• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Navodaya: నవోదయలో నేరుగా తొమ్మిదిలోకి!

లేటరల్ ఎంట్రీకి ప్రకటన విడుదల

నాణ్యమైన విద్యను విద్యార్థులకు ఉచితంగా అందించే వేదికల్లో నవోదయలు ముఖ్యమైనవి. వీటిలో ప్రవేశం పొందినవారు ఇంటర్‌ (ప్లస్‌ 2) వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. తమలోని ప్రతిభ,  సృజనాత్మకతలకు మెరుగులద్దుకోవచ్చు. ఈ సంస్థల్లో ఆరో తరగతి నుంచి చదువుకునే అవకాశం ఉంటుంది. ఆరులో చేరిన విద్యార్థులు మధ్యలో వైదొలిగితే ఆ ఖాళీలను తొమ్మిదో తరగతిలో భర్తీ చేస్తారు. ఇందుకోసం ఎనిమిదో తరగతి చదువుతోన్నవారు లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశపరీక్ష రాసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తొమ్మిదిలో ఉన్న ఖాళీల భర్తీకి నవోదయ విద్యాసమితి ప్రకటన విడుదలచేసింది. 

నవోదయల నిర్వహణకు అవసరమైన నిధులన్నీ పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యా సమితి పనిచేస్తుంది. ఈ సంస్థల్లో కో ఎడ్యుకేషన్‌ విధానం అమలులో ఉంది. రాష్ట్రస్థాయిలో గురుకులాల్లో ఉన్నట్లు బాలబాలికలకు విడివిడిగా పాఠశాలలు ఉండవు. ఒకే తరగతి గదిలో విద్యార్థులు చదువుకుంటారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతోపాటు దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న విద్యార్థులకు బోధనతో పాటు వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫారం అన్నీ ఉచితంగానే అందిస్తారు. అధిక వేతనం ఉన్న ప్రభుత్వోద్యోగుల పిల్లలైతే ఇందుకోసం ప్రతి నెలా రూ.1500 చొప్పున చెల్లించాలి. మిగిలినవారు నెలకు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. 

నాణ్యమైన ఆధునిక విద్యను అందించడం నవోదయ విద్యాలయాల ప్రత్యేకత. చదువులకే పరిమితం కాకుండా విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కల్పిస్తారు. సంస్కృతి, విలువలు పెంపొందేలా చేస్తారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ప్రతి విద్యార్థీ మూడు భాషల్లో రాణించేలా కృషి చేస్తారు. ఇందుకోసం హిందీ రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర రాష్ట్రాలకూ, ఇతరులను హిందీ రాష్ట్రాలకూ పంపుతారు. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్, ఎన్‌డీఏ ..తదితర పరీక్షల్లో రాణించడానికి ప్రత్యేక శిక్షణ అందిస్తారు. లేటరల్‌ ఎంట్రీలో తొమ్మిదో తరగతిలో చేరడానికి పరీక్ష రాయాలి. అందులో ప్రతిభ చూపినవారిని చేర్చుకుంటారు. 

ప్రశ్నపత్రం ఇలా...

వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఇంగ్లిష్‌ 15, హిందీ 15, మ్యాథ్స్‌ 35, సైన్స్‌ 35 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ సీబీఎస్‌ఈ ఎనిమిదో తరగతి స్థాయిలో ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ / హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. 

ఎక్కడెక్కడ ఖాళీలు? 

ఆంధ్రప్రదేశ్‌లో: కృష్ణా-1, కర్నూలు-1, నెల్లూరు -2, ప్రకాశం -5, శ్రీకాకుళం-2, విశాఖపట్నం -4, విజయనగరం -3,  పశ్చిమ గోదావరి -4

తెలంగాణలో: ఆదిలాబాద్‌ - 3, కరీంనగర్‌ - 6, మహబూబ్‌నగర్‌-2, మెదక్‌ -8, నల్గొండ - 1, నిజామాబాద్‌ -3, రంగారెడ్డి -2, వరంగల్‌-1

అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరం (2021-22)లో ఎనిమిదో తరగతి ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతుండాలి. ప్రవేశం ఆశించే నవోదయ పరిధిలోని పాఠశాలకు చెందినవారై ఉండాలి. ఉన్న ఖాళీలలకు ఆయా జిల్లాల్లోని పాఠశాలల విద్యార్థులకే అవకాశం ఉంటుంది. పరీక్ష సైతం ఆ కేంద్రంలోనే రాయాలి. 

వయసు: మే 1, 2006 - ఏప్రిల్‌ 30, 2010 లోపు జన్మించివుండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 15

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 9

పరీక్ష కేంద్రాలు: సంబంధిత నవోదయ విద్యా సంస్థల్లో. 

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దళాల్లో దూసుకుపోవచ్చు!

‣ వరుస విజయాలే నిరంతర ప్రేరణ

Posted Date : 09-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌