దీంతో సమావేశం విఫలమైనట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని పేర్కొంది.
* రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించేందుకు అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ను గాంధీ వద్దకు పంపారు.
* వీరి మధ్య 1931, మార్చి 5న ఓ ఒప్పందం కుదిరింది. దీన్నే ‘గాంధీ - ఇర్విన్ ఒడంబడిక’ అంటారు.
* దీని ప్రకారం అంతవరకు అరెస్టయిన సత్యాగ్రహ ఉద్యమకారులను విడిచిపెట్టేందుకు, గాంధీజీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకరించారు.
రెండో రౌండ్ టేబుల్ సమావేశం
* ‘గాంధీ-ఇర్విన్ ఒప్పందం’ ప్రకారం గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని తాత్కాలికంగా నిలిపి, 1931, సెప్టెంబరులో లండన్లో జరిగిన రెండో రౌండ్టేబుల్ సమావేశానికి వెళ్లారు.
* భారత జాతీయ కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా గాంధీ, వ్యక్తిగత హోదాలో సరోజినీ నాయుడు, మదన్మోహన్ మాలవ్య సమావేశంలో పాల్గొన్నారు.
* ఈ సమావేశం నాటికి లార్డ్ వెల్లింగ్టన్ భారత వైస్రాయ్గా ఉన్నారు.
* హిందూ-ముస్లిం ఐక్యత, అంటరానితనం నిర్మూలన గురించి గాంధీజీ ఈ సమావేశంలో ప్రసంగించారు.
* దళితులు, ముస్లింలు, ఆంగ్లో-ఇండియన్లు తమకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని ఆంగ్ల ప్రభుత్వాన్ని కోరారు. దీంతో గాంధీజీ రెండో రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించారు. తిరిగి భారతదేశానికి వచ్చి ఉప్పు సత్యాగ్రహాన్ని పునః ప్రారంభించారు.
* రెండో రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైందని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. 1932లో మూడో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తామని పేర్కొంది.
* గాంధీజీ నిర్వహిస్తున్న శాసనోల్లంఘన ఉద్యమాన్ని, కాంగ్రెస్ పార్టీ చర్యలను బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
* అప్పటి వైస్రాయ్ వెల్లింగ్టన్ గాంధీజీ రాసిన లేఖకు సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
* కాంగ్రెస్ పార్టీ 1932, జనవరి 4 నుంచి శాసనోల్లంఘన ఉద్యమాన్ని (ఉప్పు సత్యాగ్రహం) తిరిగి ప్రారంభించాలని తీర్మానించింది.
* బ్రిటిష్ ప్రభుత్వం జనవరి 3న గాంధీజీని, ఇతర నాయకులను నిర్బంధించింది. నాయకులు జైళ్లకు వెళ్లినా ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్ని సత్యాగ్రహాన్ని కొనసాగించారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయం తగ్గింది.
కమ్యూనల్ అవార్డు
* 1932, ఆగస్టు 16న ఇంగ్లండ్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ బ్రిటన్ పార్లమెంట్లో ‘కమ్యూనల్ అవార్డు’ను ప్రకటించారు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, భారతీయ క్రైస్తవులు, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు.
* ఈ సమయంలో గాంధీజీ పూనాలోని ఎరవాడ జైల్లో ఉన్నారు.
పూనా ఒప్పందం (1932)
కమ్యూనల్ అవార్డును నిరసిస్తూ గాంధీ 1932, సెప్టెంబరు 20న పూనాలోని ఎరవాడ జైల్లో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. కానీ ఆంగ్ల ప్రభుత్వం స్పందించలేదు.ఈ సమయంలో గాంధీ, అంబేడ్కర్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే ‘పూనా ఒడంబడిక’ అంటారు. దీని ప్రకారం రెండంచెల్లో దళిత ప్రతినిధులను ఎన్నుకోవడానికి, కమ్యూనల్ అవార్డు ద్వారా కేటాయించిన 71 స్థానాలను 148కి పెంచడానికి అంగీకారం కుదిరింది. 1932, సెప్టెంబరు 26న గాంధీజీ ఆమరణ నిరాహారదీక్షను విరమించారు.
మూడో రౌండ్ టేబుల్ సమావేశం
* ఉప్పు సత్యాగ్రహం కొనసాగుతుండగానే బ్రిటిష్ ప్రభుత్వం 1932, నవంబరులో లండన్లో మూడో రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది.
ఉద్యమకారుల అణచివేత
* గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన ఉప్పు సత్యాగ్రహం కొనసాగుతూనే ఉంది. 1933, జనవరి 26న స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకున్నారు. (1930, జనవరి 26న తొలి స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు.)
* ఈ సమయంలోనే దేశంలో అనేక విప్లవాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. కాకినాడ బాంబుకేసులో ప్రతివాది భయంకరాచారితో పాటు 9 మందిపై కేసులు పెట్టారు.
* ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచి వేసేందుకు ప్రయత్నించింది. ఉద్యమకారుల్ని అరెస్టు చేయడం, లాఠీచార్జ్ జరపడం, వారి ఆస్తులను జప్తుచేయడం, పత్రికలపై ఆంక్షలు విధించడం, బహిరంగ సమావేశాలను నిషేధించడం లాంటి చర్యలకు పాల్పడింది.
* అప్పటి ఉద్యమ తీవ్రతను, ఆంగ్ల ప్రభుత్వ అణచివేత చర్యలను పరిశీలించిన ప్రముఖ తత్త్వవేత్త బెట్రాండ్ రస్సెల్ ‘భారతదేశంలోని ఆంగ్ల ప్రభుత్వం జర్మనీలోని నాజీల దురాగతాలకు మించి చేస్తోంది’ అని పేర్కొన్నారు.
* 1934, మేలో ఉప్పు సత్యాగ్రహాన్ని నిలిపేస్తున్నట్లు గాంధీజీ ప్రకటించారు. సంపూర్ణ స్వరాజ్య సాధనే లక్ష్యంగా గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపారు. లక్ష్యం నెరవేరకుండానే ఇది నిలిచిపోయింది. ఈ ఉద్యమాన్ని భారత జాతీయోద్యమంలో ముఖ్య ఘట్టంగా చెప్పొచ్చు.
* 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తిగా నిలిచింది.
క్విట్ ఇండియా
* భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం 1937లో మనదేశంలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, ముస్లింలీగ్ల నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
* ప్రభుత్వాల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, ముస్లింలీగ్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కానీ గాంధీజీ కృషి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తలేదు.
* 1939లో రెండో ప్రపంచయుద్ధం మొదలైంది. బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధం ప్రారంభం నుంచి భారతీయుల పట్ల, భారత జాతీయోద్యమం పట్ల అసంబద్ధ, నియంతృత్వ వైఖరిని ప్రదర్శించింది. ఇది క్విట్ ఇండియా ఉద్యమానికి దారితీసింది.
* అప్పటి భారత వైస్రాయ్ లిన్లిత్గో ‘భారతదేశం బ్రిటన్ తరఫున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుంది’ అని ప్రకటించారు. దీంతో శత్రుదేశం జపాన్ భారత్పై బాంబులు వేసింది.
* భారత జాతీయ కాంగ్రెస్ను సంప్రదించకుండానే, యుద్ధంలో భాగస్వామిని చేయడంతో 1939, అక్టోబరు 8న కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. ఈ రోజునే ముస్లింలీగ్ విమోచనదినంగా పాటించింది. దీని ద్వారా కాంగ్రెస్, ముస్లింలీగ్ల మధ్య అభిప్రాయ భేదాలు స్పష్టమయ్యాయి.
* రెండో ప్రపంచయుద్ధంలో ఇంగ్లండ్ పరిస్థితి దిగజారడం, నియంతృత్వ నాజీలు విజయం సాధిస్తే వచ్చే ప్రమాదాన్ని భారత జాతీయ కాంగ్రెస్ గమనించింది.
* 1940లో కొన్ని షరతులతో ఇంగ్లండ్కు సహకరించడానికి తీర్మానించింది. దీనికి ప్రతిగా 1940, ఆగస్టు 8న అప్పటి వైస్రాయ్ లిన్లిత్గో ‘ఆగస్టు ప్రతిపాదనలు’ చేశారు. దీని ప్రకారం యుద్ధానంతరం డొమీనియన్ ప్రతిపత్తి ఇస్తామని ప్రకటించారు. సంపూర్ణ స్వాతంత్య్ర ప్రస్తావన లేకపోవడంతో కాంగ్రెస్ దీన్ని తిరస్కరించింది.
ఉద్యమం తీవ్రతరం
* క్రిప్స్ రాయబారం విఫలమవడంతో 1942, ఆగస్టు 8న గాంధీజీ 'Do or Die' (చేయండి లేదా మరణించండి) నినాదంతో క్విట్ ఇండియా (భారతదేశాన్ని వదిలిపోండి) ఉద్యమాన్ని ప్రారంభించారు.
* బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు 9న గాంధీతో పాటు అనేకమందిని నిర్బంధించింది. అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రాలోని తెనాలి రైల్వేస్టేషన్పై దాడి ఘటనలో పోలీసు కాల్పులు జరపడంతో ఏడుగురు పౌరులు మరణించారు.
* బాలియా, తామ్లూక్, సతారా లాంటి ప్రాంతాల్లో పోటీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. రామ్ మనోహర్ లోహియా, ఉషా మోహతా లాంటివారు బాందేల్ (ముంబై) నుంచి రహస్యంగా రేడియో ప్రసారాలు చేశారు. కమ్యూనిస్టులు, ముస్లింలీగ్ నాయకులు ఉద్యమాన్ని వ్యతిరేకించారు.
* భారతీయుల ప్రతిఘటన విధానాల వల్ల ఆంగ్లేయులు భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు అంగీకరించారు.
* రాజగోపాలాచారి ఫార్ములా (రాజాజీ ప్రణాళిక) 1944, వేవెల్ ప్రణాళిక 1945, మంత్రిత్రయ రాయబారం1946 హిందూ-ముస్లిం విభేదాలను పరిష్కరించలేదు.
* 1946లో జరిగిన హిందూ-ముస్లిం మత ఘర్షణలు గాంధీని బాధించాయి.
* 1947లో మౌంట్ బాటెన్ ప్రణాళిక ప్రకారం మనదేశం భారత్, పాకిస్థాన్గా విడిపోయింది.
* 1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది.
* 1948, జనవరి 30న దిల్లీలోని బిర్లామందిర్లో నాథూరం గాడ్సే జరిపిన కాల్పుల్లో తుదిశ్వాస విడిచారు.
దండియాత్ర
* 1930, మార్చి 12న గాంధీజీ 78 మందితో సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరారు. ఏప్రిల్ 6న దండి గ్రామాన్ని చేరారు.
* అక్కడ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి ఉప్పును తయారు చేశారు. అందుకే దీన్ని శాసనోల్లంఘన ఉద్యమంగా పేర్కొంటారు.
* ఈ పాదయాత్ర మొత్తం 24 రోజుల పాటు కొనసాగింది.
* దేశవ్యాప్తంగా కొనసాగిన ఉప్పు సత్యాగ్రహానికి ఆంధ్రాలో కొండా వెంకటప్పయ్య, తమిళనాడులో సి.రాజగోపాలాచారి, కేరళలో కేలప్పన్, వాయవ్య సరిహద్దు రాష్ట్రం (పెషావర్)లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మొదలైన వారు నాయకత్వం వహించారు.
* దర్శన్ ఉప్పు కొటారు వద్ద సరోజినీ నాయుడు నాయకత్వంలో ఉద్యమం జరిగింది. ఇదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసింది.
క్రిప్స్ రాయబారం (1942)
* రెండో ప్రపంచయుద్ధంలో మిత్రరాజ్యాల ఓటమి పాలయ్యాయి. అప్పటి చైనా అధినేత చాంగ్కైషేక్, అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ సూచనలతో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది.
* సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలో 1942, మార్చి 11న ఒక కమిషన్ను నియమించింది. ఇది 1942, మార్చి 23న దిల్లీలో అన్ని రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరిపింది. ముఖ్యంగా గాంధీ - క్రిప్స్ల మధ్య కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి.
* ‘యుద్ధానంతరం డొమీనియన్ ప్రతిపత్తి ఇస్తామని, రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని, అంతవరకు భారతదేశ రక్షణ, సైన్యంపై నియంత్రణ ఆంగ్ల ప్రభుత్వానికే ఉంటాయని’ క్రిప్స్ ప్రతిపాదించారు.
* భారతీయులు ఈ ప్రతిపాదనలను అంగీకరించలేదు. ‘యుద్ధానికి ముందే స్వాతంత్య్రం ఇవ్వాలని, రక్షణ, సైన్యంపై నియంత్రణ భారత మంత్రిమండలికే ఉండాలని’ గాంధీజీ డిమాండ్ చేశారు.
* బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను అంగీకరించలేదు. అందుకే గాంధీజీ క్రిప్స్ రాయబారాన్ని ‘దివాలా తీసే బ్యాంక్ పేరుమీద రాబోయే తేదీ వేసిఇచ్చిన చెక్కు’ (Post dated cheque)గా పేర్కొన్నారు.
* ‘భారతదేశానికి మీరు చేయగలిగేది ఇదే అయితే వెంటనే బయల్దేరి ఇంటికి వెళ్లండి’ అని వ్యాఖ్యానించారు.