‣ సైనిక్ స్కూళ్ల ప్రవేశపరీక్షకు ప్రకటన
త్రివిధ దళాల్లో సేవలు అందించాలనే ఆకాంక్ష ఉన్న విద్యార్థులకు సైనిక పాఠశాలలు వేదికలుగా నిలుస్తున్నాయి. ఇక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకోవచ్చు. చదువుతోపాటు రక్షణ రంగంలో ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. అందువల్ల వీరు ఎన్డీఏ, ఇతర డిఫెన్స్ పరీక్షల్లో మెరుగైన ప్రతిభ చూపగలుగుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఆరు, తొమ్మిదో తరగతులో ప్రవేశానికి నిర్వహించనున్న ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్ఎస్ఈఈ) -2022 ప్రకటన వెలువడింది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయనగరం జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కలికిరిలో సీట్లకు పోటీ పడవచ్చు!
దేశంలో ఎక్కువ నియామకాలు రక్షణ రంగంలో ఉంటున్నాయి. ఆర్మీ, నేవీ, ఏర్ఫోర్సులతోపాటు సీఏపీఎఫ్కు చెందిన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ...తదితర విభాగాల్లో క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడుతున్నాయి. ఎక్కువ నియామకాలు ఇంటర్మీడియట్ విద్యార్హతతో జరుగుతున్నాయి. యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ అండ్ ఎన్ఏ వీటిలో అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. అలాగే ఆర్మీలో గ్రూప్ ఎక్స్, వై. నేవీలో సెయిలర్-ఎంఆర్, ఎస్ఎస్ఆర్, ఏఏ. ఏర్ ఫోర్స్లో ఎయిర్ మెన్ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు ఇంటర్ విద్యార్హతతో భర్తీ చేస్తున్నారు. ఈ ప్రకటనలన్నీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వెలువడుతున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకున్నవారికి హైస్కూల్ నుంచే సరైన శిక్షణ ఉంటే సులువుగా విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ పరీక్షల్లో సైనిక పాఠశాల నేపథ్యం ఉన్న విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. రక్షణ రంగంలో ఉన్నత స్థాయిలో పనిచేసినవారు ఈ స్కూళ్లను పర్యవేక్షిస్తున్నారు. చదువుతోపాటు అవసరమైన శిక్షణ అందిస్తున్నారు. క్రీడలు, క్రమశిక్షణ, శారీరక దృఢత్వానికి ప్రాధాన్యముంటుంది. ఈ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన అందిస్తారు. ఆరో తరగతిలో ప్రవేశానికి బాలికలూ దరఖాస్తు చేసుకోవచ్చు. తొమ్మిదిలో చేరడానికి బాలురకే అవకాశం ఉంది.
ఎంపిక విధానం: ఆఫ్లైన్ పరీక్షలో చూపిన ప్రతిభ, మెడికల్ టెస్టులతో
పరీక్ష ఇలా
తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష 400 మార్కులకు ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. మ్యాథ్స్లో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇంగ్లిష్, ఇంటలిజెన్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఒక్కో విభాగం నుంచీ 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. సీబీఎస్ఈ ఎనిమిదో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
రెండు తరగతుల ప్రవేశాలకు సంబంధించి పరీక్ష సిలబస్ వివరాలు ప్రకటించారు. ఆయా సబ్జెక్టులవారీ ఆ పాఠ్యాంశాలను చదువుకుంటే సరిపోతుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. వాటికి సమాధానాలను ఓఎంఆర్ పత్రంపై గుర్తించాలి. పరీక్షలో అర్హత సాధించడానికి ఆయా సబ్జెక్టులవారీ కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే మొత్తం మీద 40 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కులు సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో సీటుకు ముగ్గురుని చొప్పున వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో విజయవంతమైనవారిని ఆరు, తొమ్మిదో తరగతుల్లో చేర్చుకుంటారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన లేదు.
సీట్లు.. ఫీజు
మొత్తం సీట్లలో 67 శాతం ఆ సైనిక్ స్కూల్ ఉన్న రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారికి దక్కుతాయి. కోరుకొండ సైనిక్ స్కూల్లో ఆరోతరగతిలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. వీటిలో 80 బాలురకు, 10 బాలికలకు కేటాయించారు. అలాగే తొమ్మిదిలో 30 సీట్లు ఉన్నాయి. కలికిరి సైనిక్ స్కూల్లో ఆరో తరగతిలో 105 సీట్లు ఉన్నాయి. వీటిలో 95 బాలురకు, 10 బాలికలకు కేటాయించారు. తొమ్మిదిలో 10 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లోని 67 శాతం సీట్లకు ఏపీ, తెలంగాణ విద్యార్థులు పోటీ పడవచ్చు. ఈ సంస్థల్లో చేరిన విద్యార్థులు ఫీజులు చెల్లించాలి. బోధన, వసతి, భోజనం అన్నీ కలుపుకుని ఏడాదికి సుమారు రూ.1.20 లక్షలు అవసరమవుతాయి. అయితే మెరిట్ విద్యార్థులు, అల్పాదాయ వర్గాలకు ఆయా రాష్ట్రాలు స్కాలర్షిప్పు అందించడం లేదా ఫీజు నుంచి మినహాయించడం చేస్తున్నాయి.
అర్హత
ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఏదైనా పాఠశాలలో అయిదో తరగతి చదువుతుండాలి. మార్చి 31, 2022 నాటికి వయసు 10 నుంచి 12 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2010 - మార్చి 31, 2012 మధ్య జన్మించినవారు అర్హులు. తొమ్మిదిలో చేరాలనుకున్నవారు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతుండాలి. వయసు మార్చి 31, 2022 నాటికి 13 నుంచి 15 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2007 - మార్చి 31, 2009 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆన్లైన్ దరఖాస్తులు: అక్టోబరు 26 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.400. మిగిలిన అందరికీ రూ.550.
పరీక్ష తేదీ: జనవరి 9
పరీక్ష కేంద్రాలు: ఏపీలో... అనంతపురం, గుంటూరు, కడప, కలికిరి, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో... హైదరాబాద్, కరీంనగర్.
వెబ్సైట్: https://aissee.nta.nic.in
*************************************
మరింత సమాచారం ... మీ కోసం!