‣ విద్యార్థులు నష్టపోకుండా యూజీసీ నిర్ణయం
ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకుని, ఫీజు చెల్లించి... అనుకోని కారణాలతో వేరే చోట చేరాల్సి వచ్చినప్పుడు సాధారణంగా విద్యార్థులు ముందు కళాశాలలో చెల్లించిన ఫీజులను కోల్పోవాల్సి వస్తుంది. అయితే 2022-23 విద్యాసంవత్సరంలో చేరే విద్యార్థులు ఇలా నష్టపోకుండా యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఓ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకూ విద్యార్థులు తమ అడ్మిషన్ను రద్దు చేసుకున్నా, వేరే క్యాంపస్కు మారాల్సి వచ్చినా ఎటువంటి రుసుములూ వసూలు చేయకుండా వారు చెల్లించిన మొత్తం ఫీజును కళాశాలలు తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అదే డిసెంబర్ 31 వరకూ అయితే కళాశాలలు రూ.వెయ్యి మాత్రమే ప్రాసెసింగ్ చార్జీల కింద వసూలు చేసి మిగతా మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కొవిడ్ కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న తల్లిదండ్రులకు పిల్లల ఫీజు మరింత భారం కాకుండా ఈ వెసులుబాటు కల్పించింది.
‣ మెస్, హాస్టల్, ట్యూషన్ ఫీజుతో సహా మొత్తం చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చేయాల్సిందిగా యూజీసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జేఈఈ, సీయూఈటీ, ఇతర ప్రవేశ పరీక్షలు ఈసారి ప్రతి సంవత్సరం కంటే కాస్త ఆలస్యం అవుతున్న నేపథ్యంలో... విద్యార్థులు ఇబ్బంది పడకుండా యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కరోనా సమయంలో విద్యార్థులు మెస్, హాస్టల్ సేవలను వినియోగించుకోలేదు కాబట్టి, అప్పుడు వారు కట్టిన ఫీజును ఈ విద్యాసంవత్సరానికి జమ చేసుకోవాల్సిందిగా విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలను విద్యాసంస్థలు అంగీకరించాలని కోరింది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఇంజినీరింగ్కి ఐఐటీ - మద్రాస్ టాప్!
‣ ఆర్మీలో 191 టెక్నికల్ పోస్టులు