‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు భారీ ప్యాకేజీలు
‣ గరిష్ఠ వేతనం రూ.18 లక్షలు
‣ కోర్సులో చేరిన 66 మందికీ ఉద్యోగాలు
ఈనాడు, హైదరాబాద్: భారీ వేతనాలు కావాలంటే సాఫ్ట్వేర్ రంగం మాత్రమే గమ్యం కాదని నిరూపించారు ఈ విద్యార్థులు. వ్యవసాయ డిగ్రీ చదివి పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ మేనేజ్మెంట్ (అగ్రి బిజినెస్) కోర్సు పూర్తిచేసినవారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు దీటుగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ప్యాకేజీలతో ఆకర్షణీయమైన ఉద్యోగాలు వచ్చాయి. రాజేంద్రనగర్లోని ‘జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ’ (మేనేజ్) ఈ కోర్సును నిర్వహిస్తోంది. ఈ కోర్సు పూర్తిచేసిన 25వ బ్యాచ్లోని మొత్తం 66 మందికీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు దక్కాయి. వీరిలో 16 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. మొత్తం 27 పెద్ద కంపెనీలు భారీ వార్షిక వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలను ఆఫర్ చేశాయి. అత్యధికంగా ఏడాదికి రూ.18 లక్షల వేతనంతో పలువురికి ఉద్యోగాలొచ్చాయి. మొత్తం మీద సగటు వేతన ప్యాకేజీ రూ.11.51 లక్షలు కావడం విశేషం. జాతీయ బ్యాంకింగ్, ఆర్థికసంస్థలు, వ్యవసాయం దాని అనుబంధ రంగాల కంపెనీలు ఈ ప్లేస్మెంట్స్కు హాజరయ్యాయి. గోద్రెజ్ ఆగ్రోవెట్, ఐటీసీ, అదానీ విల్మర్, పీడబ్ల్యుసీ ఇండియా, కేపీఎంజీ, బీఏఎస్ఎఫ్, కోరమాండల్, ఫ్యూచర్ గ్రూప్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు తదితర కంపెనీలు ఉద్యోగాలిచ్చిన వాటిలో ఉన్నాయి.
ఏమిటీ కోర్సు.. ఎలా చేరాలి?
మేనేజ్ సంస్థ స్వయంప్రతిపత్తితో కేంద్ర వ్యవసాయశాఖ పరిధిలో పనిచేస్తోంది. జాతీయస్థాయిలో నిర్వహించే ‘క్యాట్’ రాసి మంచి ర్యాంకు సాధిస్తే వారి పర్సంటైల్ ఆధారంగా ఈ కోర్సులో సీట్లు కేటాయిస్తారు. వ్యవసాయ డిగ్రీ చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఐఐఎం ఎంబీఏ కోర్సులకు దీటుగా మేనేజ్ సంస్థ కోర్సు ఉంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, బ్యాంకులు, ఇతర సంస్థల్లో ఉన్నత హోదా గల ఉద్యోగాలొస్తున్నాయి. ప్రతిభావంతులకు కంపెనీలు మంచి ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. - చంద్రశేఖర, డైరెక్టర్ జనరల్, మేనేజ్
మరింత సమాచారం ... మీ కోసం!
ఊపందుకొంటున్న ఉపగ్రహ అంతర్జాలం
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.