రోజూ కాలేజీకి వెళ్లే విద్యార్థులు గంటలతరబడి కూర్చోవాల్సి వస్తుంది. పోటీ పరీక్షలకు చదివే అభ్యర్థులైతే ఇక చెప్పాల్సిన పనేలేదు, పుస్తకాల ముందే రోజు గడిచిపోతుంటుంది. మరి ఇంతింతసేపు కుర్చీకి అతుక్కుపోతున్నప్పుడు.. మీరు సరిగ్గా కూర్చుంటున్నారో లేదో గమనిస్తున్నారా?
నీ సరిగ్గా కూర్చోవడం వల్ల శరీరానికి, మెదడుకు చాలా లాభాలున్నాయి. స్థిరమైన భంగిమ వల్ల వెన్నెముక, మెడ, భుజాలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. చక్కని ఏకాగ్రత కుదిరేందుకు తోడ్పడి చదువుతున్న అంశాలపై దృష్టి పెరుగుతుంది. త్వరగా అలసిపోకుండా చదవగలుగుతాం.
‣ అలా కాకుండా ఎలా పడితే అలా కూర్చోవడం వల్ల ఒళ్లంతా భారంగా అనిపిస్తుంది. తిమ్మిర్లు మొదలవుతాయి. పఠనంపై ఆసక్తి తగ్గుతుంది. కండరాలకు అనవసర శ్రమ కలుగుతుంది. దీనివల్ల ఒక్కోసారి తలనొప్పి కూడా రావొచ్చు.
‣ కూర్చునేటప్పుడు మరీ ముందుకు వంగకుండా, అలాగే మరీ వెనక్కి జారిపోకుండా వెన్ను నిటారుగా ఉంచాలి. కుర్చీ వెనుకభాగం మనకు దన్నుగా ఉండాలి.
‣ పాదాలు నేలకు తాకేలా ఉంచుతూ మోకాళ్లు కుర్చీకి సమాంతరంగా ఉండేలా కూర్చోవాలి. మరీ ముందుకు పడిపోయినట్లు, లేదా లోతులోకి కూరుకుపోయినట్టు ఉండకూడదు.
‣ చేతులకు బల్ల ఊతంగా ఉండాలి. వాటిని గాల్లో ఉంచడం మంచిది కాదు.
‣ కొన్నిసార్లు చదివేటప్పుడు ల్యాప్ట్యాప్ లేదా కంప్యూటర్ను కూడా వినియోగించాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో కీబోర్డు, మౌస్, స్క్రీన్ను మన ఎత్తుకు తగినట్టుగా మార్చుకోవాలి.
‣ చదివేటప్పుడు ఎక్కువగా ఉపయోగించే వస్తువులను.. అంటే పెన్, హైలైటర్, అవసరమైన పుస్తకాలన్నింటినీ పక్కనే ఉంచుకోవాలి. అందువల్ల అస్తమానూ చేతులు చాచి భుజాలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ చదువుకునే వారికి చక్కటిచోటు ముంబయి