Post your question

 

    Asked By: సాయిప్రకాశ్‌

    Ans:

    సోషియాలజీ, సోషల్‌ వర్క్‌ల్లో రెండు వేర్వేరు పీజీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. సోషల్‌ వర్క్‌లో పీజీ చేయాలంటే ఎంఎస్‌డబ్ల్యూ (మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌),  సోషియాలజీలో పీజీ చేయాలంటే ఎంఏ సోషియాలజీ చదవాలి. సాధారణంగా సోషియాలజీ ప్రోగ్రామ్‌లో సమాజం, కుటుంబం, వివాహ వ్యవస్థ గురించి ఉంటుంది. సామాజిక సంబంధాలు, సామాజిక ఆలోచనా విధానం, సంస్కృతి, అభివృద్ధి సామాజిక కోణం, కులం, మతం, పట్టణీకరణ, వలసలు, వివాహం, కుటుంబం, సామాజిక పరిశోధన లాంటి అంశాలుంటాయి. ఇక సోషల్‌ వర్క్‌ విషయానికొస్తే- కమ్యూనిటీ వర్క్, చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్, లేబర్‌ వెల్ఫేర్, అంటరానితనం, పునరావాసం, గ్రామీణాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ లాంటి అంశాలు భాగం. సోషియాలజీలో పీజీ చేసినవారు అధ్యాపకులుగా, పరిశోధకులుగా, సోషల్‌ వర్కర్లుగా స్థిరపడవచ్చు. సోషల్‌ వర్క్‌లో పీజీ చేసినవారు సోషల్‌ వర్కర్, ఫామిలీ కౌన్సెలర్, హాస్పిటల్‌ కౌన్సెలర్, డీఅడిక్షన్‌ కౌన్సెలర్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ హోదాల్లో విధులు నిర్వహించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  

     

    Asked By: శేషులత

    Ans:

    పదో తరగతి తరువాత మీరు ఇంటర్మీడియట్‌ చదవలేదనేది యధార్థం. దాని గురించి మీరు ఎక్కువగా బాధపడాల్సిన పని లేదు. యూజీసీ నిబంధనల ప్రకారం మీరు కరస్పాండెన్స్‌ సిస్టం ద్వారా డిగ్రీ చదివి ఉంటే, ఇంటర్‌ చదవలేదని కంగారు పడకండి. ఒకవేళ ఇంటర్వ్యూల్లో ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ అడిగితే, నిజాయతీగా ఇంటర్‌ చదవలేదని చెప్పండి. అలా చదవలేకపోవడానికి కారణాలను కూడా ధైర్యంగా చెప్పగలగాలి. ఏ ఇంటర్వ్యూలో అయినా అబద్ధాలు చెప్పకుండా విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, సానుకూల దృక్పథం ఉన్నవారిని విజయం వరించే అవకాశాలు ఎక్కువ. ఏదైనా ఉద్యోగ ప్రకటనలో ఇంటర్మీడియట్‌ కచ్చితంగా చదివి ఉండాలి అన్న నిబంధన ఉంటే తప్ప, డిగ్రీ/ పీజీ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాలకూ మీరు అర్హులే. మీకు ఇంటర్‌ సర్టిఫికెట్‌ లేకపోవడం వల్ల కొంత నష్టం కలుగుతుందని భావిస్తే, మీ నైపుణ్యాలతో, విషయ పరిజ్ఞానంతో, నిజాయతీతో ఇంటర్వ్యూలో మెరుగైన ప్రతిభ చూపండి. మారుతున్న పరిస్థితుల్లో సాప్ట్‌వేర్‌ సంస్థ లైనా, ఇతర ప్రైవేటు నియామక సంస్థలైనా పేపర్‌ సర్టిఫికెట్‌ల కంటే రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో అభ్యర్థి చూపే ప్రతిభకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంకా మీకు ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ అవసరం అనుకొంటే, ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా కానీ, ప్రైవేటుగా కానీ ఇంటర్‌ పూర్తి చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: శార్వాణి

    Ans:

    మీ స్నేహితురాలు మూడు పీజీలు ఏ ఉద్దేశంతో చేసిందో తననే అడిగి తెలుసుకోండి. సాధారణంగా చాలామంది విద్యార్థులు అభిరుచి కోసమో, మెరుగైన ఉపాధి అవకాశాల కోసమో, యూనివర్సిటీ/ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలు రాయడం కోసమో, ఉద్యోగప్రయత్నాల్లో విఫలమై సొంతూరికి వెళ్లలేకో, స్నేహితుల ప్రోద్బలంతోనో ఒక పీజీ తరువాత మరో పీజీ చదువుతూ ఉంటారు. మీ స్నేహితురాలు ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం చేసింది కాబట్టి ఏదైనా జూనియర్‌/డిగ్రీ కాలేజీలో రెండు భాషలు బోధిస్తూ మెరుగైన వేతనం పొందే అవకాశం ఉంది. ఈ రెండు సబ్జెక్టుల్లో ఉద్యోగావకాశాలు లేకపోతే పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టును కూడా బోధించే అవకాశం ఉంది. ఒకవేళ పీజీ తరువాత పీహెచ్‌డీ చేయాలనుకొంటే, ఈ మూడు సబ్జెక్టుల్లో తనకు నచ్చినదానిలో చేయొచ్చు. కానీ రెండేళ్లలో పూర్తిచేయాల్సిన పీజీని ఆరు సంవత్సరాలు చదవడం వల్ల ఉద్యోగం పొందడం ఆలస్యం కావొచ్చు. బోధన రంగంలో ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ‘మూడు పీజీలు ఎందుకు చేశారు?’ అని అడిగితే సరైన సమాధానం చెప్పడం కొంత కష్టం అవుతుంది.
    డిగ్రీ తరువాత పీజీ చేసినట్లు పీహెచ్‌డీ కోర్సు అందరూ చేయగలిగేది కాదు. పరిశోధనపై చాలా ఇష్టం, సంబంధిత మెలకువలు, బోధన పట్ల ఆసక్తి, కనీసం నాలుగు సంవత్సరాలపాటు మరే ఆలోచనా లేకుండా దీన్నే కొనసాగించగల ఓపిక, అంతర్జాతీయ ప్రమాణాలతో థీసిస్‌/ పరిశోధన పత్రాలను రాయగలిగే నైపుణ్యాలుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా సందర్భాల్లో పీహెచ్‌డీ చేసినవారు మెరుగైన  ఉద్యోగం పొందలేక 15,000 నుంచి 25,000 రూపాయిల నెల వేతనంతో  జూనియర్‌/డిగ్రీ కళాశాలల్లో అసంతృప్తితో పనిచేస్తున్నారు. కొద్దిమంది మాత్రమే యూనివర్సిటీల్లో/ ప్రయోగశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ సైంటిస్ట్‌గా దేశ విదేశాల్లో మెరుగైన ఉద్యోగాలు చేస్తున్నారు. బోధన రంగంపై ఆసక్తి ఉంటే పీజీ తరువాత నెట్‌/స్లెట్‌లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కూడా స్థిరపడొచ్చు. చివరిగా మూడు పీజీలు, పీహెచ్‌డీల్లో ఏది ప్రయోజనకరం అనేది ఆయా విద్యార్ధుల ఆసక్తి, ఆశయాలను బట్టి ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సాయియాదవ్‌

    Ans:

    మీరు రెండు సంవత్సరాల క్రితమే బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశారు కాబట్టి మీ వయసు దాదాపుగా 23/24 సంవత్సరాలు ఉండొచ్చు. గత రెండు సంవత్సరాలుగా మీరు కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులకు దూరంగా ఉండుంటారు. మరో రెండు సంవత్సరాలు మీరు పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లోనే ఉంటే, కంప్యూటర్‌ సైన్స్‌కు ఇంకా దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఈ రెండేళ్లలో ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోతే ఆ తరువాత మరో రెండేళ్లు ఎంసీఏ చదవాల్సి ఉంటుంది. అప్పుడు మీ వయసు 27/28 సంవత్సరాలు అవ్వొచ్చు. అలా కాకుండా, ఇప్పుడే మీరు ఎంసీఏలో చేరితే ప్రభుత్వ ఉద్యోగాల సన్నద్ధతకు దూరం  అవుతారు.
    నిర్ణయం తీసుకునేముందు కింది విషయాలను పరిగణనలోకి తీసుకోండి. మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమా? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమా? గత రెండేళ్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ప్రభుత్వ ఉద్యోగం సాధించగలనని గట్టి నమ్మకం ఉందా? కంప్యూటర్‌ సైన్స్‌కి సంబంధించిన సబ్జెక్టులపై, ప్రోగ్రామింగ్‌పై మీకెంత పట్టు ఉంది? ఎంసీఏ సీటును ఎన్‌ఐటీ, సెంట్రల్‌ యూనివర్సిటీ లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో పొందగలననే నమ్మకం ఉందా? ఎంసీఏ చదివితే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చే అవకాశాలు అధికం. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండటంవల్ల కొలువు వస్తుందన్న గ్యారంటీ తక్కువ. ఎంసీఏ చదువుతూ, ప్రభుత్వ ఉద్యోగ సన్నద్ధతను కూడా సమన్వయం చేయగల సామర్థ్యం మీకుందా? ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కృష్ణప్రసాద్‌

    Ans:

    మంచి కెరియర్‌ అంటే.. ఎక్కువ డబ్బూ, పేరూ సంపాదించేది అనే ఆలోచన చాలామందిలో స్థిరపడిపోయింది. టీచర్, డాక్టర్, లాయర్, ఇంజినీర్‌ లాంటి వృత్తి ఉద్యోగాలు చేసేవారికి సేవ మొదటి స్థానంలో, సంతృప్తి రెండో స్థానంలో, డబ్బు చివరి స్థానంలో ఉండాలి. ఇలాంటి వృత్తిలో ఉండేవారు ఎదుటివారి సమస్యలు పరిష్కరిస్తూ, వారి సంతోషానికి కారణమవుతూ కెరియర్‌ కొనసాగిస్తే ఈ రెండూ వచ్చే అవకాశాలుంటాయి.
    సివిల్, క్రిమినల్‌ రెండు రంగాలూ చాలా మంచివే. కానీ, సమాజంలో క్రిమినల్‌ లాయర్‌లకు ఎక్కువ సంపాదన ఉంటుందన్న అపోహ ఉంది. సివిల్‌ లాయర్లుగా పనిచేస్తూ కూడా మంచి పేరు, డబ్బు సంపాదించినవారు ఉన్నారు. అదే సమయంలో క్రిమినల్‌ లాయర్‌గా ఈ రెండూ సంపాదించనివారూ ఉన్నారు. ప్రొఫెషనల్‌ కోర్సులు చదివినవారు కెరియర్లో రాణించాలంటే డిగ్రీ మాత్రమే ఉంటే సరిపోదు. తెలివితేటలు, వ్యక్తిత్వం, విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు లాంటివి ప్రభావితం చేస్తాయి. న్యాయవాద వృత్తిలో వీటికి అదనంగా నెట్‌ వర్కింగ్‌ స్కిల్స్, సమయస్ఫూర్తి, లాజికల్‌/ అనలిటికల్‌ రీజనింగ్, జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఈ వృత్తిలో పేరు అంత త్వరగా రాదు. కొన్నేళ్లపాటు వాదించిన కేసులు, విజయాల శాతం, ఎన్ని క్లిష్టమైన కేసుల్ని విజయవంతంగా వాదించారు, నిజాయతీ, సమగ్రత లాంటి ఎన్నో కెరియర్‌ను ప్రభావితం చేస్తాయి. సివిల్, క్రిమినల్‌.. రెండూ న్యాయవ్యవస్థలో కీలకమైనవి కాబట్టి, మీ ఆసక్తిని బట్టి సరైన నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: సుధాకర్‌

    Ans:

    ఇంజినీరింగ్‌ చేయాలని ఎంపీసీ గ్రూప్‌ తీసుకోవడం సరైన నిర్ణయమే! కానీ మ్యాథ్స్‌ అంటే భయం అంటున్నారు. ఈ భయం ఎప్పటినుంచి ఉంది? మీకు పదో తరగతిలో మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులు వచ్చాయి? హైస్కూల్‌లో మ్యాథ్స్‌ టీచర్‌ సరిగా చెప్పకపోవడం వల్ల కానీ, కుటుంబంలో అక్క/అన్న మ్యాథ్స్‌లో ఫెయిల్‌ అవ్వడం వల్ల కానీ ఇలాంటి భయాలు మొదలవుతాయి. తోటి మిత్రులు అదే పనిగా మ్యాథ్స్‌ పట్ల భయం కలిగే మాటలు చెప్పడం వల్లనో, ఇప్పుడు ఇంటర్లో మ్యాథ్స్‌ లెక్చరర్‌ సరిగా చెప్పకపోవడం వల్లనో కూడా ఇలా జరగొచ్చు.
    నాకు తెలిసిన ఒక విద్యార్థి మీలాగే మ్యాథ్స్‌ అంటే భయపడి ఇంటర్‌లో దాన్ని వద్దనుకొని బైపీసీ చదివి, మెడికల్‌ ఎంట్రెన్స్‌లో విఫలమయ్యాడు. తరువాత ఇంటర్‌లో ఉన్న నాలుగు మ్యాథ్స్‌ పేపర్లను ప్రైవేటుగా రాసి ఎంసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. యూఎస్‌లో ఎమ్మెస్‌ చేసి, ప్రస్తుతం అక్కడే ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పెద్ద హోదాలో పనిచేస్తున్నాడు. మీరు కూడా మ్యాథ్స్‌పై భయం పోగొట్టుకొని, ఇంటర్‌ పూర్తిచేసి, మంచి కాలేజీలో మ్యాథ్స్‌తో ఎక్కువగా అవసరం లేని బ్రాంచితో ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ, మీరు ఇప్పుడు ఎంపీసీ గ్రూపు నుంచి వేరే గ్రూపునకు మారినా, భవిష్యత్తులో మీరు రాయబోయే ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో అరిథ్‌మెటిక్‌/ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ లాజికల్‌ రీజనింగ్‌/ డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ లాంటి సబ్జెక్టులకు మ్యాథ్స్‌లో ప్రాథమిక పరిజ్ఞానం చాలా అవసరం. ఇంజినీరింగ్‌ చదవడం కోసం కాకపోయినా భవిష్యత్తులో మెరుగైన ప్రభుత్వ ఉద్యోగం పొందడం కోసమైనా ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవడం ఉపయోగకరంగా ఉంటుంది. అవసరమైతే మ్యాథ్స్‌కు ట్యూషన్‌కు వెళ్లండి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    మీ స్నేహితుడికి బీబీఏతో పాటు పది సంవత్సరాల ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఈఎంబీఏ (ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ) చదవడమే మంచిది. డిస్టెన్స్‌ ఎంబీఏలో చాలామంది విద్యార్థులు ఉద్యోగానుభవం లేకుండా నేరుగా అడ్మిషన్‌ తీసుకొంటారు. చాలా డిస్టెన్స్‌ ఎంబీఏ ప్రోగ్రాంలలో కాంటాక్ట్‌ క్లాసులకు హాజరు అవ్వాల్సిన అవసరం కూడా లేనందున నైపుణ్యాలను నేర్చుకొనే అవకాశం ఉండదు. ఈఎంబీఏ క్లాస్‌ రూంలో అందరూ ఉద్యోగానుభవం ఉన్నవారే ఉండటం వల్ల ఒకరి అనుభవం నుంచి మరొకరు నేర్చుకొనే అవకాశాలు ఎక్కువ. ఈఎంబీఏ ప్రోగ్రాంలో ప్రతి సెమిస్టర్‌లో కొన్ని కాంటాక్ట్‌ క్లాసులు తప్పనిసరి. ప్రొఫెసర్స్‌ నుంచి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈఎంబీఏ బోధనావిధానం కూడా డిస్టెన్స్‌ ఎంబీఏ కంటే భిన్నం. ఈఎంబీఏలో ఎక్కువగా కేస్‌ డిస్కషన్, సెమినార్లు, గేమ్స్, యాక్టివిటీస్‌ల సహాయంతో బోధన ఉంటుంది. థియరీ కంటే మెనేజీరియల్‌/ ప్రాక్టికల్‌ అప్లికేషన్స్‌కు ప్రాముఖ్యం అధికం. ఈఎంబీఏను ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌ నుంచి చేస్తే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: prasanth

    Ans:

    బ్యాంకులో ఫైనాన్స్‌కు సంబంధించిన విభాగాల్లో పనిచేసినట్లయితే మీరు ఎంబీఏలో చదివిన ఫైనాన్స్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న వివిధ రకాల విభాగాలన్నీ పరిశీలించి, వాటిలో ఫైనాన్స్‌ సంబంధిత రంగాలను ఎంచుకొని అందుకు తగిన నైపుణ్యాలను పెంపొందించుకోండి. సాధారణంగా బ్యాంకుల్లో ఫైనాన్స్‌కి సంబంధించి  కార్పొరేట్‌ క్రెడిట్, రిటైల్‌ క్రెడిట్, ట్రెజరీ, ఫారెక్స్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ లాంటి విభాగాలుంటాయి. ఏ విభాగంలో పనిచేస్తే మంచి భవిష్యత్‌ ఉంటుంది అని అడిగారు. మీ దృష్టిలో మంచి భవిష్యత్తు అంటే ఎక్కువ వేతనం పొందడమా? పదోన్నతా? చేసే ఉద్యోగంలో సంతృప్తా? అనే విషయాలపై స్పష్టత అవసరం. మీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆశయాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: prasanth

    Ans:

    డూన్‌ బిజినెస్‌ స్కూల్, డెహ్రాడూన్‌లో బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సు చదవడానికి  ప్రవేశ పరీక్ష రాయవలసిన అవసరం లేదు. ఇంటర్మీడియట్‌ మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ తయారుచేసి ప్రవేశాలు కల్పిస్తారు. అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌ షిప్‌లూ ఉంటాయి. మరిన్ని వివరాలకోసం కాలేజీ వెబ్‌సైట్‌ని సందర్శించండి. కొన్ని వ్యవసాయ కళాశాలలు యూజీసీ/ ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్సిటీకి అనుబంధంగా ఉండి, ఐసీఏఆర్‌ నిర్దేశించిన సిలబస్‌తో డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. ఏదైనా అగ్రికల్చర్‌ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో చేరేముందు ఆ కోర్సుకు ఐసీఏఆర్‌ గుర్తింపు ఉందో, లేదో నిర్థరించుకోండి. వ్యవసాయ శాఖలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలకు ఐసీఏఆర్‌ గుర్తింపు ఉన్న డిగ్రీ అవసరం. కొన్ని ప్రైవేటురంగ సంస్థలు ఈ గుర్తింపు లేని డిగ్రీ చదివినవారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: prasanth

    Ans:

    మీరు ప్రస్తుతం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి సెలవు పెట్టి లా డిగ్రీని చదివిన తర్వాత మీరు మళ్లీ ఉద్యోగంలో చేరితే, ఆ డిగ్రీ  మీకెలా ఉపయోగపడుతుంది? ఆ డిగ్రీతో ప్రమోషన్‌ వస్తుందా? అనేవి పరిగణనలోకి తీసుకోండి. ఒకవేళ, మీరు ఉద్యోగానికి రాజీనామా చేసి లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తే, మొదట్లో కొంతకాలం పాటు ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అందుకు సంబంధించిన ఆర్థిక ఆసరాను ఏర్పాటు చేసుకున్నాక రాజీనామా చేయండి.
    మీరు లా కోర్సు చదువుతూనే న్యాయవాద వృత్తికి సంబంధించిన పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేయాలనుకుంటున్నారు. కానీ, లా లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్ని చదివేటప్పుడు ఆ కోర్సుపై పూర్తి శ్రద్ధ పెడితే విషయ పరిజ్ఞానం బాగా వస్తుంది. ఆర్థిక ఇబ్బందులవల్ల ఉద్యోగం చేయడం తప్పనిసరైతే ఎవరైనా సీ‡నియర్‌ లాయర్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరే ప్రయత్నం చేయండి. ఈ ప్రయాణంలో మీరు వృత్తి మెలకువలు నేర్చుకొంటారు గానీ, ఆశించినంతగా వేతనాలు లభించవు. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే విషయ పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలూ చాలా అవసరం. చేయబోయే పార్ట్‌ టైమ్‌ జాబ్‌లో వేతనంతో సంబంధం లేకుండా న్యాయవాద వృత్తిలో మెలకువలు, నైపుణ్యాలు నేర్చుకొనే ప్రయత్నం చేయండి.
    చివరిగా, మీ నిర్ణయం సరైనదేనా అనేది న్యాయవాద వృత్తిపై మీకున్న ఆసక్తి, మీ సామర్థ్యంపై మీకున్న నమ్మకం, కమ్యూనికేషన్, నెట్‌ వర్క్‌ నైపుణ్యాలు, క్లిష్ట సమస్యల్ని పరిష్కరించగల నేర్పు, మీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులు లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌