‣ ఉస్మానియా పీజీ జెనెటిక్స్ టాపర్
జెనెటిక్స్... ఒక అద్భుతమైన సబ్జెక్టు. జీవుల మూలాలను, అనువంశికతను అధ్యయనం చేసే సబ్జెక్టు ఇది. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్తో పాటు ఎం.ఎన్.ఆర్. కాలేజీ, షాదన్ కాలేజీల్లో మాత్రమే ఈ సబ్జెక్టు ఉంది. ఉస్మానియాలో ఎమ్మెస్సీ జెనెటిక్స్ చదివిన మురపాక విష్ణువచన యూనివర్సిటీలో, రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. ఈ విజయం వెనుక సాధన గురించి తన మాటల్లోనే...
మా తల్లిదండ్రులు వెంకటరమణ, జయశ్రీ. నాన్న జర్నలిస్టు. స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా సామర్లకోట. హైదరాబాద్లో స్థిరపడ్డారు. నేను ఇక్కడే పుట్టి పెరిగా. డిగ్రీ కోఠీ విమెన్స్ కాలేజీ, పీజీ ఉస్మానియా క్యాంపస్లో చేశాను. ఎమ్మెస్సీలో ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల ‘ఇన్స్పైర్’ ఫెలోషిప్ వస్తుందని భావిస్తున్నా. పీహెచ్డీ చేయాలన్నది నా కోరిక.
ఏదైనా సబ్జెక్టులో లేదా కోర్స్లో టాపర్ కావాలంటే ‘రోజూ 10 గంటలకు పైగా చదవాలి.. మంచి కోచింగ్ తీసుకోవాలి.. రేయింబవళ్లు కష్టపడాలి’ అనుకుంటారు చాలామంది. కానీ అంతకంటే ముఖ్యంగా సబ్జెక్టును ఇష్టపడి చదివితే పెద్దగా కష్టపడకుండానే అవగాహన పెరుగుతుందని నా ఉద్దేశం.
ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టు కేవలం చదివితే వచ్చేది కాదు. అధ్యయనం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం అర్థం చేసుకోగలం. ముందుగా సబ్జెక్టు మీద ఆసక్తి ఉంటే చాలు.. అవగాహన చేసుకోవడం సులభం అవుతుంది. జెనెటిక్స్ వంటి సబ్జెక్టు చదువుతున్నపుడు బేసిక్స్ బాగా వచ్చి ఉండాలి. ప్రతి జీవిలోనూ కణాలు ఉంటాయి. వాటిలో ఉండే జన్యువుల మీద అధ్యయనం చేయడమే జెనెటిక్స్ అంటే. విభిన్నమైన లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వారి సంతతికి చేరే ప్రక్రియ- ‘అనువంశికత’కు జన్యువులే కారణం. ఇంటర్లో ఈ విషయాలు చదివాక జన్యువు గురించి, దాని పని తీరు గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. దీంతో హైదరాబాద్లోని కోఠీ ఉమెన్స్ కాలేజీలో చేరి బీఎస్సీ జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ చేశాను. బీఎస్సీలో చదివిన సబ్జెక్టే కనుక ఎమ్మెస్సీలో జెనెటిక్స్ చదవడం సులభం అయ్యింది. నేను ఎక్కడా ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు కానీ నాకు సబ్జెక్టుపై బాగా ఆసక్తి ఉంది కనుక పుస్తకాలు చదవడం కన్నా ఆ సబ్జెక్టు గురించి ఎక్కువగా ఆలోచించేదానిని. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వల్ల కాన్సెప్ట్ బాగా అర్థం అయింది. డీటెయిల్డ్ నోట్స్ తయారు చేసుకున్నాను. ఆ నోట్స్ను ఎగ్జామ్ ముందు ఒక్కసారి చదివితే సరిపోయింది. ఆ తర్వాత జెనెటిక్స్, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ వంటి సబ్జెక్టులను టెక్స్ట్బుక్స్లో చదివాను. విదేశీ, స్వదేశీ రచయితలు రాసిన పాఠ్యపుస్తకాలన్నిటినీ రెండుసార్లు అయినా చదివి ఉంటాను. ప్రొఫెసర్లు పాఠాలు చెప్పేటప్పుడే శ్రద్ధగా విని అర్థం చేసుకుంటే సగం సబ్జెక్టు వచ్చేసినట్లే. ముఖ్యమైన పాయింట్స్ నోట్స్ రాసుకోవడం.. డౌట్స్ వస్తే ప్రొఫెసర్లతో చర్చించి నివృత్తి చేసుకోవడం వల్ల పరీక్ష సమయంలో సందేహాలేవీ రాలేదు. 8.75 సీజీపీఏతో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలిగాను.
ఇంటర్నెట్లో శోధించి నేను రాసుకున్న నోట్స్లో దాదాపుగా మా సబ్జెక్టు సమాచారం అంతా ఉంటుంది. మా క్లాస్మేట్స్ చాలామంది, మా జూనియర్స్ కూడా నా బుక్స్ జిరాక్స్ తీసుకుని చదువుకోవడం నాకెంతో ఆనందం కలిగించే అంశం!
సైన్స్ సబ్జెక్టు కేవలం చదివితే వచ్చేది కాదు. అధ్యయనం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే అర్థం చేసుకోగలం. ముందుగా సబ్జెక్టు మీద ఆసక్తి ఉంటే అవగాహన చేసుకోవడం సులభం అవుతుంది.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!
‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!