‣ గ్రాడ్యుయేట్లకు అవకాశం
‣ మౌఖిక పరీక్షల ద్వారా నియామకాలు
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు ప్రకటనలు వెలువరించింది. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో శిక్షణలోకి తీసుకుంటారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలు అందిస్తారు!
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఏడాదికి రెండుసార్లు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు ప్రకటనలు విడుదల చేస్తోంది. వచ్చిన దరఖాస్తులను వారి మార్కుల ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణ భారతీయులకు బెంగళూరులో ఈ మౌఖిక పరీక్షలు ఉంటాయి. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో అయిదు రోజుల పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్ 1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు.
శిక్షణ.. వేతనాలు
వీరికి ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడెమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్ట్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని పర్మనెంట్ కమిషన్లోకి (శాశ్వత ఉద్యోగం) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్ పొడిగిస్తారు. అనంతరం వైదొలగాల్సి ఉంటుంది.
లెఫ్టినెంట్గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలకు చేరుకోవచ్చు. విధుల్లో చేరినవారికి రూ.56,100 మూలవేతనంతోపాటు మిలట్రీ సర్వీస్ పే, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. ప్రోత్సాహకాలూ పొందవచ్చు.
దరఖాస్తు ఎప్పుడు?
పోస్టు: ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
మొత్తం ఖాళీలు: 55. వీటిలో 50 పురుషులకు, 5 మహిళలకు కేటాయించారు. ఈ రెండు విభాగాల్లోనూ 6 (పురుషులు 5, మహిళలు 1) పోస్టులు యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు అకడమిక్ సంవత్సరాలు ఎన్సీసీ సీనియర్ డివిజన్ వింగ్లో కొనసాగి ఉండాలి. ఎన్సీసీ సి సర్టిఫికెట్లో కనీసం బి గ్రేడ్ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్సీసీ సి సర్టిఫికెట్ అవసరం లేదు.
వయసు: జనవరి 1, 2021 నాటికి 19 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1996 - జనవరి 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆన్లైన్ దరఖాస్తులు: జనవరి 28 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు.
వెబ్సైట్: http://www.joinindianarmy.nic.in/Authentication.aspx