• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏ పుస్తకాలు.. ఎంత మేలు?

సర్కారీ కొలువు సాధ్యం ఇలా

పోటీ పరీక్షల లక్షణాల్ని అవగాహన చేసుకోవటం, సిలబస్‌పై పట్టు, ప్రశ్నపత్రాలను లోతుగా పరిశీలించటం అనే మూడు అంచెలు చూశాం. ప్రభుత్వ ఉద్యోగ సాధనలో నాలుగో సోపానం ‘సరైన పుస్తకాల ఎంపిక’. సిలబస్‌లోని వివిధ అంశాలను పరీక్ష, ప్రశ్నలు, స్కోరింగ్‌ కోణంలో ఎదుర్కొనే సమగ్ర సమాచారాన్ని పొందేందుకు మంచి పుస్తకాలు ఉపయోగపడతాయి. అందువల్ల సరైన పుస్తకాల ఎంపిక సగం విజయం! 

ఫలానా పరీక్షలకు ఉపయోగపడే పుస్తకం అని ప్రచురణకర్తలు ప్రకటించగానే అభ్యర్థులు పొలోమంటూ కొనేసి దాన్ని అనేకసార్లు చదివి విజయాన్ని సాధించాలని కోరుకుంటారు. ఇది ఒక రకంగా అత్యాశే. ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులు ఇలాంటి ట్రాప్‌లో పడతారు. ప్రశ్నపత్రాలను వాటి రూపకర్తలు ఏదో ఒక పుస్తకం మీద ఆధారపడి తయారుచేయరు. అంతిమంగా ప్రశ్నపత్రం కూడా అనేకమంది నిపుణుల నుంచి వచ్చిన ప్రశ్నల ఆధారంగా తయారవుతుంది. అందువల్ల ఒక సబ్జెక్టు కోసం ఒక ప్రాథమిక పుస్తకాన్ని ఎంపిక చేసుకుని మరో పుస్తకాన్ని రిఫరెన్స్‌ పుస్తకంగా వాడినట్లయితే మేలు జరిగే అవకాశం ఎక్కువ. అమాయకంగా ఎవరో చెప్పారని ఏదో ఒక్క పుస్తకాన్ని కొనుక్కుని అదే పరమావధిగా చదివినట్లయితే ఎక్కువ సందర్భాల్లో బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. చాలామంది ‘ఒక మంచి పుస్తకం చెప్పండి’ అని అడుగుతుంటారు, ఈ విషయాలేమీ తెలియక!

నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలు

ఏపీపీఎస్‌సీ తాజాగా 38 నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 7. ఒక్కో కేటగిరి ఉద్యోగానికి 2 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాలతో పరీక్ష నిర్వహిస్తారు. మొదటి పేపర్‌ జనరల్‌ స్టడీస్‌ 150 ప్రశ్నలు 150 మార్కులుగా పేర్కొన్నారు. రెండో పేపర్‌ సంబంధిత వృత్తి జ్ఞానానికి సంబంధించింది. ఈ రెండు పేపర్లలోని మార్కులను బట్టి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. 

అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి సంబంధించి 29 పోస్టులున్నాయి. గణితం, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్, కామర్స్, ఎకనామిక్స్‌ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు పోటీ పడేందుకు అర్హులు. కనీసం ఒక సంవత్సరం అయినా స్టాటిస్టిక్స్‌ ఒక పేపర్‌గా కలిగివుండటం తప్పనిసరి.

పరీక్షకు తగ్గట్టు ఎంపిక 

సాధారణ క్లరికల్‌ స్థాయి ఉద్యోగాల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగాల వరకు విభిన్న పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష స్థాయిని బట్టి పుస్తకాల ఎంపిక జరగాలి. డీఎస్సీ, కానిస్టేబుల్, గ్రామ సచివాలయాలు, గ్రూప్‌- 4 ఉద్యోగాలు మొదలైన పరీక్షలకు సాధారణంగా ప్రాథమిక స్థాయి పరిజ్ఞానంతో కూడిన ఎటువంటి పుస్తకాలు ఉపయోగపడతాయో గ్రహించాలి. కొన్నికొన్ని సందర్భాల్లో పోటీ అభ్యర్థుల సంఖ్యను బట్టి కఠినత్వాన్ని పెంచే వీలుంది. ఇలాంటపుడు ప్రాథమిక స్థాయి కంటే ఎక్కువ స్థాయి కఠినత్వంతో ప్రశ్నలుంటాయి. సాధారణ పరిజ్ఞానం సరిపోతుందనుకున్న సందర్భంలో 4-10 తరగతుల సైన్స్, సోషల్‌ సబ్జెక్టులను చదవటం మంచి బలాన్నిస్తుంది. గ్రూప్‌ టూ, గ్రూప్‌ వన్, యూపీఎస్సీ పరీక్షలు ఎదుర్కొనే అభ్యర్థులు కూడా ఈ బేసిక్‌ నాలెడ్జ్‌ మీద పట్టు సంపాదిస్తే కొంతవరకూ వారికి కావలసిన పరిజ్ఞానం లభిస్తుంది. 

‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అనేది జీవిత సత్యం కావచ్చు కానీ చిన్న పరీక్షనైనా పెద్ద పుస్తకాలు చదివి నెగ్గాలనుకుంటే అది ‘నేల విడిచిన సాము’ అవుతుంది. అందువల్ల పరీక్ష స్థాయిని బట్టి పుస్తకాలు ఎంపిక చేసుకుంటే సత్వర ప్రయోజనం వస్తుంది. గ్రూప్‌ వన్, గ్రూప్‌ టూ, యూపీఎస్సీ పరీక్షలకు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్‌ స్థాయి పుస్తకాల అధ్యయనం కూడా అవసరం. కొన్నికొన్ని సందర్భాల్లో పరిశోధనా పత్రాలు, ప్రభుత్వ నివేదికలు లాంటి వాటిని కూడా అధ్యయనం చేయాలి. స్థూలంగా చెప్పాలంటే- పరీక్షలను బట్టే పుస్తకాల స్థాయి నిర్ణయించుకోవాలి.

ప్రభుత్వ ప్రచురణలు, నివేదికలే ప్రామాణికం 

ఎస్‌సీఆర్‌టీ, ఎన్‌సీఈఆర్‌టీ, తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయాల ప్రచురణలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విడుదల చేసే యోజన, న్యూ ఇండియా సమాచార్, కురుక్షేత్ర, తెలంగాణ మాసపత్రిక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు, ఆర్థిక సర్వేలు, ఆర్బీఐ నివేదికలు, ప్రభుత్వ వెబ్‌సైట్లు మొదలైనవాటిని మూల వనరులుగా వాడుకోవాలి. అందులో ఉండే సమాచారం చాలావరకూ ప్రామాణికం.. ప్రశ్నపత్రాల రూపకర్తల దృష్టిలో. వీటిని ఉపయోగించుకుంటూ మార్కెట్‌లో ఉండే నాణ్యమైన పుస్తకాలను ఎంచుకుని అధ్యయనం చేయటం అధిక ప్రయోజనకరం.

తప్పులుంటాయి- జాగ్రత్త 

ఎంత గొప్ప పుస్తకాలు అయినా కొన్ని తప్పులు సర్వసాధారణంగా ఉంటాయి. ముఖ్యంగా చరిత్ర, ఎకానమీలో ఈ తప్పులు అధికం. అభ్యర్థులు తమకు లభించిన పుస్తకంలోని సమాచారమే సంజీవని అన్నట్లుగా వాటిని బట్టీ పట్టుకొనిపోతే మాత్రం పరీక్షల్లో దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. తెలుగు అకాడమీ పుస్తకంలో కూడా చాలా పొరపాట్లు దొర్లుతుంటాయి. అందువల్ల గుడ్డిగా సమాచారాన్ని విశ్వసించకుండా మరో పుస్తకంతో అంశాలను బేరీజు చేసుకోవటం ద్వారా తప్పులను తగ్గించుకోవచ్చు. ఎకానమీలో కూడా నివేదిక.. నివేదికకూ మధ్య గణాంకాల్లో తేడాలుంటాయి. ఆర్థిక సర్వేల్లోనూ గణాంకాల తప్పులు కనిపిస్తున్నాయి. అందువల్ల అభ్యర్థులు తాము కొన్న పుస్తకంలోని సమాచారం విషయంలో గుడ్డిగా వెళ్లకుండా ఒకటికి రెండుసార్లు క్రాస్‌ చెక్‌ చేసుకోవటం మంచిది. ముఖ్యంగా చరిత్రలో అనేక విషయాల్లో ఏకీభవించే సమాధానాలు ఉండటం లేదు. ఒక రచయితకూ, మరో రచయితకూ మధ్య తేడాలు ఉంటున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. నియామక సంస్థకు సంబంధించిన ప్రశ్నపత్రాల కీ పరిశీలించడం ద్వారా కొంతవరకు ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా సమీపంలో ఉండే కళాశాల అధ్యాపకుల నుంచి కూడా సరైన సమాధానాలు పొందవచ్చు.

పేజీల సైజు ముఖ్యం కాదు 

గ్రూప్స్, యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు పుస్తకాల్లోని పేజీల సంఖ్యను చూసి మురిసిపోతూ ఉంటారు. నిజానికి పరీక్షకు తగ్గ రీతిలో రచించిన పుస్తకం తక్కువ పేజీలు ఉన్నప్పటికీ ప్రయోజనాన్ని అధికంగా ఇస్తుంది. ఉదాహరణకు- ఇండియన్‌ పాలిటీకి సంబంధించి మార్కెట్లో దొరుకుతున్న పుస్తకాలు ‘భారత రాజ్యాంగం’ కంటే రెండు రెట్ల అధిక పేజీలతో ఉంటున్నాయి. నిజానికి న్యాయవాదులకూ, పరిశోధన అభ్యర్థులకూ ఉపయోగపడే స్థాయిలో ఉండే ఆ పుస్తకాల వల్ల పోటీ పరీక్షల్లో పరిమిత ప్రయోజనమే ఉంటుంది. కానీ అసలైన ప్రయోజనం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర, భారతదేశ చరిత్ర, ప్రపంచ భౌగోళిక వ్యవస్థ మొదలైన విభాగాల్లో ఇటువంటి సమస్య ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి అభ్యర్థులూ..తస్మాత్‌ జాగ్రత్త!

ఆబ్జెక్టివ్‌- సబ్జెక్టివ్‌ పరీక్షల కోసం.. 

రాయాల్సిన పరీక్ష ఆబ్జెక్టివ్‌ పరీక్ష అయితే ఆబ్జెక్టివ్‌ దిశలో సమాచారం ఉన్న పుస్తకాలను ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం. డీఎస్సీ, ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్, కానిస్టేబుల్, గ్రూప్‌ టు, జేఎల్, డీఎల్, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు, ఆర్‌ఆర్‌బీ పరీక్షలు ఈ కోవకి చెందుతాయి. ఇలాంటి పరీక్షల్ని ఎదుర్కోవాలంటే వివరణాత్మక సమాచారం కంటే లక్ష్యాత్మక సమాచారం ఎక్కువుండే పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి.  గ్రూప్‌-1 మెయిన్స్, యూపీఎస్‌సీ మెయిన్స్‌ మొదలైన పరీక్షలు ఎదుర్కొనేందుకు ఫ్యాక్ట్స్‌ కంటే వివరణ ఎక్కువగా ఉండే పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. ఆబ్జెక్టివ్‌ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాల ద్వారా సబ్జెక్టివ్‌ పరీక్షలోని ప్రశ్నలకు సమాధానాలు రాయటం సాధ్యం కాదు. అదేవిధంగా సబ్జెక్టివిటీ అధికంగా ఉన్న పుస్తకాలను చదివి ఆబ్జెక్టివ్‌ పరీక్షలు ఎదుర్కోవడం కష్టమైన విషయం. అందువల్ల మన పరీక్ష ప్రశ్నపత్రం ధోరణిని బట్టి పుస్తకాలను ఎంచుకోవాలి. గ్రూప్‌ టూ లాంటి పరీక్షల్లో ఫ్యాక్ట్స్‌తో పాటు సైద్ధాంతిక అనువర్తన అంశాలకు కూడా అధిక ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి వాటిని కవర్‌ చేసేవిధంగా పుస్తకాలు ఉంటేనే  విజయం సాధించవచ్చు.

అప్‌డేట్‌.. అప్‌డేట్‌

కొన్ని సబ్జెక్టులకు సంబంధించి గత రెండు మూడు దశాబ్దాలుగా మారే సమాచారం ఉండదు కాబట్టి అటువంటి సబ్జెక్టులో పాత పుస్తకాలు చదవటం వల్ల నష్టమేమీ ఉండదు. చరిత్ర, భారత భౌతిక భౌగోళిక అంశాలు, జనరల్‌ సైన్స్, ఆర్థిక  మౌలిక అంశాలు, స్టాక్‌ జీకే మొదలైనవి ఈ కోవకు చెందినవి. ఎకానమీ, శాస్త్ర సాంకేతికత, పాలిటీ, ఎకనమిక్‌ జాగ్రఫీ, హ్యూమన్‌ జాగ్రఫీ, వర్తమానాంశాలు మొదలైనవి రోజురోజుకీ మారుతూ ఉంటాయి. అంశాలను చదివేటప్పుడు తాజాగా ప్రచురితమైన పుస్తకాలను చదవటం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎగ్జామినర్‌ను ఆకర్షించే అంశాల్ని గుర్తించడం కూడా సులభం అవుతుంది. ముఖ్యంగా దిగువ స్థాయి ఉద్యోగాల పరీక్షల్లో స్టాటిక్‌ సమాచారం ఎక్కువ ప్రాధాన్యం పొందుతుంది. ఉన్నత స్థాయి ఉద్యోగాల పరీక్షల్లో ఈ స్టాటిక్‌ సమాచారానికి ప్రాధాన్యం తక్కువ, వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. ఈ భేదం గ్రహించి తగిన పుస్తకాలు చదవటం ద్వారా మాత్రమే ప్రయోజనం సమకూరుతుంది. 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎలా ఎంచుకోవాలి.. సరైన కెరియర్‌?

‣ సైన్యంలో సాంకేతిక పోస్టులు!

‣ కమ్యూనిటీ సైన్స్‌లో బీఎస్‌సీ

Posted Date : 18-10-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌