* ఇగ్నో తీసుకొచ్చిన అవకాశం
* విజయవాడ ప్రాంతీయ కేంద్రం ఏర్పడి 15 ఏళ్లు ఇప్పటివరకూ లక్షమందికి పైగా కోర్సుల పూర్తి
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘విజయవాడ కేంద్రంగా ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) తన రీజినల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. దశాబ్దంన్నర కాలం అవుతోంది. ఇప్పటివరకూ ఈ కేంద్రం ఆధ్వర్యంలో లక్ష మందికి పైగా విద్యార్థులు వివిధ యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులను పూర్తిచేశారు. తాజాగా ఈ ఏడాది నుంచి ఇగ్నోలో ఆధునికతను జోడిస్తూ అనేక కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 10 అధ్యయన కేంద్రాలున్నాయి. ఈ ఏడాది నుంచి దేశంలోనే తొలిసారిగా నూతన విద్యావిధానానికి అనుబంధంగా.. నాలుగేళ్ల డిగ్రీ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చారు.’
డిగ్రీ ప్రోగ్రాంలు: బీఏ, బీఏ ఆర్ట్స్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీకాం, బీఎస్డబ్ల్యూ ప్రోగ్రామ్లు ఉన్నాయి. వీటిలోనూ స్పెషలైజేషన్లు ఉంటాయి. ఒక్కో కోర్సు వ్యవధి నాలుగేళ్లు.
పీజీ సర్టిఫికెట్ కోర్సులు: ప్రోగ్రామ్ వ్యవధి ఆరు నెలలు. అగ్రికల్చర్ పాలసీ, క్లైమేట్ ఛేంజ్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఇన్వెంటరీ ప్లానింగ్ అండ్ వేర్హౌసింగ్ సిస్టమ్ ఫర్ ఇంజనీర్స్ మలయాళం, హిందీ ట్రాన్సిలేషన్ స్పెషలైజేషన్లు ఉన్నాయి.
పీజీ డిప్లొమా: ఈ కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో అనలిటికల్ కెమిస్ట్రీ. కౌన్సెలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హెల్త్కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చెయిన్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, యానిమల్ వెల్ఫేర్, ఇన్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ (కొత్తగా చేర్చారు).
సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్: ఈ ప్రోగ్రామ్ వ్యవధి ఆరు నెలలు. డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్యాషన్ డిజైన్, ఫస్ట్ ఎయిడ్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్, హెల్త్ కేర్ అండ్ మేనేజ్మెంట్, హిందూస్తానీ మ్యూజిక్, భరతనాట్యం, కర్ణాటక సంగీతం, రూరల్ డెవలప్మెంట్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి.
పీజీ: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంటీటీఎం, ఎంసీఏ, ఎంబీఏ (కొత్తగా చేర్చారు) కోర్సులు ఉన్నాయి. వీటిల్లో ఒక్కో దాంట్లో పలు స్పెషలైజేషన్లు ఉంటాయి. వీటి కాలవ్యవధి రెండేళ్లు.
డిప్లొమా: ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, డెయిరీ టెక్నాలజీ, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఫ్యాషన్ డిజైన్ అండ్ రిటైల్, హార్టికల్చర్, మీట్ టెక్నాలజీ, థియేటర్ ఆర్ట్స్ తదితర కోర్సులు.
అందరికీ అందుబాటులో ఉండేలా
చదువు మధ్యలోనే ఆపేసిన పేద, మధ్యతరగతి విద్యార్థులకు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి వయసుతో సంబంధం లేకుండా దూరవిద్య ద్వారా అధునాతన కోర్సులను ఇగ్నో అందిస్తోంది. ఏడాదికి రెండుసార్లు జనవరి, జులై నెలల్లో కోర్సులకు సంబంధించిన ప్రవేశాలు ఇందులో జరుగుతాయి. కేవలం యూజీ, పీజీ విద్యే కాకుండా.. నైపుణ్య శిక్షణను అందించే డిప్లొమో కోర్సులూ పెద్దసంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన వాటితో కలిపి ప్రస్తుతం 316 కోర్సులు ఉన్నాయి. వీటిలో ఆన్లైన్ ద్వారా 44, దూరవిద్యలో పీజీలో 60, పీజీ డిప్లొమోలో 61, డిగ్రీలో 40, సర్టిఫికేట్ కోర్సులు 77 అందిస్తున్నారు.
ప్రవేశాలు అంతా ఆన్లైన్లోనే..
ఇగ్నో ప్రవేశాల ప్రక్రియ మొత్తం దిల్లీ కేంద్రంగా జరుగుతుంది. అంతా ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. ప్రవేశాల కోసం ignouadmission.samarth.edu.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఒరిజనల్ ధ్రువపత్రాలు సమర్పించి.. ప్రవేశ రుసుం చెల్లించాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ ద్వారా నచ్చిన అధ్యయన కేంద్రాన్ని ఎంచుకోవాలి. తాజాగా కొత్త కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు అందుబాటులో ఉంచింది. గడువు ఈ నెల 31తో ముగియనుంది.
జులై 2024 సెషన్స్కు దరఖాస్తులు
ఇగ్నో ఆధ్వర్యంలో జులై 2024 సెషన్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ డైరెక్టర్ డాక్టర్ డి.ఆర్.శర్మ తెలిపారు. ఇగ్నో రీజనల్ సెంటరులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ జులై 31 అని చెప్పారు. రీజనల్ కేంద్రం పరిధిలో 12 అధ్యయన కేంద్రాలు, 44 మాస్టర్ డిగ్రీ, 24 డిగ్రీ, 46 డిప్లొమా పీజీ కళాశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. భగవద్గీత కోర్సు, ఎంబీఏ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఎంఏ ఉర్దూ కోర్సులు ప్రారంభించామని వెల్లడించారు. మొత్తం 13 కొత్త కోర్సులు ప్రారంభించినట్లు చెప్పారు. డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ కె.సుమలత, బి.ప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు.
* ఇగ్నోలో చదివేందుకు వయసు పరిమితి లేదు. ఏ వయసు వారైనా చదవచ్చు. చేరిన కోర్సుల బట్టి రూ.1,200 నుంచి రూ.50 వేల వరకు రుసుం చెల్లించాలి. వికలాంగులకు ఉపకారవేతనాలు అందుబాటులో ఉన్నాయి.
* ఇగ్నోలో జైళ్లలోని వాళ్లు కూడా చదువుకునే వెసులుబాటు ఉంది. ఏటా జూన్, డిసెంబరు నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు జరిగిన 45 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తాం. - ప్రసాద్ బాబు, ఇగ్నో, డిప్యూటీ డైరెక్టర్
ప్రవేశాలు అంతా ఆన్లైన్ప్రవేశాలు అంతా ఆన్లైన్లోనే..లోనే..ప్రవేశాలు అంతా ఆన్లైన్లోనే..