‣ హెచ్సీఎల్ ‘టెక్ బి’ కార్యక్రమం కింద కొలువుల భర్తీ
‣ ప్రస్తుతం 1000 మందికి ఉపాధి
ఐటీ రంగం అంటేనే పుట్టిన ఊరు, రాష్ట్రం, దేశవిదేశాలు దాటి వెళ్లి పని చేయాల్సిన పరిస్థితి. దీంతో ఆశించిన జీతం, సకల సౌకర్యాలు లభించినా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఇలా కావాల్సిన వాళ్లందరికీ దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలాంటి కారణాలతో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో బహుళ స్థాయి కంపెనీల్లో ఒకటైన హెచ్సీఎల్ అక్కడి స్థానికులకు ఒక పరిష్కారం చూపుతోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు ఏపీలోనే ఉద్యోగాలు చేసుకునేలా ‘కమ్ బ్యాక్ హోమ్’ కార్యక్రమాన్ని చేపట్టింది. 2017 నుంచి సంస్థ దీన్ని మొదలుపెట్టింది. ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని తమ క్యాంపస్ పరిధిలో మరింతగా అమలు చేయనున్నారు. విద్యార్థులు, అనుభవజ్ఞులైన ఐటీ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సొంత రాష్ట్రంలోనే ఉండి ఉపాధి పొందవచ్చు. హెచ్సీఎల్ సంస్థ ఏపీ ప్రభుత్వ సహకారంతో ఇక్కడే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోంది.
ఇంటర్ విద్యార్థులకు..
ఇంటర్మీడియట్ అర్హతతోనే ఐటీ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకూ ‘టెక్ బి’ కార్యక్రమం ద్వారా హెచ్సీఎల్ అవకాశం కల్పిస్తోంది. దీనికి ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారితో పాటు గత రెండేళ్లలో ఇంటర్ ఉత్తీర్ణులై విద్యార్థులు అర్హులు. ఆసక్తి కలిగిన వారు హెచ్సీఎల్ ‘టెక్ బి’ కార్యక్రమం కింద పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఏడాది పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత ఉద్యోగావకాశం కల్పిస్తారు. ఇందుకు శిక్షణ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఉద్యోగంలో చేరిన తర్వాత బిట్స్ పిలానీ, శాస్త్ర విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహకరిస్తారు.
దరఖాస్తు ఇలా..
విజయవాడలోని హెచ్సీఎల్ క్యాంపస్లో ప్రస్తుతం 1500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. నాలుగేళ్లలో ఈ సంఖ్యను 5000 వేలకు పెంచాలనే లక్ష్యంలో భాగంగా ఇప్పుడు 1000 మందికి ఉపాధి కల్పించాలని కంపెనీ నిర్ణయించింది. ఇందుకు కావాల్సిన ఉద్యోగుల ఎంపికను ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేపట్టనున్నారు. ‘హెచ్సీఎల్ న్యూ విస్టాస్’ కార్యక్రమం ద్వారా వర్చువల్ విధానంలో ఈ నియామకాలు జరుగనున్నాయి. ఇంజనీరింగ్ ఫ్రెషర్స్, అనుభవం కలిగిన ఐటీ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం కలిగిన వారికి జావా, డాట్నెట్, చిప్ డిజైనింగ్, తదితర అంశాలపై పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 11లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
వెబ్సైట్: https://www.hcltech.com/careers/vijayawada