‣ నిపుణుల సూచనలు
‣ ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 92 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 13 నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. అభ్యర్థులు నవంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష అయిన ప్రిలిమినరీని డిసెంబర్ 18న నిర్వహించబోతున్నారు. ఈ పరీక్ష సమగ్ర సన్నద్ధతకు ఉపకరించే మెలకువలు ఇవిగో..!
జనరల్ స్టడీస్లో సాధారణంగా ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం వరకే చరిత్ర పరంగా సిలబస్ ఉంటుంది. ఈ పరీక్షకు ఇచ్చిన సిలబస్లో ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ చరిత్రలు ఉన్నాయి. ఈ సూక్ష్మమైన తేడా గమనించటం చాలా అవసరం!
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను మార్చి 2023లో నిర్వహించే అవకాశాలున్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో ప్రిలిమ్స్ తర్వాత మూడు నెలల వ్యవధిలో మెయిన్స్కు సన్నద్ధమవటం సాధ్యమా అనే సందిగ్ధతతో అభ్యర్థులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్లో రెండు పేపర్లుంటాయి. మొత్తం మార్కులు 240.
పేపర్ 1
సిలబస్లో భారతదేశ చరిత్ర సంస్కృతి, భారత రాజ్యాంగం, గవర్నెన్స్, అంతర్జాతీయ సంబంధాలు, భారతదేశ- ప్రాంతీయ భౌగోళిక అంశాలు, భారతదేశ- ప్రాంతీయ ఆర్థిక అంశాలను నిర్దేశించారు. పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో ఉండే సిలబస్కు చాలా అదనపు అంశాలు జోడించడం వల్ల అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. పైగా సమయం కూడా తక్కువగా ఉంది.
‣ జనరల్ స్టడీస్లో సాధారణంగా ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం వరకే చరిత్ర పరంగా సిలబస్ ఉంటుంది. ఈ పరీక్షకు ఇచ్చిన సిలబస్లో ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ చరిత్రలు ఉన్నాయి. ఈ సూక్ష్మమైన తేడా గమనించకపోతే సీనియర్ అభ్యర్థులు కూడా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. అదేవిధంగా ఒక చాప్టర్లో ఏకంగా దక్షిణ భారతదేశ చరిత్రను కూడా చేర్చడం వల్ల ఆంధ్రప్రదేశ్ చారిత్రక అంశాలను కూడా చదవాల్సివుంటుంది.
‣ జనరల్ స్టడీస్లో పాలిటీ కింద రాజ్యాంగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పరీక్షకు సంబంధించిన అదనపు భారమేమిటంటే గవర్నెన్స్తో పాటు అంతర్జాతీయ సంబంధాలను కూడా చదవాల్సి రావటం.
‣ సాధారణంగా భారతదేశ- ప్రాంతీయ భౌగోళిక అంశాలు ఎక్కువ సందర్భాల్లో జనరల్ స్టడీస్లో ఉంటాయి. పేపర్-1లో సౌర కుటుంబంతో పాటు మరికొన్ని ప్రపంచ విషయాలు కూడా చేర్చారు.
‣ జీఎస్లో సాధారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ సిలబస్గా ఉంటుంది. కానీ ఈ పరీక్షలో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ కూడా సిలబస్గా చేర్చడంతో అభ్యర్థులకు లభ్యమవుతున్న సమయం దృష్ట్యా సంకట పరిస్థితి ఏర్పడుతోంది.
ఇలా చదవండి
సీనియర్ అభ్యర్థులు ఇంత సిలబస్ను ఈ తక్కువ సమయంలో కొంతవరకు ఎదుర్కొంటారు. కానీ కొత్తవాళ్లకు అంత సాధ్యమయ్యే అవకాశం లేదు. అయితే ఇది అర్హత పరీక్ష కాబట్టి వీరు నిర్దిష్ట విభాగాలను ఎంచుకుని చదివితే ఫలితం ఉంటుంది.
‣ చారిత్రక విభాగంలో ప్రాచీన ఆధునిక చరిత్రలకు పరిమితమవ్వటం మంచిది. దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రముఖ రాజవంశాలకు పరిమితమైతే తక్కువ కాలంలో ప్రిపేర్ అవటానికి అవకాశం ఉంటుంది.
‣ గవర్నెన్స్, అంతర్జాతీయ సంబంధాలకు ప్రస్తుతం ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఉత్తమం. రాజ్యాంగ అంశాలను క్షుణ్ణంగా చదవటం సముచితం.
‣ భారతదేశ భౌగోళిక అంశాలపై దృష్టి పెడుతూ.. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలకు సమయం కేటాయిస్తే ప్రస్తుత పరిస్థితులకు సరిపోతుంది.
‣ భారతదేశ ఆర్థిక అంశాలన్నీ చదవకుండా, సర్వే 2021-22, బడ్జెట్ 2022-23లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆపై ఆర్థిక సంస్కరణల అనంతరం వచ్చిన నిర్మాణాత్మక మార్పులపై దృష్టి పెట్టండి. బ్యాంకింగ్, విత్తవ్యవస్థ, ఎగుమతులు- దిగుమతులు మొదలైన వాటిపై స్థూల అవగాహన పెంచుకోండి. సాంఘిక ఆర్థిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, జనాభా మొదలైన అంశాలపై కూడా సాధారణ స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. వాటిపైనా దృష్టి నిలపండి. ఆంధ్రప్రదేశ్ నవరత్నాలు, సర్వే 2021-22, బడ్జెట్ 2022-23 మొదలైనవాటిపై అవగాహన పెంచుకోవాలి.
ఒక్కొక్క విభాగం నుంచి 30 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థులు సగటు కఠినత్వ స్థాయితో విస్తృతంగా చదివితే అధిక ప్రయోజనాలు సమకూరే అవకాశం ఉంది.
పేపర్ 2
ఈ పేపర్లో మొత్తం మూడు విభాగాలు ఇచ్చారు.
‣ మెంటల్, సైకలాజికల్ ఎబిలిటీస్
‣ సైన్స్ అండ్ టెక్నాలజీ
‣ కరెంట్ అఫైర్స్.
ఈ పేపర్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ప్రిలిమ్స్లో అర్హులు అయ్యేందుకు సులభ మార్గం ఏర్పడుతుంది. పేపర్-1లోని సబ్జెక్టులన్నీ విస్తృతితో ఉంటాయి. కానీ, పేపర్ 2 లోని సబ్జెక్టులు నిర్దిష్టంగా ఉన్నాయి. స్కోరింగ్ కూడా మెరుగ్గా సాధించవచ్చు.
‣ ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నేపథ్యం ఉన్న అభ్యర్థులు పేపర్-1 లోని విషయాలపై పట్టు సాధించేందుకు చాలా కష్టపడాలి. అదే సమయంలో తక్కువ శ్రమతో పేపర్-2 లోని అంశాలపై అవగాహన సాధించడమే కాకుండా మంచి స్కోరింగ్ కూడా రాబట్టవచ్చు.
‣ ఇటీవలి పోటీ పరీక్షల్లో అత్యధిక శాతం బీటెక్ అభ్యర్థులు ఉంటున్నారు. మెంటల్, సైకలాజికల్ ఎబిలిటీస్లో 40 మార్కులకు 30-35 మార్కులు తేలిగ్గా సాధించవచ్చు. ప్రతిరోజూ ఒక గంట సమయం సాధనకు వినియోగించి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు.
‣ టెకీలకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సులభమే. కొద్దిపాటి ప్రయత్నంతో 30 మార్కులు ఈ విభాగంలో సాధించవచ్చు.
‣ ఇక కరెంట్ అఫైర్స్ విభాగంపై ప్రతిరోజూ గంట సమయాన్ని కేటాయిస్తే 30- 35 మార్కులు సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
హేతుబద్ధంగా సన్నద్ధత ఉంటే ఈ పేపర్ నుంచి 100 మార్కుల వరకు సాధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిర్దిష్ట పరిస్థితి పేపర్-1 లో కనిపించదు.
ఆర్ట్స్ సబ్జెక్టుల నేపథ్యమున్న అభ్యర్థులు ఈ పేపర్లోని అంశాలపై అదనపు సమయాన్ని వెచ్చించడం ద్వారా మాత్రమే మెయిన్స్కు అర్హులయ్యే అవకాశం ఉంటుంది.
ఎన్ని గంటలు చదివామన్నది కాదు- హేతుబద్ధంగా ప్రిపేర్ అయ్యామా లేదా అన్నదే ముఖ్యం. మెలకువలను పాటిస్తే గ్రూప్-1 మెయిన్స్కి అర్హత సాధించడం సులభమే...ఇంత తక్కువ సమయంలో కూడా!
ఇవి గమనించండి
ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (స్క్రీనింగ్), మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఆధారంగా.
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. డివిజనల్/ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు బీఈ (ఫైర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్) ఖాళీలకు 21-30 ఏళ్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ (మెన్) ఖాళీలకు 18-30 ఏళ్లు, డివిజనల్/ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఖాళీలకు 21-28 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.11.2022.
ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్): 18.12.2022.
మెయిన్స్- రాత పరీక్ష (డిస్క్రిప్టివ్): మార్చి ద్వితీయార్థం, 2023.
వెబ్సైట్: https://psc.ap.gov.in/
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సైన్స్తో సైకాలజీ.. ఫిజిక్స్తో మ్యూజిక్!
‣ విదేశీ విద్యకు కొన్ని నైపుణ్యాలు