• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

జులై 3 గడువు తేదీ
 

కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారతీయ తీర రక్షకదళం (కోస్టు గార్డు) 320 నావిక్, యాంత్రిక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఇంటర్మీడియట్, డిప్లొమా విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, శరీరదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. వీరు ఆకర్షణీయ వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు.

ఏటా రెండు సార్లు నావిక్, యాంత్రిక్‌ పోస్టులకు ఇండియన్‌ కోస్టు గార్డు ప్రకటనలు వెలువరిస్తోంది. వీటికి పురుషులే అర్హులు. నాలుగు దశల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలుంటాయి. 

నావిక్‌ జనరల్‌ డ్యూటీ: ఇందులో 260 ఖాళీలు ఉన్నాయి. వీటికి మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. 

యాంత్రిక్‌: ఈ పోస్టులకు ఎలక్ట్రికల్‌ / మెకానికల్‌ / ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ (రేడియో/పవర్‌) విభాగాల్లో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసుకున్నవారు అర్హులు. మెకానికల్‌లో 33, ఎలక్ట్రికల్‌ 18, ఎలక్ట్రానిక్స్‌ 9 ఖాళీలు ఉన్నాయి.   .

వయసు: అన్ని పోస్టులకూ 18 నుంచి 22 ఏళ్లలోపు ఉండాలి. అంటే మార్చి 1, 2003 - ఫిబ్రవరి 28, 2007 మధ్య జన్మించినవారు అర్హులు. అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌కు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. 


      పరీక్ష ఇలా..   

స్టేజ్‌-1లో భాగంగా నావిక్, యాంత్రిక్‌ రెండు ఉద్యోగాలకూ ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. రుణాత్మక మార్కులు లేవు. నాలుగు ఆప్షన్ల నుంచి సరైన సమాధానం గుర్తించాలి. మొత్తం 5 సెక్షన్లలో ప్రశ్నలు అడుగుతారు. రెండు పోస్టులకూ సెక్షన్‌-1 ఉమ్మడిగా ఉంటుంది. ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే వస్తాయి. మొత్తం 60 మార్కులకు 60 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథ్స్‌ 20, సైన్స్‌ 10, ఇంగ్లిష్‌ 15, రీజనింగ్‌ 10, జీకే 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. 


నావిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సెక్షన్‌-2 అదనంగా రాయాలి. ఈ విభాగానికి 50 మార్కులు. 50 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 30 నిమిషాలు. ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్, ఫిజిక్స్‌ ఒక్కో సబ్జెక్టులో 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. యాంత్రిక్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సెక్షన్‌-1తో పాటు సెక్షన్‌ 3, 4, 5లలో చదువుకున్న డిప్లొమా బ్రాంచీ ప్రకారం ఏదో ఒకటి రాయాలి. ఎలక్ట్రికల్‌ విభాగంవాళ్లు సెక్షన్‌-3, ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచీవారు సెక్షన్‌-4, మెకానికల్‌ డిప్లొమా అభ్యర్థులు సెక్షన్‌-5లో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో సెక్షన్‌కూ 50 మార్కులు. 50 ప్రశ్నలు వస్తాయి. వీటికి వ్యవధి 30 నిమిషాలు. అభ్యర్థులు ఎంచుకున్న బ్రాంచీలవారీ డిప్లొమా సిలబస్‌ నుంచే ఈ ప్రశ్నలు అడుగుతారు. మాదిరి ప్రశ్నలు, సెక్షన్ల వారీ సిలబస్‌ వివరాలు కోస్టు గార్డు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ప్రతి సెక్షన్‌లోనూ కనీస మార్కులు పొందడం తప్పనిసరి. జనరల్, ఈడబ్ల్యుఎస్, ఓబీసీ విభాగాల వారు సెక్షన్‌-1లో 30, మిగిలిన సెక్షన్లలో 20 చొప్పున మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలు సెక్షన్‌-1లో 27, మిగిలిన సెక్షన్లలో 17 చొప్పున మార్కులు పొందితే అర్హులగా పరిగణిస్తారు. ఇలా అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా స్టేజ్‌-2కు ఎంపిక చేస్తారు.     

స్టేజ్‌-2: ఈ పరీక్షలు ఒకటి లేదా రెండు రోజుల వ్యవధితో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. మార్కులు ఉండవు. ఇందులో భాగంగా 7 నిమిషాల్లో 1.6 కి.మీ.దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్‌అప్స్‌ తీయగలగాలి. అభ్యర్థి ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలతలో వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. తప్పనిసరి. 

స్టేజ్‌-3: స్టేజ్‌-2లో అర్హత సాధించినవారిని స్టేజ్‌-1 మెరిట్‌తో స్టేజ్‌-3కి ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్‌ఎస్‌ చిల్కలో మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హులు తర్వాతి దశకు చేరతారు. స్టేజ్‌-4లో భాగంగా అభ్యర్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాలు పరిశీలించి, అన్నీ సరిగా ఉంటే శిక్షణకు తీసుకుంటారు.  


      శిక్షణ, వేతనం   

నావిక్‌ జనరల్‌ డ్యూటీ, యాంత్రిక్‌ విభాగాలవారికి ప్రాథమిక శిక్షణ ఏప్రిల్, 2025 నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో ప్రారంభమవుతుంది. అనంతరం సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్‌ శిక్షణ నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. 

యాంత్రిక్‌ ఉద్యోగాలకు ఎంపికైనవారికి లెవెల్‌-5 రూ.29,200 మూల  వేతనం చెల్లిస్తారు. దీంతోపాటు రూ.6200 యాంత్రిక్‌ పే ఉంటుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే వీరు రూ.50,000 అందుకోవచ్చు. యాంత్రిక్‌ ఉద్యోగులు నౌకల నిర్వహణ, మరమ్మతులు వారి డిప్లొమా బ్రాంచీల ప్రకారం చూసుకుంటారు. పదోన్నతుల ద్వారా అసిస్టెంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ హోదాకు చేరుకోవచ్చు. 

‣ నావిక్‌ పోస్టుల్లో చేరినవారికి లెవెల్‌-3 రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. అన్ని ప్రోత్సాహకాలతో వీరు రూ.35 వేలకుపైగా జీతం పొందవచ్చు. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదాను అందుకోగలరు. నావిక్‌ జీడీ విభాగంలో చేరినవారు జనరల్‌ విధులు నిర్వర్తించాలి.

     గమనించండి   

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జులై 3 రాత్రి 11:30 గంటల వరకు స్వీకరిస్తారు.

ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు. 

పరీక్షలు: స్టేజ్‌-1 సెప్టెంబరులో నిర్వహిస్తారు. స్జేజ్‌-2 నవంబరులో, స్టేజ్‌-3 ఏప్రిల్‌లో ఉంటాయి.

స్టేజ్‌-1 పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో.. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌. ఏపీలో.. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ.

వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/cgept/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

Posted Date : 25-06-2024 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌