• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

300 ఖాళీల‌తో ప్ర‌క‌ట‌న‌

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఆఫ్‌ ఇండియా తాజాగా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 300 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (జనరలిస్ట్‌) ఖాళీలను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ పాసైనవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  


ఏఏఓగా ఎంపికై, శిక్షణ పూర్తిచేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఎల్‌ఐసీ శాఖల్లో నియమించవచ్చు. అభ్యర్థులు కనీసం మూడేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలి. నియమితులైన అభ్యర్థులకు ఏడాదిపాటు ప్రొబేషన్‌ ఉంటుంది. దీన్ని రెండేళ్లకు కూడా పెంచొచ్చు. ఉద్యోగంలో చేరడానికి ముందు నాలుగేళ్లపాటు పనిచేస్తామని గ్యారంటీ బాండ్‌ రాయాలి. 


రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ లేదా విభాగాధికారికి ఏఏఓలు అన్ని విధాలుగా సహాయపడగలగాలి. డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి. ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి. ఖాతాదారులు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సహాయ, సహకారాలను అందించగలగాలి. కొత్త పథకాలను ప్రవేశపెట్టడానికి అవసరమైన పరిశోధనలు చేయగలిగే నైపుణ్యం, ఆసక్తి ఉండాలి. 


ప్రకటించిన మొత్తం 300 ఖాళీల్లో ఎస్సీ-50, ఎస్టీ-27, ఓబీసీ-84, ఈడబ్ల్యూఎస్‌-27, అన్‌రిజర్వుడ్‌-112 కేటాయించారు. 01.01.2023 నాటికి అభ్యర్థుల వయసు 21-30 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుంది. 


ప్రిలిమినరీ పరీక్ష


ఈ ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. సమయం 60 నిమిషాలు. మొత్తం 3 సెక్షన్లు. సెక్షన్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 35 ప్రశ్నలకు 35 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు. ఇంగ్లిష్‌లో గ్రామర్, ఒకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ అనేది.. అర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో సాధించిన మార్కులను ర్యాంకింగ్‌లో లెక్కించరు. ప్రిలిమినరీ పరీక్షలో జనరల్‌ అభ్యర్థులకు కనీసార్హత మార్కులు 46. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 41 మార్కులు సాధించాలి. 


మెయిన్‌ పరీక్ష


వ్యవధి 2 గంటల 30 నిమిషాలు. ఆబ్జెక్టివ్‌ పరీక్ష 300 మార్కులకు, డిస్క్రిప్టివ్‌ 25 మార్కులు ఉంటుంది. ఈ రెండు పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ తప్ప మిగతా అన్ని సెక్షన్లూ ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటాయి. సెక్షన్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీ 30 ప్రశ్నలకు 90 మార్కులు. సమయం 40 నిమిషాలు. సెక్షన్‌-2లో జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌ ఉంటాయి. 30 ప్రశ్నలకు 60 మార్కులు, సమయం 20 నిమిషాలు. సెక్షన్‌-3లో డేటా ఎనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌  ప్రెటేషన్‌కు చెందిన 30 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 90 మార్కులు, సమయం 40 నిమిషాలు. సెక్షన్‌-4లో ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ అవేర్‌నెస్‌కు చెందిన 30 ప్రశ్నలు వస్తాయి. వీటికి 60 మార్కులు, సమయం 20 నిమిషాలు. నాలుగు సెక్షన్లలో 120 ప్రశ్నలను (300 మార్కులు) 2 గంటల్లో రాయాలి. సెక్షన్‌-5లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (లెటర్‌ రైటింగ్‌ అండ్‌ ఎస్సే) ఉంటుంది. 2 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. 30 నిమిషాల సమయం ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో సాధించిన మార్కులను తుది ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకోరు. 


కనీసార్హత మార్కులు: మెయిన్‌ పరీక్షలో ప్రతి సెక్షన్‌లోనూ పాసవ్వాలి. జనరల్‌ అభ్యర్థులు సెక్షన్‌-1లో 45, సెక్షన్‌-2లో 30, సెక్షన్‌-3లో 45, సెక్షన్‌-4లో 30 మార్కులు సంపాదించాలి.  ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు సెక్షన్‌-1లో 40, సెక్షన్‌-2లో 27, సెక్షన్‌-3లో 40, సెక్షన్‌-4లో 27 సాధించాలి. 


ప్రిలిమినరీ, మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్ష కోసం వీటిని సిద్ధంగా ఉంచుకోవాలి. 1. అభ్యర్థి ఫొటో అంటించిన కాల్‌ లెటర్‌. 2. అప్లికేషన్‌ ఫామ్‌/కాల్‌ లెటర్‌లో ఉన్న పేరుతోనే ఫొటో గుర్తింపు (ఫొటో ఐడెంటిటీ) పత్రం (ఒరిజినల్‌) 3. ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్‌ జిరాక్స్‌ కాపీ. 


ఇంటర్వ్యూ


మెయిన్‌ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక మెయిన్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ గరిష్ఠ మార్కులు 60. ఈడబ్ల్యూఎస్, అన్‌రిజర్వుడ్, ఓబీసీ అభ్యర్థులకు కనీసార్హత మార్కులు 30. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 27 మార్కులు సాధించాలి. అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. నెగ్గిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. అందులో అర్హత సాధించిన వాళ్లను చివరిగా ఎంపిక చేస్తారు. 


ఉచిత శిక్షణ


ఆన్‌లైన్‌ పరీక్షకు ముందు ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉచిత శిక్షణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ కేటగిరీల అభ్యర్థులు ఎల్‌ఐసీ డివిజినల్‌ ఆఫీసుల్లో తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవాలి. వీరికి శిక్షణ తేదీ, స్థలం.. మొదలైన వివరాలను డివిజనల్‌ ఆఫీస్‌ తర్వాత తెలియజేస్తుంది. నిర్దేశిత తేదీల్లో అభ్యర్థులు సొంత ఖర్చులతో శిక్షణకు హాజరుకావాలి. ఉచిత శిక్షణకు సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లోని కెరియర్స్‌ ట్యాబ్‌లో చూడొచ్చు. 


గమనించండి
దరఖాస్తు ఫీజు: రూ.700 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.85. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2023
ప్రిలిమినరీ పరీక్ష: 17.02.2023, 20.02.2023
మెయిన్‌ పరీక్ష: 18.03.2023
వెబ్‌సైట్‌: www.licindia.in
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

‣ మళ్లీ మళ్లీ చదవండి!

Posted Date : 20-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌