• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కోర్టులో క్లర్క్‌ కొలువులు

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక



న్యూదిల్లీలోని భారత సర్వోన్నత న్యాయస్థానం ఒప్పంద ప్రాతిపదికన 90 లా క్లర్క్‌-కమ్‌-రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలుంటాయి. 


ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ పాసవడంతో పాటు.. అభ్యర్థికి రిసెర్చ్‌/ అనలిటికల్‌ స్కిల్స్, రాత నైపుణ్యాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సు చివరి ఏడాది చదువుతున్నవాళ్లు, ఏదైనా డిగ్రీ పూర్తిచేసి మూడేళ్ల లా కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేయొచ్చు.


15.02.2024 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500 ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. 


రాత పరీక్షలో..

రాత పరీక్ష పార్ట్‌-1లో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇవి అభ్యర్థికి ఉండే కాంప్రహెన్షన్‌ స్కిల్స్, చట్టాన్ని అర్థంచేసుకుని, అమలుచేసే నైపుణ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి. ప్రశ్నపత్రంలో 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకూ 1 మార్కు. వ్యవధి రెండున్నర గంటలు. 

ఎ) ఇంగ్లిష్‌లో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్యాసేజ్‌.. దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. 

బి) భారత రాజ్యాంగం, సీఆర్‌పీసీ, సీపీసీ, ఐపీసీ, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్, కాంట్రాక్ట్‌ యాక్ట్‌కు సంబంధించిన ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. 

సి) వివిధ చట్టాల్లో గత ఏడాది చేసిన మార్పులకు సంబంధించిన ప్రశ్నలూ ఇస్తారు. 

ప్రతి తప్పు సమాధానానికీ పావుమార్కు తగ్గిస్తారు. 


పార్ట్‌-2లో సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలను అడుగుతారు. ఇవి అభ్యర్థి రాత, విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించేలా ఉంటాయి. మొత్తం 300 మార్కులు. పరీక్ష వ్యవధి మూడున్నర గంటలు. దీంట్లో..

ఎ) ప్రశ్న-1 - బ్రీఫ్‌ ప్రిపరేషన్‌: దీంట్లో భాగంగా స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ లేదా సివిల్‌/ క్రిమినల్‌ అప్పీల్‌ లేదా రిట్‌ పిటిషన్‌ ఇస్తారు. దీన్ని 750 పదాలకు మించకుండా పేజీకి రెండువైపులా వచ్చేలా రాయాల్సివుంటుంది. ఇచ్చిన సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి.. ముఖ్యాంశాలను గుర్తించి.. విషయాన్ని క్లుప్తంగా, తార్కికంగా రాయగలిగే నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. 

బి) ప్రశ్న-2 - ప్రిపరేషన్‌ ఆఫ్‌ ఎ డ్రాఫ్ట్‌ రిసెర్చ్‌ మెమో: దీంట్లో ఇచ్చిన వివరాల ఆధారంగా అభ్యర్థి డ్రాఫ్ట్‌ రిసెర్చ్‌ మెమో రాయాలి. అది 500-750 పదాలకు మించకుండా ఉండాలి. దీనికి 75 మార్కులు. దీని ద్వారా వాస్తవాలను విశ్లేషించిన తీరు, చట్టపరమైన భాషను ఉపయోగించిన విధానం.. చట్ట వివరణ, చట్ట మూలాలను వినియోగించిన పద్ధతి.. మొదలైన వాటిని పరీక్షిస్తారు. 

సి) ప్రశ్న-3 - అనలిటికల్‌ ప్రశ్న: దీంట్లోని 5 విశ్లేషణాత్మక ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి. 350-500 పదాలు ఉండాలి. 75 మార్కులు. ఈ ప్రశ్న ద్వారా తగిన ఉదాహరణలు, కారణాలతో ఆర్గ్యుమెంటును రూపొందించిన విధానం, నిర్మాణం, వాక్యాలు రాసిన తీరు, వ్యాకరణం.. మొదలైన అంశాలను పరిశీలిస్తారు. 


పార్ట్‌-1లో 40 శాతం కంటే తక్కువ మార్కులు సాధించినవారి పార్ట్‌-2 సమాధాన పత్రాలను పరిగణనలోకి తీసుకోరు. పార్ట్‌-2లో 50 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. రెండు పార్టుల్లోనూ సంపాదించిన మార్కుల ఆధారంగా రాత పరీక్ష ఫలితాలను ప్రకటిస్తారు. 


పార్ట్‌-3లో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.  


పరీక్ష విధానం, మార్కులకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వీటిని గమనించడం ద్వారా పరీక్షకు సంబంధించిన అవగాహనను పెంచుకోవచ్చు. 


పార్ట్‌-1, పార్ట్‌-2 పరీక్షలను రెండు సెషన్లలో ఒకే రోజున నిర్వహిస్తారు. అయితే రెండు పరీక్షల మధ్యా కొంత విరామం ఉంటుంది. 


దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. 


దరఖాస్తుకు చివరి తేదీ: 15.02.2024


రాత పరీక్ష తేదీ: 10.03.2024


వెబ్‌సైట్‌: https://www.sci.gov.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date : 06-02-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌