‘ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీయేనా... అప్పుడప్పుడూ సరదాలతోనూ దోస్తీ చేయాలి డ్యూడ్... చదవాల్సిన వాటిని కాస్త వాయిదా వేస్తే ప్రపంచమేం తల్లకిందులు కాదు.’ అంటూ కాలం గడిపేవాళ్లు ఎందరో ఉంటారు. కానీ ఈలోగా పరీక్షలు దగ్గర పడటంతో సమయం వృథా అయ్యిందని కంగారు పడుతుంటారు. ఈ వాయిదాకు ముగింపు పలకాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందామా...
‣ చదవడం మొదలుపెడదాం అనుకోగానే.. ‘రేపటి నుంచి సీరియస్గా చదివేద్దాం... ఈ ఒక్కరోజుకు వాయిదా వేస్తే ఏం కాదులే’ అనే ఆలోచన వస్తుంటుంది. ఇలాంటి రెండో ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా వెంటనే చదవడం మొదలుపెట్టాలి.
‣ వాయిదా వీరులను గుట్టల్లా పేరుకున్న బ్యాక్లాగ్స్ నిద్రపోనీయవు. కాబట్టి ముందుగానే మేల్కొని చదవడం వల్ల ఫలితాలకు భయపడాల్సిన పని ఉండదు.
‣ ‘చూద్దాంలే... చేద్దాంలే’ అనుకుంటూ వచ్చిన అవకాశాలను జారవిడుచుకోవడం వల్ల అమూల్యమైన సమయం వృథా అవుతుంది. నిజానికి వాయిదా అనేది విలువైన సమయాన్ని హరించేసే పెద్ద దొంగ. దాని బారినపడకుండా కాలాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది.
‣ పరీక్షలు రాయడం అయిపోయిన తర్వాత.. ఒక్కసారి ప్రముఖుల జీవిత చరిత్రలను చదవడానికి ప్రయత్నించండి. అవి మీలోని ఎన్నో సందేహాలకు సమాధానం చెబుతాయి. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని మీరు చూసే కోణమే మారిపోతుంది. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.
‣ కొన్ని పనులను అనుకున్న వెంటనే మొదలుపెట్టాలి. లేకపోతే అవి ఎప్పటికీ వాయిదా పడుతూనే ఉంటాయి. కొంతకాలం తర్వాత అసలు మొదలు పెట్టాలనే ఉత్సాహమే ఉండదు.
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.